New Toll Tax Rules: నేటి నుంచి టోల్ ట్యాక్స్లో మార్పులు- వాహనదారులకు ఊరట, తగ్గనున్న టోల్ ఫీజు
NHAI Toll Fee | ఎక్స్ప్రెస్వే పూర్తి కానప్పుడు, కొన్నిచోట్ల ఇంకా నిర్మాణం జరుగుతుంటే అక్కడ పూర్తి టోల్ వసూలు చేయరు. మిగతా మార్గానికి నేషనల్ హైవే టోల్ ఫీజు తీసుకుంటారు.

న్యూఢిల్లీ: ప్రయాణ సమయంలో రోడ్డు భద్రత, సౌకర్యాల విషయంలో భారత ప్రభుత్వం అనేక కొత్త చర్యలు తీసుకుంటూనే ఉంది. కేంద్రం తాజాగా నేషనల్ ఎక్స్ప్రెస్వేల (National Highway)పై టోల్ వసూలు నిబంధనలలో మార్పులతో వాహనదారులకు ఊరట కలిగించింది. నేటి నుంచి పలు టోల్ ప్లాజాల వద్ద టోల్ ట్యాక్స్ తగ్గుతుంది. నేటి (ఫిబ్రవరి 15) నుండి NHAI కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. దీని ప్రకారం, పనులు పూర్తికాని జాతీయ ఎక్స్ప్రెస్వేలపై కేవలం అందుబాటులో ఉన్న (ప్రయాణానికి వీలుగా ఉన్న) భాగానికి మాత్రమే టోల్ వసూలు చేయాలి. మొత్తం ఎక్స్ప్రెస్వే దూరానికి టోల్ వసూలు చేయకూడదు. నిర్మాణంలో మార్గంలో టోల్ ఫీజు సాధారణ నేషనల్ హైవే రేట్ల ప్రకారం ఉంటుంది.
ఇప్పటి వరకు, ఒక ఎక్స్ప్రెస్వే పూర్తిగా సిద్ధం కాకపోయినా, కొన్ని చోట్ల పనులు జరుగుతున్నప్పటికీ వాహనదారుల వద్ద నుంచి పూర్తి టోల్ వసూలు చేసేవారు. ఈ విధానం సాధారణంగా ప్రయాణీకులపై ఆర్థిక భారాన్ని మోపుతుంది. కొన్ని భాగాలలో నిర్మాణ పనులు జరుగుతున్నప్పటికీ పూర్తి టోల్ ఫీజు చెల్లించాల్సి రావడంపై ప్రజలు పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దీనిని పరిగణనలోకి తీసుకుని ఒక ముఖ్యమైన మార్పు చేసింది. దీని ప్రకారం, పూర్తిగా అందుబాటులోకి వచ్చి, సిద్ధంగా ఉన్న ఎక్స్ప్రెస్ వే లలో మాత్రమే పూర్తి టోల్ ఫీజు వసూలు చేయాలని, లేకపోతే పాక్షికంగా టోల్ ఫీజు వసూలు చేయాలని ఎన్హెచ్ఏఐ పేర్కొంది.
పాత విధానంలో ఎలా చేశారు..
గతంలో ఉన్న విధానంలో ఏదైనా ఎక్స్ప్రెస్వేలో కొంత భాగం రోడ్డు మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ, వాహనదారుల నుండి పూర్తిగా టోల్ వసూలు చేసేవారు. ఎక్స్ప్రెస్వే టోల్ ధరలు సాధారణ నేషనల్ హైవేస్ కంటే దాదాపు 25 శాతం ఎక్కువగా ఉంటాయి. దీనికి కారణం ఎక్స్ప్రెస్వేలపై జర్నీ వల్ల ప్రయాణీకులకు వేగవంతమైన, ఎటువంటి అడ్డంకులు లేని ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వీటిపై ట్రాఫిక్ జామ్ లాంటివి చాలా తక్కువగా ఉంటాయి. రోడ్లు చాలా బాగుండటంతో జర్నీ సాఫీగా సాగిపోతుంది. దీనివల్ల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. కానీ ఎక్స్ప్రెస్వే కొంత భాగమే సిద్ధమైనా, వాహనదారుల నుండి పూర్తి టోల్ రేటును వసూలు చేసేవారు. దాంతో అదనపు భారాన్ని భరించాల్సి వచ్చేది.
కొత్త నిబంధనల ప్రకారం
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. దీని ప్రకారం, ఒక ఎక్స్ప్రెస్వే పూర్తిగా సిద్ధం కాకపోతే, దానిపై కేవలం అందుబాటులో ఉన్న భాగానికి మాత్రమే టోల్ వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఆ భాగానికి టోల్ ధర సాధారణ జాతీయ రహదారి ప్రకారం వసూలు చేస్తారు. ఇది ఎక్స్ప్రెస్వే ధర కంటే తక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ఎక్స్ప్రెస్వే సగం మాత్రమే సిద్ధంగా ఉంటే, తాము పొందుతున్న సౌకర్యానికి టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిరోజూ లేదా క్రమం తప్పకుండా ఎక్స్ప్రెస్వేని ఉపయోగించే ప్రయాణీకులకు ఈ నిర్ణయం ప్రయోజనాన్ని అందిస్తుంది.
ఈ రూల్ ఎప్పటి నుండి అమలులోకి వస్తుంది?
ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఈ కొత్త రూల్ అమలులోకి వస్తుంది. ఎక్స్ప్రెస్వేలు ఎక్కడెక్కడ పాక్షికంగా అందుబాటులో ఉంటాయో అక్కడ కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే దిశగా ఈ అడుగు వేసినట్లు ప్రభుత్వం భావిస్తోంది.
జీపీఎస్ ఆధారిత టోల్: ప్రభుత్వం త్వరలో 'శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు' వ్యవస్థను కూడా ప్రవేశపెట్టాలని కేంద్రం చూస్తోంది. దీనివల్ల మీరు రోడ్డుపై ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించారో దానికి మాత్రమే టోల్ కట్ అవుతుంది. కొత్త నిబంధనలు వర్తించినా, టోల్ చెల్లింపులు యధావిధిగా ఫాస్టాగ్ ద్వారానే జరుగుతాయి.
























