AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
AP Municipal Elections Direct Method: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ సారి చైర్మన్లు, మేయర్ల స్థానాలకు ప్రత్యక్ష ఎన్నిక నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నారు.

Panchayat Raj Act Amendments AP: ఆంధ్రప్రదేశ్ రాజకీయం త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఓ భారీ మలుపు తిరగబోతోంది. స్థానిక సంస్థల్లో ఏళ్ల తరబడి శాపంగా మారిన క్యాంప్ రాజకీయాలు , బేరసారాలు, బెదిరింపులకు శాశ్వతంగా చరమగీతం పాడేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత కీలకమైన ప్రజాస్వామ్య సంస్కరణకు రూపకల్పన చేస్తున్నారు. మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జిల్లా పరిషత్ ( చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులను ప్రజలే నేరుగా ఎన్నుకునే ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని పునరుద్ధరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పరోక్ష ఎన్నికల పేరిట స్థానిక సంస్థల్లో సాగుతున్న ప్రజాస్వామ్య హననాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు భావిస్తున్నారు.
పరోక్ష ఎన్నికల విధానంలో గ్రామ, వార్డు స్థాయి ప్రజాప్రతినిధులను ఎన్నుకున్న తర్వాత, వారు తమ నాయకుడిని ఎన్నుకుంటారు. ఈ క్రమంలో అధికార బలం, ఆర్థిక ప్రాబల్యం, పోలీసు వ్యవస్థ దుర్వినియోగం పీక్ స్టేజ్కు చేరుకుంటాయి. మెజార్టీ రాని అధికార పార్టీలు కూడా ప్రతిపక్షాల నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులను రిసార్టులకు తరలించడం, క్యాంపులు నిర్వహించడం, రకరకాల ఒత్తిళ్లకు గురిచేసి తమవైపు తిప్పుకోవడం ఆనవాయితీగా మారింది. చివరికి ప్రజల తీర్పు ఒకటైతే, పీఠంపై కూర్చునేది మరొకరయ్యే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ అక్రమ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలంటే ప్రజల చేతికే నేరుగా ఓటు హక్కు ఇవ్వడమే ఏకైక మార్గమని భావిస్తున్నారు.
అధికార పార్టీలు చేయని సాహసం చేస్తున్న చంద్రబాబు
సాధారణంగా ఏ అధికార పార్టీ కూడా ఇటువంటి ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని తీసుకురావడానికి సాహసించదు. ఎందుకంటే, పరోక్ష విధానం ఉంటే వార్డుల్లో సీట్లు తగ్గినా, సర్పంచ్ లేదా కౌన్సిలర్లను లొంగదీసుకుని మున్సిపాలిటీలు, జడ్పీలను కైవసం చేసుకునే వెసులుబాటు అధికారంలో ఉన్న పార్టీకి ఉంటుంది. అయితే, అక్రమ మార్గాల్లో పీఠాలను దక్కించుకునే సంస్కృతి కంటే, పారదర్శకమైన ప్రజా తీర్పుకే ప్రాధాన్యత ఇవ్వాలనేది సీఎం చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది. పరోక్ష ఎన్నికల్లో జరిగే కోట్లాది రూపాయల బేరసారాలకు స్వస్తి పలికితే, స్థానిక సంస్థల్లో జవాబుదారీతనం పెరుగుతుందనేది నమ్మకం.
ఎన్టీఆర్ హయాంలో మొదటి సారి డైరక్ట్ ఎలక్షన్స్
గత చరిత్రను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించడం ఇదే మొదటిసారి కాదు. 1987లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు హయాంలో తొలిసారిగా మున్సిపల్ చైర్మన్లు, మండల ప్రజాపరిషత్ అధ్యక్షులకు నేరుగా ప్రజలే ఓటు వేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 2000వ దశకం ప్రారంభంలో చంద్రబాబు హయాంలోనూ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను నేరుగా ఎన్నుకునే పద్ధతి నడిచింది. అయితే, కౌన్సిల్లో ఒక పార్టీకి మెజార్టీ ఉండి, మేయర్, చైర్మన్ మరొక పార్టీకి చెందినవారు గెలిస్తే పాలనలో ప్రతిష్టంభన ఏర్పడుతోందనే నెపంతో తర్వాతి ప్రభుత్వాలు మళ్లీ పరోక్ష విధానానికే మొగ్గు చూపాయి.
చట్టపరమైన కోణంలో చూస్తే.. భారత రాజ్యాంగంలోని 243C పంచాయతీలు, 243R మున్సిపాలిటీలు నిబంధనల ప్రకారం స్థానిక సంస్థల అధ్యక్షుల ఎన్నికల విధానాన్ని నిర్ణయించే సర్వాధికారాలు రాష్ట్ర శాసనసభలకే ఉన్నాయి. దీనికోసం ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం-1994 , అలాగే ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం-1965 , మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం-1994లకు అసెంబ్లీలో సవరణలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత కూటమికి అసెంబ్లీలో అత్యధిక మెజార్టీ ఉన్నందున, ఈ చట్టసవరణ చేయడం ప్రభుత్వానికి సునాయాసమైన ప్రక్రియే కానుంది.
ప్రస్తుత రాజకీయాల్లో విలువలకు ప్రత్యక్ష విధానం బెటర్
ఈ ప్రత్యక్ష విధానం అమల్లోకి వస్తే రాజకీయ పార్టీలపై, స్థానిక నాయకత్వంపై తీవ్ర ప్రభావం పడనుంది. కేవలం డబ్బు సంచులతో కౌన్సిలర్లను కొనుగోలు చేసే ధనస్వామ్య నాయకులకు కాలం చెల్లి, ప్రజల్లో మంచి గుర్తింపు, ఆమోదయోగ్యత ఉన్న నాయకులకే పార్టీలు బీ-ఫారాలు ఇవ్వాల్సి వస్తుంది. ఒక వేళ కౌన్సిల్లో ప్రతిపక్షాల బలం ఎక్కువగా ఉన్నా, ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడిన మేయర్, చైర్మన్ బడ్జెట్ ఆమోదం, పాలనా నిర్ణయాల్లో అందరినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. అధికారంలో ఉండి కూడా పరోక్ష లబ్ధిని వదులుకుని ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లడం అనేది ఒక రాజకీయ తెగువగా అభివర్ణించవచ్చు. ఈ ప్రతిపాదన గనుక చట్టరూపం దాల్చి అమల్లోకి వస్తే, భవిష్యత్తులో దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా ఆంధ్రప్రదేశ్ స్థానిక పాలనలో మార్గదర్శిగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















