Vizag GST Scam: కంపెనీలు పెట్టి వ్యాపారం చేయకుండానే రూ.1700 కోట్లు కొట్టేశారు- మైండ్ బ్లాంక్ చేసే జీఎస్టీ స్కామ్ - వైజాగ్ నుంచే!
Fake Invoice Scam: విశాఖలో వెలుగుచూసిన రూ. 1,700 కోట్ల భారీ జీఎస్టీ ఇన్వాయిస్ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు ఈ ఫేక్ ఇన్వాయిస్ మాయాజాలం ఏమిటి? ప్రభుత్వ ఖజానాకు ఎలా కన్నం వేస్తారు?

Input Tax Credit Scam: దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తూ, పన్ను ఎగవేతకు పాల్పడుతున్న భారీ నెట్వర్క్ను విశాఖపట్నం జీఎస్టీ నిఘా విభాగం బట్టబయలు చేసింది. సుమారు 1,700 కోట్ల రూపాయల విలువైన నకిలీ ఇన్వాయిస్లను సృష్టించి, ప్రభుత్వ ఖజానాకు 264 కోట్ల రూపాయల గండి కొట్టిన ఈ కుంభకోణంలో మాస్టర్ మైండ్ దంట్ల ఆదిరెడ్డి అలియాస్ అంజిరెడ్డిని అధికారులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఇతనిని అత్యాధునిక ఫైనాన్షియల్ ట్రాకింగ్ సాంకేతికత ద్వారా పట్టుకున్నారు.
ఏమిటీ ఫేక్ ఇన్వాయిస్ స్కామ్?
సాధారణంగా వ్యాపారస్తులు తాము కొనుగోలు చేసిన వస్తువులపై చెల్లించిన పన్నును ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ రూపంలో తిరిగి పొందుతారు. దీనిని అడ్డం పెట్టుకుని అంజిరెడ్డి వంటి మోసగాళ్లు ఎటువంటి వస్తువుల సరఫరా లేకుండానే కేవలం కాగితాల మీద నకిలీ ఇన్వాయిస్లు సృష్టిస్తారు. అంటే, వ్యాపారం జరిగినట్లు నమ్మించి, ప్రభుత్వం నుంచి అక్రమంగా డబ్బును , పన్ను మినహాయింపును పొందుతారు. విశాఖ కేసులో ఇలా ఏకంగా 92 నకిలీ కంపెనీలను సృష్టించి ఈ దందా సాగించారు.
అమాయకులే బాధితులు
ఈ స్కామ్ వెనుక ఉన్న అత్యంత భయంకరమైన అంశం ఏమిటంటే.. నిరుపేదలు, అమాయకుల ఆధార్, పాన్ కార్డుల దుర్వినియోగం. చిన్నపాటి ఆర్థిక సాయం చేస్తామనో లేదా ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తామనో నమ్మించి సేకరించిన ఈ పత్రాలతో అంజిరెడ్డి బోగస్ కంపెనీలను రిజిస్టర్ చేశాడు. ఆ కంపెనీలకు ఆయా బాధితులే యజమానులని రికార్డుల్లో చూపిస్తూ, అసలు సూత్రధారులు వెనుక ఉండి వేల కోట్ల లావాదేవీలు నడిపించారు. దీనివల్ల రేపు చట్టపరమైన సమస్యలు వస్తే ఆ అమాయకులే బలిపశువులవుతారు.
జీఎస్టీ చట్టం ప్రకారం తీవ్ర నేరం
జీఎస్టీ చట్టం సెక్షన్ 132 ప్రకారం.. ఎటువంటి వస్తువులు లేదా సేవలు సరఫరా చేయకుండా నకిలీ ఇన్వాయిస్లు జారీ చేయడం, తప్పుడు ఐటీసీ పొందడం నాన్-బెయిలబుల్ నేరం. ఈ స్కామ్లో రూ. 5 కోట్లకు మించి పన్ను ఎగవేత జరిగితే ఐదేళ్ల వరకు జైలు శిక్ష మరియు భారీ జరిమానా విధిస్తారు. విశాఖ స్కామ్లో ఎగవేత మొత్తం రూ. 264 కోట్లుగా ఉన్నందున, నిందితులకు కఠిన శిక్ష పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇప్పటికే అక్రమంగా పొందిన ఐటీసీని రికవరీ చేసే ప్రక్రియను ప్రారంభించింది.
ఆర్థిక ఉగ్రవాదంపై ఉక్కుపాదం
నకిలీ ఇన్వాయిస్ల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని దారి మళ్లించడం ఒక రకమైన ఆర్థిక ఉగ్రవాదం అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ సొమ్మును తరచుగా మనీ లాండరింగ్ లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వాడుతుంటారు. విశాఖ DGGI అధికారులు కేవలం అంజిరెడ్డితో ఆగకుండా, ఈ నకిలీ ఇన్వాయిస్లను కొనుగోలు చేసి లాభపడిన ఇతర కంపెనీల యజమానుల కోసం కూడా గాలింపు ముమ్మరం చేశారు. మున్ముందు ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
ట్రెండింగ్ వార్తలు






















