Drugs Smuggling via Speed Post: వీడు మామూలోడు కాదు - తపాలా శాఖ ద్వారానే గంజాయి డెలివరీ !
Hyderabad Drugs Case: జార్ఖండ్ కేంద్రంగా స్పీడ్ పోస్ట్ ద్వారా 21 రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేస్తున్న భారీ అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ H-NEW పోలీసులు ఛేదించారు.

Speed Post Drugs Smuggling: భారత తపాలా శాఖకు చెందిన నమ్మకమైన స్పీడ్ పోస్ట్ సేవలను అడ్డంపెట్టుకుని దేశవ్యాప్తంగా గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సరఫరా చేస్తున్న ఒక భారీ అంతర్రాష్ట్ర ముఠా నెట్వర్క్ను హైదరాబాద్ పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. జార్ఖండ్ కేంద్రంగా సాగుతున్న ఈ నార్కోటిక్స్ దందాను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, స్థానిక పోలీసులు జాయింట్ ఆపరేషన్ ద్వారా బట్టబయలు చేశారు. ఈ మెగా ఆపరేషన్లో భాగంగా జార్ఖండ్కు చెందిన ప్రధాన నిందితుడు సత్యం మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేయగా, ఈ సిండికేట్లో భాగస్వాములుగా ఉన్న మరో నలుగురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ గురువారం వెల్లడించారు.
పోలీసుల విచారణలో ఈ ముఠా సాగించిన అక్రమ సామ్రాజ్యం గురించిన షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. జార్ఖండ్లోని గిరిడీ జిల్లాకు చెందిన సత్యం మిశ్రా అనే యువకుడు 2018లోనే గంజాయికి బానిసయ్యాడు. సులభంగా, అతి తక్కువ కాలంలో కోట్లు సంపాదించాలనే దురాశతో తన బంధువులైన సచిన్ మిశ్రా, రాహుల్ జా, సంతోష్ పండిట్లతో కలిసి ఒక సిండికేట్గా ఏర్పడ్డాడు. జార్ఖండ్లోని తమ సొంత ప్రాంతంలోనే పెద్ద ఎత్తున గంజాయి పంట పండించి, దాన్ని దేశవ్యాప్తంగా సరఫరా చేయడం ప్రారంభించారు. ఏకంగా 21 రాష్ట్రాలలో వీరికి వెయ్యి మందికి పైగా ఖరారైన కస్టమర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ముఠా పోలీసుల కళ్లు కప్పేందుకు సరికొత్త టెక్నాలజీని, కోడ్ భాషను వాడింది. వాట్సాప్, వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా కస్టమర్ల నుండి ఆర్డర్లు సేకరిస్తూ, యూపీఐ ద్వారా డిజిటల్ పేమెంట్లు తీసుకునేవారు. ఆర్డర్ చేసిన గంజాయిని ప్యాక్ చేసి, పైన మెడిసిన్స్ అని లేబుల్ అంటించి పోలీసులను, పోస్టల్ అధికారులను బురిడీ కొట్టించారు. జార్ఖండ్లోని ఇస్రి బజార్, పుస్క్రో బజార్ పోస్ట్ ఆఫీసుల ద్వారా స్పీడ్ పోస్ట్ పార్సిళ్లను రైళ్లు, విమానాల ద్వారా రవాణా చేసేవారు. నిఘా వర్గాలకు అనుమానం రాకుండా ఉండేందుకు గంజాయిని విక్రయించేటప్పుడు ‘మ్యాంగో స్టిక్’, ‘ఫ్లవర్’ వంటి రహస్య కోడ్ పదాలను ఉపయోగించేవారు. వీరు రోజుకు 80 నుండి 100 ఆర్డర్లను డెలివరీ చేస్తూ, ఏడాదికి రూ. 4 నుండి 5 కోట్ల భారీ టర్నోవర్ సాధిస్తున్నట్లు విచారణలో తేలింది.
హైదరాబాద్కు చెందిన సుశాంత్ వ్యాస్, లడ్డు అనే ఇద్దరు కొనుగోలుదారులను నగర పోలీసులు నిఘా పెట్టి అరెస్ట్ చేయడంతో ఈ అంతర్రాష్ట్ర లింకు బయటపడింది. వారి వద్ద నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు, దీనిపై గుడిమల్కాపూర్, ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లలో వేర్వేరు కేసులు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేశారు. ప్రధాన నిందితుడు సత్యం మిశ్రా గంజాయి అమ్మగా వచ్చిన నల్లధనాన్ని వైట్ మనీగా మార్చేందుకు తన తల్లి బ్యాంకు ఖాతాతో పాటు పలు యూపీఐ ఐడీలను వాడుతూ మనీ లాండరింగ్కు పాల్పడ్డాడు. ఈ డ్రగ్స్ డబ్బుతో భారీగా బంగారు ఆభరణాలు, విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించి వాటిని సీజ్ చేశారు.
ప్రస్తుతం సత్యం మిశ్రాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని, పరారీలో ఉన్న మిగిలిన నలుగురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని సీపీ తెలిపారు. పోస్టల్ వ్యవస్థలోని ఈ భద్రతా లోపాలను అరికట్టేందుకు, కొరియర్ ఏజెన్సీలు మరియు పోస్ట్ ఆఫీసుల్లో వచ్చే ప్రతి పార్సిల్ను తప్పనిసరిగా స్కాన్ చేయాలని ఆదేశించినట్లు, దీనిపై కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరాన్ని ‘డ్రగ్స్ ఫ్రీ సిటీ’గా మార్చడమే లక్ష్యంగా పోలీసు శాఖ అహర్నిశలు శ్రమిస్తోందని పేర్కొన్నారు. ప్రజలు లేదా కొరియర్ ఏజెన్సీల నిర్వాహకులకు ఏవైనా అనుమానాస్పద పార్సిళ్లు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా H-NEW హెల్ప్లైన్ నంబర్ 8712661601 కు సమాచారం అందించి నగర రక్షణలో భాగస్వాములు కావాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
ట్రెండింగ్ వార్తలు






















