PM Road Accident Relief Scheme: రోడ్డు ప్రమాద బాధితులకు 1.5 లక్షల క్యాష్లెస్ ట్రీట్మెంట్, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
PM Rahat Yojana | ప్రధానమంత్రి సహాయ పథకం కింద, ప్రమాదం జరిగిన తేదీ నుండి 7 రోజుల వరకు ఒక్కొక్కరికి ఆస్పత్రి ఖర్చులు ₹1.5 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుంది.

PM Rahat Yojana Cashless Treatment | న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో చికిత్స అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానినరేంద్ర మోదీ 'పీఎం రాహత్' (PM Rahat) పథకానికి ఆమోదం తెలిపారు. ఈ పథకం కింద రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి 7 రోజుల పాటు గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స (Cashless Treatment) అందుతుంది.
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలోని ఏ కేటగిరీ రహదారిపై ప్రమాదం జరిగినా, అర్హులైన ప్రతి బాధితుడికి PM Rahat Yojana పథకం వర్తిస్తుంది. అంటే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు లేదా గ్రామీణ రోడ్లు - ఇలా ఏ ప్రాంతంలో ప్రమాదం జరిగినా బాధితులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. పీఎం రాహత్ పథకం కింద ఎవరికైనా సరే ప్రమాదం బాధితులకు నిర్ణీత మొత్తం వరకు ఉచిత చికిత్స అందుతుంది. అయితే పథకం రూల్స్ ఇక్కడ తెలుసుకోండి.
పీఎం రాహత్ పథకానికి సంబంధించిన రూల్స్
పీఎం రాహత్ పథకం కింద, ప్రమాదం జరిగిన రోజు నుండి 7 రోజుల వరకు ఒక్కో వ్యక్తికి 1.5 లక్షల రూపాయల వరకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ చెల్లింపు నేరుగా మోటారు వాహనాల ప్రమాద నిధి (Motor Vehicle Accident Fund) నుండి ఆసుపత్రికి వెళ్తుంది. ఈ పథకం కింద ప్రాణాపాయం లేని కేసుల్లో గరిష్టంగా 24 గంటల వరకు, తీవ్రమైన కేసుల్లో 48 గంటల వరకు 'స్టెబిలైజేషన్' చికిత్స అందించనున్నారు. ఆ తర్వాత కూడా 7 రోజుల వ్యవధిలోపు క్యాష్లెస్ చికిత్స అందుకోవచ్చు. ఈ ప్రక్రియ అంతా ఇంటిగ్రేటెడ్ డిజిటల్ సిస్టమ్ ద్వారా జరుగుతుంది. దీనికి పోలీసు ధృవీకరణ అవసరం అవుతుంది. సాధారణ కేసుల్లో 24 గంటల లోపు, తీవ్రమైన కేసుల్లో 48 గంటల లోపు పోలీసుల నిర్ధారణ జరగాలి. తద్వారా చికిత్స అందించడంలో ఎటువంటి ఆటంకం కలగకుండా పారదర్శకంగా ప్రక్రియ కొనసాగుతుంది.
గోల్డెన్ అవర్లో చికిత్సపై ప్రాధాన్యత
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో ప్రతి ఏటా వేల సంఖ్యలో ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. అందులో చాలా మంది సకాలంలో చికిత్స అందకపోవడం వల్లే చనిపోతున్నారు. ప్రమాదం జరిగిన మొదటి గంట (గోల్డెన్ అవర్) లోపు గాయపడిన వారిని ఆసుపత్రికి చేర్చగలిగితే సుమారు 50 శాతం మరణాలను నివారించవచ్చని పరిశోధనల్లో తేలింది. ఈ లక్ష్యంతోనే 112 హెల్ప్లైన్ ను ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్తో అనుసంధానం చేశారు. రోడ్డు ప్రమాద బాధితులు, బాటసారులు లేదా అక్కడ ఉన్న ఎవరైనా సరే 112 నెంబర్కు డయల్ చేసి సమీపంలోని ఆసుపత్రి వివరాలను తెలుసుకోవచ్చు. బాధితుల కోసం అంబులెన్స్ సహాయం కోరవచ్చు.
ఏడు రోజుల గడువు ముగిసిన తర్వాత కూడా బాధితుడి పరిస్థితి విషమంగా ఉంటే, మెరుగైన చికిత్సను వారి వ్యక్తిగత భీమా (Health Insurance) లేదా ఇతర ప్రభుత్వ పథకాల (ఆయుష్మాన్ భారత్ వంటివి) కిందకు మార్చుకునే వీలుంది. పీఎం రాహత్ పథకం అమలులో నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) కీలక పాత్ర పోషిస్తుంది.
























