Kids Fall Sick After Schools Reopen : స్కూల్స్ రీ-ఓపెన్ తర్వాత పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? వైద్యులు చెప్పిన కారణాలు ఇవే
Frequent Illness After School Reopening : పిల్లలు స్కూల్కు వెళ్లడం స్టార్ట్ అయిన తర్వాత తరచూ అనారోగ్యానికి గురవుతారు. దీనికి కారణం ఏంటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

- బడి తిరిగి తెరిచాక పిల్లలకు జలుబు, జ్వరం తరచుగా వస్తున్నాయి.
- ఇది పిల్లల రోగనిరోధక శక్తి అభివృద్ధిలో భాగమని వైద్యులు తెలిపారు.
- రద్దీ గదులు, పరిశుభ్రత లేమి, నిద్రలేమి జబ్బులకు కారణం.
- సమతుల్య ఆహారం, శుభ్రత, తగిన నిద్ర రోగనిరోధకతను పెంచుతాయి.
Children Falling Sick Frequently After Schools Reopen : వేసవి సెలవుల తర్వాత స్కూల్స్ మళ్లీ తెరుచుకున్నాయి. అయితే ఇవి ప్రారంభమైన కొద్ది రోజులకే పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం, కడుపు ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు రావడం చాలా మంది తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది. అయితే దీని అర్థం పిల్లల ఆరోగ్యం బలహీనంగా ఉందని కాదని.. వారి రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధిలో ఇది భాగమని వైద్యులు చెబుతున్నారు.
స్కూల్ రీ-ఓపెన్ అయినప్పుడు చాలామంది పిల్లలు అనారోగ్యానికి గురి అవుతారని.. యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ నియోనటాలజిస్ట్, పీడియాట్రిషియన్ డాక్టర్ సత్యప్రియ సాహూ తెలిపారు. పిల్లలు తిరిగి స్కూల్కు వెళ్లినప్పుడు తోటి విద్యార్థులు, ఆట వస్తువులు, బెంచీలు, స్టేషనరీ, సాధారణ ఆట స్థలాల ద్వారా వైరస్లు, బ్యాక్టీరియాలకు ఎక్కువగా గురవుతారని వివరించారు. ఈ కారణంగా జలుబు, ఇన్ఫ్లుయెంజా, వైరల్ జ్వరాలు, కడుపు ఇన్ఫెక్షన్లు, హ్యాండ్-ఫుట్-మౌత్ డిసీజ్ (HFMD) వంటి సాధారణ వ్యాధులు ఎక్కువగా కనిపిస్తాయని తెలిపారు.
చిన్న పిల్లల్లో సాధారణమే
ప్రీస్కూల్ లేదా ప్రాథమిక పాఠశాలల్లో చదివే చిన్నారుల రోగనిరోధక వ్యవస్థ ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందదు. అందుకే స్కూల్ ప్రారంభమైన తొలి వారాల్లో చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు రావడం సాధారణంగానే జరుగుతాయని చెప్తున్నారు. అప్పుడు తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ప్రతి ఇన్ఫెక్షన్ ద్వారా శరీరం కొత్త యాంటీబాడీలను తయారు చేసుకుంటుందని డాక్టర్ సత్యప్రియ సాహూ తెలిపారు. పైగా రోగనిరోధక శక్తి క్రమంగా బలపడుతూ భవిష్యత్తులో వ్యాధులను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందన్నారు.
పిల్లలు అనారోగ్యానికి గురవడానికి కారణాలివే
స్కూల్స్ తెరుచుకున్న తర్వాత.. ఒకే గదిలో ఎక్కువ మంది పిల్లలు ఉండటం వల్ల వైరస్లు సులభంగా వ్యాపిస్తాయి. పిల్లలు తరచూ చేతులు కడుక్కోకపోవడం వల్ల సూక్ష్మక్రిములు ఒకరి నుంచి మరొకరికి చేరుతాయి. స్కూల్ రొటీన్ ప్రారంభమైన తర్వాత నిద్ర సమయాల్లో మార్పులు రావడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడవచ్చు. వాతావరణ మార్పులు, వర్షాకాలం వంటి సందర్భాల్లో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాపిస్తాయి.
వ్యాయామం, ఆటలు తక్కువగా ఆడే పిల్లల్లో ఇమ్యూనిటీపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అధికంగా ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు తగ్గుతాయి. ఇవన్నీ పిల్లల ఆరోగ్యంపై నెగిటివ్గా ప్రభావం చూపిస్తాయని చెప్తున్నారు నిపుణులు.
పిల్లల్లో రోగనిరోధక శక్తిని ఎలా పెంచాలి?
పిల్లల్లో ఇమ్యూనిటీ పెంచేందుకు పేరెంట్స్ శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలకు ప్రతిరోజూ తగినంత నిద్ర ఉండేలా చూడాలి. పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ సమృద్ధిగా ఉన్న సమతుల్యమైన ఆహారం ఇవ్వాలి. తగినంత నీరు తాగేలా చూసుకోవాలి. శారీరకంగా యాక్టివ్గా ఉండేందుకు ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి. వైద్యులు సూచించిన టీకాలను సమయానికి వేయించాలి. అవసరమైతే వార్షిక ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ కూడా వేయించాలి.
పిల్లలకు నేర్పించాల్సిన అలవాట్లు
పిల్లలను స్కూల్లో చేర్చేముందే కొన్ని అలవాట్లు చేయాలి. తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవడం, దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు నోరు, ముక్కు కప్పుకోవడం, వాటర్ బాటిల్స్, స్పూన్లు, ఇతర వస్తువులు పంచుకోకుండా ఉండటం..అనారోగ్యంగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడం వంటివి చేయాలి.
వైద్యసహాయం ఎప్పుడు తీసుకోవాలి?
పిల్లల్లో తరచూ చిన్న చిన్న జబ్బులు రావడం సాధారణమే అయినప్పటికీ, కొన్ని లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అధిక జ్వరంగా ఉండి ఎంతకీ తగ్గకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అసాధారణంగా నిద్రమత్తులో ఉండటం, తరచూ తీవ్రమైన ఇన్ఫెక్షన్లు రావడం, ఎదుగుదల సరిగా లేకపోవడం, కొన్ని రోజుల తర్వాత కూడా లక్షణాలు తగ్గకపోతే కచ్చితంగా వైద్య సహాయం తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























