Telangana News: జనవరి 1 నుంచి 'నుమాయిష్' - 46 రోజుల పాటు ఎగ్జిబిషన్, ప్రత్యేకతలివే!
Numaish Exhibition: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)కు భాగ్యనగరం సిద్ధమవుతోంది. జనవరి 1 నుంచి జరగబోయే ఈవెంట్ కోసం నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Numaish Started From January First in Nampally Ground: 2,400 స్టాళ్లు.. 46 రోజులు.. అతి పెద్ద పారిశ్రామిక ప్రదర్శన 'నుమాయిష్' (Numaish) కోసం భాగ్యనగరం సిద్ధమవుతోంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ (Nampally Exhibition Grounds) లో జనవరి 1న 83వ 'నుమాయిష్' ప్రారంభానికి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దేశంలోని పలు రాష్ట్రాల ఉత్పత్తులతో పాటు తెలంగాణ, ఏపీలకు చెందిన పలు ఉత్పత్తులు, ప్రభుత్వాల స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకూ 'నుమాయిష్' ప్రదర్శన సాగనుంది.
ఇదీ చరిత్ర
1938వ సంవత్సరంలో ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నేతృత్వంలో ప్రారంభమైన ఈ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన అప్పట్లో నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించేవారు. ఆ తర్వాత 1946లో నాంపల్లిలోనూ ఎగ్జిబిషన్ మైదానంలోని 26 ఎకరాల సువిశాల స్థలంలో నిర్వహిస్తూ వస్తున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా నిర్వహిస్తున్న 'నుమాయిష్' కార్యక్రమానికి దేశ, విదేశాల్లో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు తయారు చేసిన ఉత్పత్తులకు విస్తృత ప్రచారం లభించడం సహా, వాటి విక్రయాలకు సైతం ఈ ఈవెంట్ కేంద్రంగా నిలుస్తోంది. ప్రతి ఏడాది దాదాపు 25 లక్షల మంది సందర్శకులు ఎగ్జిబిషన్ ను సందర్శిస్తారు.
ఒకేచోట అన్నీ
'నుమాయిష్' ఎగ్జిబిషన్ లో అన్ని రకాల వస్తువులు ఒకే చోట లభ్యమవుతాయి. నగరంలో దొరకని పలు రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. దుస్తులు, మంచాలు, కిచెన్ సామాగ్రి, వివిధ రకాల దుప్పట్లు, కశ్మీరీ డ్రై ఫ్రూట్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, కొత్త తరహా ఫర్నీచర్స్, మల్టీ పర్పస్ ఉపకరణాలు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ స్టాల్స్, ఫుడ్ కోర్టులు, సందర్శకులను అలరించేందుకు అమ్యూజ్మెంట్ పార్క్ ఇలా అన్నీ ఎగ్జిబిషన్ లో కొలువుదీరనున్నాయి. ఇప్పటికే దాదాపు స్టాళ్ల కేటాయింపులు పూర్తి కాగా, పలు స్టాళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
టికెట్ ధర ఎంతంటే.?
ఎగ్జిబిషన్ ను సందర్శించే వారి కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తోంది. ఎగ్జిబిషన్ కు వచ్చే వారిని గోషామహల్, అజంతా గేట్, గాంధీభవన్ గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తారు. టికెట్ ధర రూ.40గా నిర్ధారించారు. వినోదాత్మకమైన పలు విభాగాలు అందుబాటులో ఉంటాయి. ఎగ్జిబిషన్ కు వచ్చే సందర్శకుల కోసం ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఆహ్లాదకర వాతావరణంలో అందరూ మెచ్చేలా 'నుమాయిష్' సాగుతుందని ఎగ్జిబిషన్ సొసైటీ కోశాధికారి ఏనుగుల రాజేందర్ కుమార్ తెలిపారు. 33 సబ్ కమిటీల ద్వారా ఎగ్జిబిషన్ విజయవంతంగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సబ్ కమిటీల ప్రతినిధులు తగిన చర్యలు తీసుకుంటారని సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్ చెప్పారు. ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యా రంగ వ్యాప్తికి కృషి చేస్తున్నామని ఎగ్జిబిషన్ కార్యదర్శి బి.హన్మంతరావు చెప్పారు. ముఖ్యంగా మహిళా కళాశాలలు, పాలిటెక్నిక్, ఫార్మసీ, ఇంజినీరింగ్, డిగ్రీ, ఐటీఐ కళాశాలలను స్థాపించి విద్యా వ్యాప్తికి నిరంతరం పాటు పడుతున్నామని పేర్కొన్నారు.
Before You Go
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
ట్రెండింగ్ వార్తలు






















