BRS vs Congress: అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
Kaleshwaram Project | అన్నారం బ్యారేజీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? జరుగుతోందని కేటీఆర్ వీడియో పోస్ట్ చేశారు.

హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ విషయంలో జరిగిన వివాదాలు చాలదన్నట్టు, ఇప్పుడు అన్నారం బ్యారేజీని కూడా ప్రమాదంలోకి నెట్టేందుకు కుతంత్రాలు మొదలయ్యాయనే బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి, బ్యారేజీ పిల్లర్ల వద్దే భారీ ఎక్సవేటర్లతో ఇసుక తవ్వకాలు జరపడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బ్యారేజీకి అత్యంత సమీపంలో ఇలాంటి తవ్వకాలు చేపట్టకూడదనే కనీస నిబంధనలను కూడా పాటించకుండా, ఇసుక మాఫియా సాగిస్తున్న ఈ అరాచకంపై తక్షణమే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాజకీయ కుట్రలు చేస్తోందని అధికార పార్టీపై విమర్శలు
అన్నారం బ్యారేజీని బలహీనపరిచి, ఆ నెపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పన్నాగం పన్నుతోందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసేందుకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ అరాచక పర్వాన్ని సాగిస్తోందని, దీన్ని రైతాంగం ఎన్నటికీ క్షమించదన్నారు. ప్రజలు సైతం ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. పట్టపగలే నిస్సిగ్గుగా కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లోనే ఇసుక మాఫియా ఈ దందా సాగిస్తోందని, ఇది తెలంగాణ వనరులను నిలువునా కొల్లగొట్టడమేనని మండిపడ్డారు.
మేడిగడ్డ బ్యారేజీపై కుట్రలు చేసింది చాలదన్నట్టు, అన్నారం బ్యారేజీని కూల్చేందుకు కుతంత్రాలకు తెరతీశారా ??
— KTR (@KTRBRS) March 2, 2026
నిబంధనలకు పాతరేసి ఏకంగా బ్యారేజీ కిందే భారీ ఎక్సవేటర్లతో ఇసుక తవ్వకాలు జరపడం దుర్మార్గమే కాదు.. అతిపెద్ద నేరం.
బ్యారేజీ సమీపంలో ఇసుక తవ్వకాలు చేపట్టకూడదన్న రూల్స్ ను బ్రేక్… pic.twitter.com/TvCYPMcn2M
ప్రజా పాలనపై విరుచుకుపడుతున్న విపక్షాలు
ప్రస్తుత రేవంత్ సర్కార్ హయాంలో "అందినకాడికి దోచుకో.. దొరికినకాడికి అమ్ముకో" అనే సూత్రమే ప్రాతిపదికగా సాగుతోందని కేటీఆర్ విమర్శించారు. అన్నారం బ్యారేజీకి లేదా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏమైనా నష్టం జరిగితే దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీయే వహించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సంపదను దోచుకుంటున్న నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమగ్ర విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగి ఈ కుట్రలకు పాల్పడుతున్నట్లు అయితే, త్వరలోనే ప్రజలు ఎన్నికల క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతారని కేటీఆర్ పేర్కొన్నారు.
























