India EU trade Deal: ఇండియా, యూరప్ ట్రేడ్ డీల్తో పాకిస్తాన్కు చావు దెబ్బ - ఎగుమతల సంక్షోభంలోకి జారుకోనున్న దాయాది
Pakistan: యూరప్తో ట్రేడ్ డీల్ భారత్ కు అనేక లాభాలు తెచ్చిపెట్టనుంది. అదే సమయంలో పాకిస్తాన్ను చావుదెబ్బకొట్టబోతోంది.

India EU trade breakthrough triggers panic in Pakistan: భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య కుదురుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దక్షిణాసియా వాణిజ్య రంగంలో పెను మార్పులకు నాంది పలుకుతోంది. ఈ పరిణామం పొరుగుదేశమైన పాకిస్తాన్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు ఐరోపా మార్కెట్లో పాకిస్తాన్కు ఉన్న ప్రత్యేక రాయితీలు, భారత్ రాకతో కనుమరుగయ్యే ప్రమాదం ఉండటమే దీనికి ప్రధాన కారణం.
పాకిస్తాన్ GSP Plus హోదాకు గండం
చాలా కాలంగా ఐరోపా దేశాలకు ఎగుమతులు చేసే విషయంలో పాకిస్తాన్కు యూపర్ దేశాలు GSP Plus అనే హోదా ఇచ్చాయి. ఈ హోదా ద్వారా పన్ను మినహాయింపులు లభించేవి. ముఖ్యంగా టెక్స్టైల్స్, దుస్తుల ఎగుమతుల్లో పాకిస్తాన్కు ఇది పెద్ద అడ్వాంటేజ్గా ఉండేది. అయితే, ఇప్పుడు భారత్-ఈయూ ఒప్పందం అమల్లోకి వస్తే, భారతీయ తయారీదారులకు కూడా నేరుగా, పన్ను రహిత ప్రవేశం లభిస్తుంది. దీనివల్ల గతంలో పాకిస్తాన్కు ఉన్న ఆ ప్రత్యేక ఆధిక్యత పూర్తిగా దెబ్బతింటుంది.
తగ్గుతున్న ఎగుమతులు.. పెరుగుతున్న నిరుద్యోగం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ ఎగుమతులు ఇప్పటికే గణనీయంగా పడిపోయాయి. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు భారత ఉత్పత్తుల నుండి ఎదురవుతున్న పోటీతో పాక్ ఎగుమతిదారులు బెంబేలెత్తుతున్నారు. ఐరోపాకు జరిగే వాణిజ్యంపై ఆధారపడి పాకిస్తాన్లో లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. భారత వస్తువులకు ఐరోపా తలుపులు బార్లా తెరుచుకుంటే, పాక్ ఉత్పత్తులకు గిరాకీ తగ్గి, ఆ దేశంలో లక్షలాది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గ్లోబల్ సప్లై చైన్లో భారత్ జోరు
భారత్కు ఈ ఒప్పందం కేవలం ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ సప్లయ్ చైన్లో తన పట్టును నిరూపించుకోవడానికి ఒక గొప్ప అవకాశం. నాణ్యత, స్థిరత్వం, భారీ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న భారతీయ పరిశ్రమలకు ఐరోపా వంటి పెద్ద మార్కెట్ అందుబాటులోకి రావడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతం లభిస్తుంది. ఇది అంతర్జాతీయ వేదికపై భారత్ ఆర్థిక పరపతిని మరింత పెంచుతుంది.
పాకిస్తాన్ ముందున్న సవాలు
తమ ఎగుమతులను కాపాడుకోవడానికి పాకిస్తాన్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కేవలం పన్ను రాయితీలపైనే ఆధారపడకుండా, తమ ఉత్పత్తుల నాణ్యతను పెంచుకోవాల్సిన లేదా కొత్త మార్కెట్లను వెతుక్కోవాల్సిన అనివార్య పరిస్థితి పాకిస్తాన్కు ఏర్పడింది. కాలం మారుతున్న కొద్దీ భారత్ తన వాణిజ్య సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంటే, పాకిస్తాన్ మాత్రం తన పాత అనుకూలతలను కోల్పోతూ ఆత్మరక్షణలో పడిపోయింది.























