Gulf illegal residency help: గల్ఫ్ ఇరుక్కుపోయిన మహిళలకు పిల్లల పౌరసత్వ కష్టాలు - ఈ సమస్యను గుర్తించేది ఎవరు?
Gulf Single Mothers: గల్ఫ్ దేశాల్లో వీసా గడువు ముగిసి, సరైన పత్రాలు లేని కారణంతో ఎంతోమంది ఒంటరి తెలుగు తల్లులు పసి పిల్లలను గదుల్లోనే దాచేస్తున్నారు. వారికి ఎంబసీ అండగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది.

Single mother Indian passport laws: పరాయి దేశంలో బతుకుదెరువు కోసం వెళ్లి, పరిస్థితులు తారుమారై అక్కడ అక్రమంగా ఉండిపోవాల్సి రావడం ఒక ఎత్తు అయితే.. భర్త తోడు లేని సమయంలో పుట్టిన బిడ్డలను దాచుకుంటూ బతకడం మరో నరకం. గల్ఫ్ దేశాల్లో వీసా గడువు ముగిసి, సరైన పత్రాలు లేని కారణంతో ఎంతోమంది ఒంటరి తెలుగు తల్లులు తమ పసిపిల్లలను బాహ్య ప్రపంచానికి తెలియకుండా గదుల్లోనే దాచేస్తున్నారు. బయటపడితే పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయం ఆ పసిప్రాణాల భవిష్యత్తును చీకట్లోకి నెడుతోంది. కనీసం బర్త్ సర్టిఫికేట్, చదువు, వైద్యం లేని ఈ అదృశ్య బాల్యం పై ఇప్పుడు గల్ఫ్ దేశాల్లోని తెలుగు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
తండ్రి లేకపోయినా.. బిడ్డ భారతీయుడే!
చాలామంది మహిళల్లో ఉన్న అతిపెద్ద అపోహ ఏమిటంటే, తండ్రి వివరాలు లేదా వివాహ ధృవీకరణ పత్రం లేకపోతే బిడ్డకు పౌరసత్వం రాదని. కానీ భారత చట్టాలు తల్లికి పూర్తి రక్షణ కల్పిస్తున్నాయి. భారత సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం, ఒక బిడ్డకు పౌరసత్వం రావడానికి తల్లి భారతీయురాలైతే చాలు. తండ్రి బాధ్యత తీసుకోకపోయినా, ఆయన వివరాలు తెలియకపోయినా సదరు మహిళ తనను సింగిల్ మదర్ గా డిక్లేర్ చేస్తే సరిపోతుంది. తండ్రి సంతకం లేదా అనుమతి లేకుండానే భారత ఎంబసీ ఆ బిడ్డకు పాస్పోర్ట్ లేదా అవుట్పాస్ జారీ చేసే అధికారం కలిగి ఉంది.
బహ్రెయిన్ ఘటన - ఐదేళ్ల తర్వాత విముక్తి
ఈ సమస్యకు పరిష్కారం ఉందని నిరూపించడానికి బహ్రెయిన్లో తాజాగా జరిగిన ఘటనే నిదర్శనం. గత ఐదేళ్లుగా బర్త్ సర్టిఫికేట్ లేక, పోలీసులు పట్టుకుంటారనే భయంతో ఒక తెలుగు తల్లి తన పాపను ఎవరికీ తెలియకుండా దాచింది. అయితే, స్థానిక తెలుగు కళా సమితి , భారత రాయబార కార్యాలయం చొరవతో ఈ చిక్కుముడి వీడింది. ఎంబసీ అధికారులు మానవీయ కోణంలో స్పందించి, తక్షణమే ప్రయాణ పత్రాలు సిద్ధం చేయడంతో, ఆ తల్లి, బిడ్డ సురక్షితంగా భారతదేశానికి చేరుకున్నారు. ఐదేళ్ల నిరీక్షణ తర్వాత ఆ చిన్నారి మాతృభూమిపై అడుగుపెట్టింది.
అరబ్ పోలీసుల వద్దకు కాదు.. ఎంబసీకి వెళ్లండి!
వీసా గడువు ముగిసిన వారు స్థానిక అరబ్ పోలీసుల వద్దకు వెళ్తే చట్ట ప్రకారం అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ, భారత రాయబార కార్యాలయం ఒక స్వతంత్ర ప్రాంతం. అక్కడ బాధితులకు రక్షణ ఉంటుంది తప్ప శిక్ష ఉండదు. నేరుగా ఎంబసీకి వెళ్లడానికి భయపడేవారు, గల్ఫ్ దేశాల్లోని గుర్తింపు పొందిన తెలుగు సంఘాలను రహస్యంగా సంప్రదించాలి. వీరు ఎంబసీ అధికారులతో మాట్లాడి, జరిమానాలు మినహాయించేలా చేసి, సురక్షితంగా స్వదేశం చేర్చే వరకు అండగా ఉంటారు.
ఆలస్యం అమృతం విషం.. పసిపిల్లల కోసం తెగించండి!
సమస్యను దాచిపెట్టినంత కాలం అది పెరుగుతూనే ఉంటుంది. పిల్లలు పెద్దయ్యే కొద్దీ వారికి గుర్తింపు పత్రాలు లేకపోవడం వల్ల విద్యాభ్యాసం, ఉపాధి దొరకవు. గల్ఫ్ జైలు గదుల కంటే ఘోరమైన ఈ అజ్ఞాతవాసం నుంచి బయటపడాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















