Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
High Court Bench Formation: కర్నూలులో 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. కానీ అది ప్రభుత్వం చేతుల్లో లేదు. ఎలా సాధించగలరు?

Rayalaseema High Court Bench Kurnool Demand: రాయలసీమ ప్రాంత ప్రజల దశాబ్దాల నాటి ఆకాంక్ష అయిన కర్నూలులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటన తీవ్ర ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. 90 రోజుల్లో కర్నూలులో హైకోర్టు బెంచ్ అందుబాటులోకి వస్తుందని ఆయన ప్రకటించారు. అయితే, ఒక రాష్ట్రంలో లేదా ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలోని అంశం మాత్రమే కాదు. దీనికి సుదీర్ఘమైన రాజ్యాంగపరమైన, న్యాయపరమైన, పరిపాలనాపరమైన ప్రక్రియలు అవసరమవుతాయి. అందుకే 90 రోజుల గడువు సాధ్యమేనా? అసలు బెంచ్ ఏర్పాటు వెనుక ఉండే చట్టపరమైన క్రమం ఏమిటి?
పూర్తిగా న్యాయపరమైన ప్రక్రియ
సాధారణంగా ఏదైనా రాష్ట్రంలో హైకోర్టుకు చెందిన ఒక ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేయాలంటే ది స్టేట్ హైకోర్ట్స్ యాక్ట్ లేదా సంబంధిత పునర్వ్యవస్థీకరణ చట్టాల నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను మొదట రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించాలి. అనంతరం, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలోని ఫుల్ కోర్ట్ ముందుకు ఈ ప్రతిపాదన వెళుతుంది. హైకోర్టు ఫుల్ కోర్ట్ ఈ బెంచ్ ఏర్పాటుకు సాంకేతిక, మౌలిక వసతుల సాధ్యాసాధ్యాలను పరిశీలించి పూర్తి స్థాయిలో ఆమోదం తెలపాల్సి ఉంటుంది.
హైకోర్టు ఫుల్ కోర్టు ఆమోదం తప్పనిసరి
హైకోర్టు ఫుల్ కోర్ట్ అంగీకారం తెలిపిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనను కేంద్ర న్యాయ శాఖ కు నివేదిస్తుంది. కేంద్ర ప్రభుత్వం దీనిని భారత ప్రధాన న్యాయమూర్తి , సుప్రీంకోర్టు కొలీజియం పరిశీలనకు పంపుతుంది. సుప్రీంకోర్టు సీజేఐ , కొలీజియం నుండి అనుమతి లభించిన తర్వాత మాత్రమే, కేంద్ర హోంశాఖ భారత రాష్ట్రపతి ఆమోదం కోసం ఫైలును పంపుతుంది. భారత రాజ్యాంగంలోని అధికరణ 214, సంబంధిత నిబంధనల ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన తర్వాతే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చట్టబద్ధంగా రూపుదిద్దుకుంటుంది.
మౌలిక సదుపాయాల కల్పన ముఖ్యం
రాజ్యాంగపరమైన ఈ ప్రక్రియతో పాటు క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన అత్యంత ప్రధానమైనది. బెంచ్ నిర్వహణకు అవసరమైన తాత్కాలిక లేదా శాశ్వత భవనాలు, న్యాయమూర్తులకు నివాస సదుపాయాలు , కోర్టు హాళ్లు, రిజిస్ట్రీ సెక్షన్లు, అడ్వకేట్ రూమ్లు, పోలీస్ బందోబస్తు , డిజిటల్ నెట్వర్కింగ్ వంటి మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయాలి. వీటితో పాటు అమరావతిలోని ప్రధాన హైకోర్టు నుండి కర్నూలు బెంచ్కు ఏ ఏ జిల్లాల కేసుల అధికార పరిధి బదిలీ చేయాలనే దానిపై న్యాయ పరిపాలనా పరమైన స్పష్టత రావాల్సి ఉంటుంది.
సుదీర్ఘమైన ప్రక్రియకు 90 రోజుల గడవు
ఇంతటి సుదీర్ఘ ప్రక్రియ ఉన్నప్పటికీ మంత్రి నారా లోకేష్ 90 రోజుల గడువు విధించడం వెనుక కూటమి ప్రభుత్వ వ్యూహాత్మక ఆలోచన ఉందని రాజకీయ, న్యాయ విశ్లేషకులు భావిస్తున్నారు. కర్నూలులో ఇప్పటికే లోకాయుక్త వంటి న్యాయ సంస్థలకు ఉద్దేశించిన భవనాలు సిద్ధంగా ఉన్నందున, ప్రాథమికంగా తాత్కాలిక భవనంలో బెంచ్ కార్యకలాపాలు ప్రారంభించే వెసులుబాటును ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రంతో మంచి సఖ్యతతో ఉన్నందున, రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం త్వరితగతిన పూర్తి చేసి, సుప్రీంకోర్టు, హైకోర్టు సీజేల అనుమతుల ప్రక్రియను ఫాస్ట్ ట్రాక్ చేయాలనేది లోకేష్ వేసిన కచ్చితమైన ముందస్తు ప్రణాళికగా కనిపిస్తోంది. గతంలో బెంచ్ ఏర్పాటు ప్రక్రియలపై న్యాయవాదుల నిరసనలు, వినతులు జాప్యానికి కారణమైన ఆధారాలు ఉన్నాయి. అందువల్ల, 90 రోజుల్లో అన్ని రాజ్యాంగ ఆమోదాలు, రాష్ట్రపతి ఉత్తర్వులు పొందడం సవాలుతో కూడుకున్నదే అయినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం గట్టి పట్టుదలతో పరిపాలనాపరమైన క్లియరెన్సులను వేగవంతం చేస్తే, నిర్ణీత సమయంలో లేదా దానికి సమీప కాలంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ కల సాకారమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















