Kaleshwaram Project Politics: కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
Kaleshwaram: తెలంగాణ రాజకీయాలు కాళేశ్వరం చుట్టూ తిరుగుతున్నాయి. నీళ్లు ఎత్తిపోయకుండా రైతులను అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. దీనిపై చర్చకు కాంగ్రెస్ సవాల్ చేస్తోంది.

Telangana Assembly Debate Kaleshwaram Irrigation: తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు మరోసారి అత్యంత హాట్ టాపిక్గా మారింది. గోదావరి నదిలో వరద నీరు పుష్కలంగా ప్రవహిస్తున్న తరుణంలో, ప్రాజెక్టు మోటార్లను ఆన్ చేసి నీటిని ఎత్తిపోయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేస్తుండగా.. పొరపాటున ఇప్పుడు గనుక పంపులు ఆన్ చేస్తే ప్రాజెక్టు బ్యారేజీలు పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో అసలు గోదావరిలో ఎత్తిపోసేందుకు తగినన్ని నీళ్లు ఉన్నాయా? జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఏం చెబుతోంది? ఈ సాంకేతిక నివేదికలను పక్కనపెట్టి బీఆర్ఎస్ ఎందుకు పట్టుబడుతోంది?.
నీళ్లు ఎత్తిపోస్తే ఏ సమస్యా రాదంటున్న బీఆర్ఎస్
బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్,హరీష్ రావు ప్రధాన వాదనల ప్రకారం.. కాళేశ్వరం ప్రాజెక్టులోని పంప్ హౌస్లు, మోటార్లు అన్నీ సురక్షితంగా ఉన్నాయని, కేవలం కొన్ని బ్యారేజీల పిల్లర్లు మాత్రమే దెబ్బతిన్నాయని అంటున్నారు. వరద నీరు సముద్రం పాలు కాకుండా, పంపింగ్ సిస్టమ్ను ఉపయోగించి మిడ్ మానేరు, లోయర్ మానేరు వంటి రిజర్వాయర్లను నింపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కావాలనే పొలిటికల్ మైలేజ్ కోసం, గత ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే కుట్రతోనే కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయడం లేదని బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్తో పాటు ఆ పార్టీ శ్రేణులు గట్టిగా ప్రచారం చేస్తున్నాయి. తద్వారా ప్రాజెక్టును ఎందుకూ పనికిరానిది గా చిత్రించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని వారు ఆరోపిస్తున్నారు.
సమస్య మోటార్లతో కాదు.. బ్యారేజీలతోనే
బీఆర్ఎస్ చెబుతున్నట్లు పంప్ హౌస్లు బాగున్నాయన్నది నిజమే అయినా, ఆ పంపులకు నీటిని అందించే మేడిగడ్డ , అన్నారం బ్యారేజీల పునాదులు కదిలిపోయాయని ఎన్డీఎస్ఏ రిపోర్టు ఉందని ప్రభుత్వం చెబుతోంది. నిల్వ ఉంచే సామర్థ్యం లేని చోట పంపింగ్ చేయడం అసాధ్యమని కాంగ్రెస్ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన గైడ్లైన్స్, మధ్యంతర నివేదికలను బలంగా చూపిస్తోంది. గత ఏడాది మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం, అన్నారం బ్యారేజీలో ఊటలు రావడం వంటి ఘటనల తర్వాత రంగంలోకి దిగిన ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బ్యారేజీలలో పూర్తిస్థాయిలో మరమ్మతులు జరగకుండా, పునాదుల కింద గ్రౌటింగ్ పూర్తికాకుండా నీటిని నిల్వ ఉంచడం అత్యంత ప్రమాదకరమని స్పష్టం చేసింది. బ్యారేజీలో నీటిని నిల్వ ఉంచితే ఏర్పడే హైడ్రోస్టాటిక్ ప్రెజర్ వల్ల మిగిలిన పిల్లర్లు కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని నివేదిక పేర్కొంది. బ్యారేజీలో నీరు నిలబడితేనే పంప్ హౌస్ల ద్వారా నీటిని ఎత్తిపోయడం సాధ్యమవుతుంది, కాబట్టి బ్యారేజీలు బలహీనంగా ఉన్నప్పుడు నీటిని ఎత్తిపోయడం అంటే ఆత్మహత్యాసదృశ్యమేనని అధికార పక్షం అంటోంది.
అసెంబ్లీలో చర్చకు రేవంత్ సవాల్
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలకు ఓ బహిరంగ సవాల్ విసిరింది. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లోపాలు, అడ్డగోలు ఖర్చులు, ప్రస్తుత దుస్థితిపై అసెంబ్లీ వేదికగా సుదీర్ఘమైన లైవ్ చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విపక్ష నేతలకు సవాల్ చేశారు. అసెంబ్లీలో గనుక సమగ్రంగా చర్చిస్తే.. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన సాంకేతిక తప్పిదాలు, విచారణ కమిషన్ల నివేదికలు, జ్యుడీషియల్ ఎంక్వైరీ వివరాలన్నీ అధికారికంగా ప్రజల ముందుకు వస్తాయి. దీనివల్ల కాళేశ్వరం ప్రాజెక్టు రీ-డిజైనింగ్ పేరిట జరిగిన వేల కోట్ల రూపాయల వ్యయం వెనుక ఉన్న అసలు నిజాలు బయటపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సవాల్ పై హరీష్ రావు స్పందించారు. అయితే కేసీఆర్ ఎందుకని తామే వస్తామని ఆయన అంటున్నారు. గతంలో కాళేశ్వరంపై జరిగిన లఘు చర్చలకు గులాబీ బాస్ కేసీఆర్ హాజరుకాలేదు. ఒకవేళ ఈసారి అసెంబ్లీలో గనుక కాళేశ్వరంపై పూర్తిస్థాయి పోరు జరిగితే, అది ఉభయ పార్టీలకు చావో రేవో లాంటి పరిస్థితిగా మారుతుంది. తాము నిర్మించిన ప్రాజెక్టును కాంగ్రెస్ చేతకానితనంతోనే వదిలేసిందని నిరూపించాలనే పట్టుదలతో బీఆర్ఎస్ ఉంటే.. ప్రాజెక్టు కేవలం ఒక కమీషన్ల స్కామ్ అని, కేసీఆర్ నిర్వాకం వల్లే ఇవాళ నీళ్లు పోయలేకపోతున్నామని తెలంగాణ ప్రజలకు బలంగా చాటాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. కానీ కేసీఆర్ రాకపోతే చర్చ జరగడం కష్టం.
నిజాలు ప్రజలకు తెలియాలి !
కాళేశ్వరం నీటి ఎత్తిపోతలపై జరుగుతున్న ఈ ప్రచార యుద్ధంలో ప్రజలకు ఏది నిజం, ఏది అబద్ధం అనేది తెలియాలంటే అసెంబ్లీ వేదికగా నిపుణుల సమక్షంలో పారదర్శకమైన చర్చ జరగడం ముఖ్యం. కేవలం సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు, కౌంటర్ ట్వీట్లతో పొలిటికల్ డ్రామా నడపడం వల్ల తెలంగాణ రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరదు. ఎన్డీఎస్ఏ నివేదికలోని సాంకేతిక అంశాలను, క్షేత్రస్థాయి వాస్తవాలను ఉభయ పక్షాలు అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందు ఉంచినప్పుడే.. తెలంగాణ ప్రయోజనాల కోసం నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు భవిష్యత్తు ఏంటనేది ఒక కొలిక్కి వస్తుందన్నది రాజకీయవర్గాల అభిప్రాయం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















