Wife Stabs Husband Case Telangana: భర్తను చంపిన భార్యకు జైలు శిక్ష రద్దు.. కేవలం రూ. 500 జరిమానా! ఎందుకో తెలుసా?
Wife Stabs Husband : ఓ భార్య భర్తను కత్తితో పొడిచి చంపేసింది. అయితే ఆమెకు ఐదు వందల జరిమానాతో హైకోర్టు సరిపెట్టింది. ఏప్రిల్ ఒకటిన తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆసక్తికరంగా ఉంది.

Culpable Homicide Not Amounting to Murder: తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 1న ఒక సంచలన తీర్పును వెలువరించింది. భర్తను కత్తితో పొడిచి చంపిన కేసులో ఒక మహిళకు విధించిన జైలు శిక్షను రద్దు చేస్తూ, కేవలం 500 రూపాయల జరిమానాతో ఆమెను విడిచిపెట్టింది. 2026 ఏప్రిల్ 1న వెలువడిన ఈ తీర్పు, క్షణికావేశంలో జరిగిన నేరాలు , ఆ సమయం నాటి పరిస్థితులను న్యాయస్థానాలు ఎంత లోతుగా పరిశీలిస్తాయనే దానికి నిదర్శనంగా నిలిచింది.
అసలు ఏం జరిగిందంటే.. అసిఫాబాద్ దంపతుల మధ్య మనస్పర్థల కారణంగా గత నెల రోజులుగా విడివిడిగా ఉంటున్నారు. ఒకరోజు భర్త పిల్లల కోసం ఖర్జూరాలు తీసుకుని భార్య ఇంటికి వచ్చాడు. అయితే, ఆమెను చూడగానే ఆయన ఆగ్రహంతో ఊగిపోయాడు. అసభ్య పదజాలంతో దూషిస్తూ, ఆమె తల్లిదండ్రులను కూడా తిట్టడం మొదలుపెట్టాడు. దీంతో తీవ్ర ఆవేదనకు లోనైన భార్య, క్షణికావేశంలో ఇంట్లోని కత్తిని తీసుకుని భర్త గొంతుపై పొడిచింది. తీవ్ర గాయంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ కేసు విచారణ చేపట్టిన ఆసిఫాబాద్ సెషన్స్ కోర్ట్ , 2011 సెప్టెంబర్ 8న ఆమెను దోషిగా తేల్చింది. నిందితురాలికి ఐపీసీ సెక్షన్ 304 పార్ట్-II హత్యాయత్నం కాని మరణం కింద నాలుగేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 500 రూపాయల జరిమానా విధించింది. అయితే, తన నేరాన్ని ఆమె ఎక్కడా నిరాకరించలేదు కానీ, ఆ పరిస్థితుల్లో తానూ అలా చేయాల్సి వచ్చిందని పేర్కొంటూ హైకోర్టును ఆశ్రయించింది.
తెలంగాణ హైకోర్టు ఈ అప్పీల్ను విచారిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితురాలు భర్తను పొడిచిన మాట వాస్తవమే అయినా, అది కేవలం ఆవేశంలో తీసుకున్న నిర్ణయమే తప్ప, అతడిని చంపాలనే ముందస్తు ప్రణాళిక లేదని కోర్టు అభిప్రాయపడింది. ఆ సమయంలో తన చర్య వల్ల భర్త చనిపోతాడనే విషయం ఆమెకు స్పష్టంగా తెలిసి ఉండకపోవచ్చని, కేవలం గాయపరచాలనే ఉద్దేశం మాత్రమే ఉండి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.
కేసు పూర్వాపరాలను, నిందితురాలు ఇప్పటికే అనుభవించిన మానసిక క్షోభను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. శిక్షా కాలాన్ని భారీగా తగ్గించింది. ఆమెకు విధించిన నాలుగేళ్ల జైలు శిక్షను రద్దు చేస్తూ, ట్రయల్ కోర్ట్ విధించిన 500 రూపాయల జరిమానాను చెల్లిస్తే సరిపోతుందని తీర్పునిచ్చింది. చట్టపరంగా నేరం రుజువైనప్పటికీ, మానవీయ కోణంలో పరిస్థితులను విశ్లేషించి హైకోర్టు ఈ ఉదారతను ప్రదర్శించింది.
Before You Go
కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామా
ట్రెండింగ్ వార్తలు






















