(Source: ECI/ABP News)
Hyderabad blackmail gang: జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ - ఇన్స్టా కీచకుల గుట్టురట్టు.. అసలు సూత్రధారి అర్జున్ అరెస్ట్!
Rich Kids Trap Case: జూబ్లీహిల్స్ లో సంచలనం సృష్టించిన రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో మాస్టర్ మైండ్ ను అరెస్టు చేశారు. వీరు ఇప్పటికే బ్లాక్ మెయిలింగ్ తో కోట్లు వసూలు చేసినట్లుగా అనుమానిస్తున్నారు.

Jubilee Hills Rich Kids Trap case Mastermind Arrest: హైదరాబాద్లో అత్యంత సంపన్న ప్రాంతమైన జూబ్లీహిల్స్లో కలకలం రేపిన రిచ్ కిడ్స్ ట్రాప్ ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా సంపన్న కుటుంబాలకు చెందిన యువతులను, మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న కింగ్పిన్ అర్జున్ అలియాస్ ఆజాద్ , అతని సోదరుడు రాజీవ్, తల్లి, మామతో సహా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖరీదైన కార్లు, లగ్జరీ లైఫ్ స్టైల్ను ఎరగా చూపి ఈ ముఠా సాగిస్తున్న అరాచకాలు విచారణలో వెలుగు చూసి విస్తుగొలుపుతున్నాయి.
ఖరీదైన కార్లు.. పబ్బులే ఎర!
అర్జున్, ఇన్స్టాగ్రామ్లో తాను కూడా ఒక కోటీశ్వరుడి లా ఫోజులు కొట్టేవాడు. ఖరీదైన బెంజ్, ఆడి వంటి లగ్జరీ కార్ల ఫోటోలు, హై-ప్రొఫైల్ పబ్బుల్లో పార్టీల వీడియోలను పోస్ట్ చేస్తూ యువతులను ఆకర్షించేవాడు. ముఖ్యంగా విదేశాల్లో ఉండే తల్లిదండ్రుల పిల్లలను, ఒంటరిగా ఉండే సంపన్న యువతులను టార్గెట్ చేసేవాడు. ప్రేమ పేరుతో వలవేసి, వారిని నమ్మించి విలాసవంతమైన ప్రదేశాలకు తీసుకెళ్లి, అతి సాన్నిహిత్యంగా ఉంటూ ఆ దృశ్యాలను రహస్యంగా రికార్డ్ చేసేవాడు.
బ్లాక్మెయిల్ నెట్వర్క్.. ఇంటి దొంగల సాయం!
ఈ ముఠా కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా, బాధితుల ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు, వాచ్మెన్లతో కూడా స్నేహం చేసేది. వారి ద్వారా ఆ కుటుంబాల ఆర్థిక స్థితిగతులు, పిల్లల కదలికలను సేకరించేది. ఒక పారిశ్రామికవేత్త కుమార్తెను ట్రాప్ చేసిన అర్జున్, ఆమె డ్రైవర్ ఫోన్ ద్వారానే సంభాషణలు సాగించి, ఆ తర్వాత రికార్డ్ చేసిన వీడియోలతో బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ వ్యవహారంలో అర్జున్ కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తూ, బాధితులను భయభ్రాంతులకు గురిచేసి లక్షల రూపాయలు వసూలు చేసేవారు.
30 లక్షల వసూలుతో బయటపడ్డ బాగోతం!
ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తెను బెదిరించి సుమారు 30 లక్షల రూపాయలు వసూలు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ధైర్యంగా జూబ్లీహిల్స్ పోలీసులను, షీ-టీమ్స్ను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు.. టెక్నికల్ ఆధారాలతో నిందితులను పట్టుకున్నాయి. ఇప్పటివరకు సుమారు 20 మందికి పైగా యువతులు ఈ ముఠా బారిన పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల ఫోన్లలో అనేక అభ్యంతరకర వీడియోలు, ఫోటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తల్లిదండ్రులకు పోలీసుల హెచ్చరిక!
సోషల్ మీడియాలో అపరిచితులతో స్నేహం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ . హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. తమ పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏయే ఫోటోలు షేర్ చేస్తున్నారు అనే అంశాలపై నిఘా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు. ఇలాంటి ముఠాల బారిన పడితే భయపడకుండా వెంటనే డైల్ 100 , షీ-టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555 కు సమాచారం ఇవ్వాలని వెల్లడించారు. బాధితుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.
ట్రెండింగ్ వార్తలు






















