CM Revanth Reddy: కాళేశ్వరం కూలడమే కేసీఆర్ అవినీతికి నిదర్శనం.. సీబీఐ విచారణ జరపాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ తన ఆర్థిక ప్రయోజనాల కోసం తుమ్మిడిహట్టి వద్ద కట్టాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డ వద్ద కట్టి 38 వేలకు కావాల్సిన ప్రాజెక్టును లక్షా 50 వేల కోట్లకు ఖర్చు పెంచారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో తలెత్తిన సాంకేతిక లోపాలపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై తెలంగాణ ప్రభుత్వానికి ఒక స్పష్టత వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం కూలడమే కేసీఆర్ అవినీతికి నిదర్శనమని.. కాళేశ్వరం లోపాలపై విచారణకు ఏమైనా చర్యలు ఉంటాయని భయంతో హరీష్ రావు, వినోద్ హడావుడిగా ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతల కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. ఇంకెన్ని రోజులు బీజేపీని అడ్డం పెట్టుకుని అవినీతి బయటకు రాకుండా చూస్తారు, విచారణ జరగకుండా రాజీ పడతారని ప్రశ్నించారు. ఇకనైనా కేంద్రం సీబీఐ విచారణకు ఆదేశించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
వైఎస్సార్ ప్రాజెక్టును ప్రారంభించారు..
సోమవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) చైర్మన్ అనిల్ జైన్తో కలిసి ఆయన మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. క్షేత్రస్థాయిలో బ్యారేజీ పరిస్థితిని పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2009లో అప్పటి సీఎం వైఎస్సార్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు టెండర్ ప్రక్రియను పూర్తి చేసి పనులను ప్రారంభించారని తెలిపారు. 38,500 కోట్లతో 16 లక్షల ఎకరాలకు, పరిశ్రమలకు, హైదరాబాద్ కు తాగునీటి సమస్య తీర్చేందుకు ప్రాజెక్టు పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.

‘తెలంగాణ ఏర్పాటుకు ముందు 6150 కోట్లు ఖర్చు పెట్టగా, రాష్ట్ర వచ్చాక 5 వేల కోట్లు ఖర్చు చేశారు. మొత్తం 11 వేల కోట్లకు పైగా ఖర్చుచేశాక తనకు ఎలాంటి ఆర్థిక, రాజకీయ ప్రయోజనం లేదని కేసీఆర్ అవినీతికి తెరలేపారు. ప్రాజెక్టు పేరు ఊరు మార్చి, అంచనాలు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టుగా చేశారు. దాంతో తుమ్మిడిహట్టి వద్ద కట్టాల్సిన బ్యారేజీని మేడిగడ్డకు మార్చగా.. ఇతర బ్యారేజీలతో కలిపి 1 లక్షా 50 వేల కోట్లకు ఖర్చు పెంచారు. గతంలో అప్పటి గవర్నర్ నరసింహన్ ను ఇక్కడికి రప్పించి ప్రాజెక్టు చూశాక ఆయన హరీష్ రావు కాదు కాళేశ్వర్ రావు అని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనం పొందాక 2020లో ఆనాటి ఇంజినీర్లు లీకులు, లోపాలు ఉన్నాయని ఎల్ అండ్ టీకి లేఖలు రాశారు. 2023 అక్టోబర్, నవంబర్ లో మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంతో ఇంజినీర్లు ఫిర్యాదు చేశారు.

ప్రకృతే కేసీఆర్ అవినీతి, దుర్మార్గాన్ని గుర్తించి బయటపెట్టింది. రాహుల్ గాంధీ, శ్రీధర్ బాబు ఇక్కడ పర్యటించి మోసాలను ప్రపంచానికి చాటి చెప్పారు. 2023 నవంబర్ 1న ఎన్డీఎస్ఏ ప్రాజెక్టును పరిశీలించి నివేదిక ఇచ్చింది. నీళ్లు నింపడం ప్రమాదకరమని కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఇచ్చింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ కూడా నివేదిక ఇచ్చింది. తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయగా 600 పేజీలకు పైగా నివేదిక ఇచ్చారు. కేసీఆర్, హరీష్ రావు తో పాటు 100కు పైగా అధికారుల పేర్లతో అవినీతి, అవకతవకలపై నివేదిక ఇవ్వగా అసెంబ్లీలో దీనిపై చర్చించాం. తరువాత దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరపాలని సీబీఐకి అప్పగించగా కేంద్ర ప్రభుత్వం నెలలు గడుస్తున్నా విచారణకు ఆదేశించలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం దీనిపై తమ కేంద్ర పెద్దలకు చెప్పి విచారణ జరిపించే ప్రభుత్వం చేయలేదని’ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.

నెల రోజుల కిందటే ప్రాజెక్టు పరిశీలనకు నిర్ణయం..
నెల రోజుల కిందట మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనుల పరిశీలనకు సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. స్వాతంత్య భారతదేశంలో అతిపెద్ద మానవ తప్పిదం కాళేశ్వరం ప్రాజెక్టు అని వ్యాఖ్యానించారు. డిజైన్, ప్లాన్, అవగాహన లోపం, నిర్లక్ష్యం లాంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆనాటి సీఎం రాజశేఖర్ రెడ్డి తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 38 వేల కోట్లలో 16 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి. కానీ కమీషన్ల కక్కుర్తితో తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీని మార్చడమే ప్రాజెక్టులో అతిపెద్ద తప్పిదం. దాంతో తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టు కాగ్ రిపోర్ట్ ప్రకారం లక్షా 47 వేల కోట్లు ఖర్చు అవుతాయని చెప్పింది. నీళ్లు లేవని ఎవరూ చెప్పలేదు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కడితే కేంద్రం 70 నుంచి 75 శాతం ఖర్చు భరించేది. కానీ ప్రాజెక్టు డిజైన్ మార్చి లక్షల కోట్లు ఖర్చు చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెచ్చిన ఖర్చులకు రూ. 16 వేల కోట్లు అసలు, వడ్డీ చెల్లించామని తెలిపారు.

కాళేశ్వరంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. రూ.198 కోట్లతో చేపడుతున్న ఆలయ అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేశారు. అనంతరం మేడిగడ్డకు చేరుకొని ఎన్డీఎస్ఏ ఛైర్మన్ అనిల్జైన్తో కలిసి మేడిగడ్డ బ్యారేజీని, కుంగిన పిల్లర్లను పరిశీలించారు. అనంతరం అక్కడ ఇరిగేషన్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. 520 బోర్ రిగ్స్ ద్వారా శాంపిల్స్ సేకరించి CWPRS కు ప్రభుత్వం పంపనుంది. అక్కడ ల్యాబ్ లో పరీక్షల అనంతరం బ్యారేజ్ డ్యామేజీపై పూర్తి అవగాహన వస్తుంది. డ్రోన్ బేస్డ్ GPR టెస్ట్ కు సంబంధించి అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఈ టెస్ట్ ద్వారా 20 నుంచి 30 మీటర్ల లోతు వరకు పియర్స్ వద్ద నేల స్వభావానికి సంబంధించి ఫలితాలను తెలుసుకోవచ్చని సీఎంకు అధికారులు తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు























