Prime Minister Modi Parliament Speech: 41 దేశాల నుంచి ఇంధన దిగుమతలు - పెట్రోల్, గ్యాస్ కొరతే రాదు - ప్రధాని మోదీ హామీ
Prime Minister Modi: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమాసియా సంక్షోభం, దేశ ఇంధన భద్రత, భారత పౌరుల రక్షణపై కీలక ప్రసంగం చేశారు. దేశానికి ఇంధన భద్రత ఉందన్నారు.

PM Modi key speech in Parliament on West Asia crisis: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయని, దీని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సోమవారం లోక్సభలో ప్రసంగించిన ఆయన, ఈ యుద్ధం వల్ల ప్రపంచ సప్లయ్ చైన్ దెబ్బతిందని, ముఖ్యంగా ఇంధన ధరల పెరుగుదల , ఆహార భద్రతపై సవాళ్లు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. పార్లమెంట్ మొత్తం ఈ విషయంలో ఏకతాటిపై నిలబడి ప్రపంచానికి ఒక సందేశం పంపాలని ఆయన పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మార్గంలో నౌకల రాకపోకలను అడ్డుకోవడం, వాణిజ్య నౌకలపై దాడులు చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రధాని అన్నారు. ఈ సంక్షోభ పరిష్కారం కోసం తాను ఇప్పటికే పలువురు పశ్చిమాసియా దేశాల నాయకులతో స్వయంగా మాట్లాడానని, చర్చల ద్వారానే శాంతి సాధ్యమని భారత్ నమ్ముతోందని స్పష్టం చేశారు. పౌర మౌలిక సదుపాయాలపై దాడులను భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆయన తెలిపారు.
యుద్ధం కారణంగా ముడి చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్న ఆందోళనలతో దేశ ప్రజలకు ప్రధాని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం భారత్ వద్ద 53 లక్షల మెట్రిక్ టన్నుల వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు ఉన్నాయని, మరో 65 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని పెంచే పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ , గ్యాస్ సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా 41 దేశాల నుండి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటూ వనరులను వైవిధ్యపరుస్తున్నట్లు పేర్కొన్నారు.
విదేశాల్లో ఉన్న భారతీయ పౌరుల భద్రతే తమ మొదటి ప్రాధాన్యతని మోదీ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఇప్పటివరకు సుమారు 3.75 లక్షల మంది భారతీయులు, విద్యార్థులు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారని ఆయన వెల్లడించారు. అక్కడ చిక్కుకున్న మిగిలిన వారిని రక్షించేందుకు భారత దౌత్య కార్యాలయాలు నిరంతరం కృషి చేస్తున్నాయని, సంబంధిత దేశాల నాయకులు కూడా భారతీయుల భద్రతపై తనకు హామీ ఇచ్చారని ప్రధాని తెలిపారు.
PM modi : विकट परिस्थितियां बनी हुई है, और आगे भी जारी रहेंगी
— Kamalraj Singh (@kamalrajsingh_) March 23, 2026
Prime Minister Modi response to the
West Asia conflict in Lok Sabha
should be heard.#PMModi #Israël #LokSabha pic.twitter.com/PB68fuBOFn
గ్లోబల్ టెన్షన్ల నేపథ్యంలో దేశ సరిహద్దులు, తీర ప్రాంతాలు , సైబర్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేసినట్లు ప్రధాని వివరించారు. ఇటువంటి సంక్షోభ సమయాల్లో కొన్ని శక్తులు ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తాయని, అందుకే భద్రతా సంస్థలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. కోవిడ్ మహమ్మారిని ఏకతాటిపై ఎదుర్కొన్నట్లే, ప్రస్తుత సవాళ్లను కూడా ఐక్యతతో ఎదుర్కోవాలని ఆయన దేశప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ట్రెండింగ్ వార్తలు






















