Prime Minister Modi: కాంగ్రెస్కు విజన్, ప్రణాళకలేమీ ఉండవు -రాజ్యసభలో మోదీ విమర్శలు
MODI: భారత్ మూడో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని మోదీ అన్నారు. రాజ్యసభలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు.

Prime Minister Modi speech in Rajya Sabha: ఇండియా బలహీనమైన ఐదు ఆర్థిక వ్యవస్థలు స్థాయి నుండి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశలో వేగంగా పయనిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ప్రపంచ క్రమం మారుతోందని, ప్రస్తుతం ప్రపంచం భారతదేశం వైపు విశ్వబంధుగా చూస్తోందని స్పష్టం చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానం ఇచ్చారు. భారతదేశం ఇప్పుడు గ్లోబల్ సౌత్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుకగా మారిందని నొక్కి చెప్పారు.
విజన్ లేని కాంగ్రెస్
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై ప్రధాని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వద్ద ఎటువంటి ఆలోచనలు, విజన్ లేదా ప్రణాళికలు లేవని, ఆ పార్టీ గతంలో చేసిన తప్పులను సరిదిద్దడానికే తమ శక్తి అంతా ఖర్చవుతోందని మండిపడ్డారు. ముఖ్యంగా యూపీఏ హయాంలో జరిగిన బ్యాంకింగ్ అవకతవకలను ప్రస్తావిస్తూ, అప్పట్లో ఫోన్ బ్యాంకింగ్ సంస్కృతి ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థను కుప్పకూల్చేలా చేశారని ఆరోపించారు. రవ్నీత్ బిట్టుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుబట్టారు. సిక్కు కాబట్టే బిట్టును రాహుల్ అవమానించారని విమర్శించారు.
సంస్కరణలు , వాణిజ్య ఒప్పందాలు
రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అనే సూత్రంతో దేశం ప్రస్తుతం రిఫార్మ్ ఎక్స్ప్రెస్ మార్గంలో ఉందని ప్రధాని తెలిపారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ తో జరుగుతున్న వాణిజ్య ఒప్పందాలను ఆయన ప్రస్తావిస్తూ, ఇవి భారతదేశ స్థిరత్వానికి , భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని చెప్పారు. గతంలో రక్షణ ఒప్పందాలు అంటే బోఫోర్స్ వంటి అవినీతి గుర్తొచ్చేదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని ఎద్దేవా చేశారు.
Delhi: Prime Minister Narendra Modi says, "One of our respected members has been saying many things. His entire government is drowning in alcohol, and his so-called Sheesh Mahal has become a source of resentment in every household. Perhaps he has an obsession with the word… pic.twitter.com/VJTzGEHdZv
— IANS (@ians_india) February 5, 2026
బెంగాల్ సర్కార్ పై విమర్శలు
పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చొరబాటుదారులను రక్షించడానికి ఆ ప్రభుత్వం కోర్టులను ఆశ్రయిస్తోందని మోదీ ఆరోపించారు. ఈ చొరబాటుదారులు స్థానిక యువత ఉపాధిని, గిరిజనుల భూములను లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా చొరబాటుదారులను పంపివేస్తుంటే, ఇక్కడ మాత్రం వారిని ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రక్షిస్తున్నారని విమర్శించారు.
ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ సభ నుండి వాకౌట్ చేశారు. అంతకుముందు లోక్సభలో ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా సభకు హాజరు కాలేదు. మోదీపై దాడికి కాంగ్రెస్ సభ్యులు కుట్ర పన్నారని అందుకే తానే ప్రధాని మోదీని రావొద్దని సూచించానని స్పీకర్ బిర్లా తెలిపారు.























