Biggest scam in India: జీఎస్టీ కట్టాల్సి వస్తుందని బిల్లులే డిలీట్ చేస్తున్నారు - రెస్టారెంట్లు భారీ స్కామ్ - పట్టేసిన హైదరాబాద్ ఐటీ శాఖ
Massive tax evasion: రెస్టారెంట్ రంగంలో జరుగుతున్న భారీ పన్ను ఎగవేత వెలుగులోకి వచ్చింది. బిల్లింగ్ సాఫ్ట్వేర్ ద్వారా సుమారు రూ.70 వేల కోట్ల టర్నోవర్ను దాచిపెట్టినట్లు అధికారులు గుర్తించారు.

Massive tax evasion in the nationwide restaurant sector : హైదరాబాద్ ఆదాయపు పన్ను శాఖ పరిశోధన విభాగం దేశవ్యాప్త రెస్టారెంట్ రంగంలో జరుగుతున్న భారీ పన్ను ఎగవేతను పసిగట్టింది. ఒక ప్రముఖ బిల్లింగ్ సాఫ్ట్వేర్ ద్వారా సుమారు రూ. 70,000 కోట్ల టర్నోవర్ను దాచిపెట్టినట్లు అధికారులు గుర్తించారు. 2019-20 ఆర్థిక సంవత్సరం నుండి సాగుతున్న ఈ అక్రమాలను అత్యాధునిక డేటా విశ్లేషణ ద్వారా వెలికితీశారు. ఒక లక్షకు పైగా రెస్టారెంట్లు వినియోగిస్తున్న సాఫ్ట్వేర్ నుండి సేకరించిన 60 టెరాబైట్ల లావాదేవీల డేటాను పరిశీలించగా ఈ అంకెలు బయటపడ్డాయి.
ఈ పరిశోధనలో భాగంగా అధికారులు కృత్రిమ మేధ , జనరేటివ్ AI పరికరాలను వినియోగించారు. సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్లోని 1.77 లక్షల రెస్టారెంట్ ఐడీలను, సంబంధిత జీఎస్టీ నంబర్లను ఓపెన్ సోర్స్ డేటా ద్వారా మ్యాపింగ్ చేశారు. అహ్మదాబాద్లోని సాఫ్ట్వేర్ సెంటర్ నుండి సేకరించిన రికార్డులను హైదరాబాద్లోని డిజిటల్ ల్యాబ్లో ఫోరెన్సిక్ విశ్లేషణ చేయగా, గత ఆరు ఏళ్లలో రూ.2.43 లక్షల కోట్ల బిల్లింగ్ జరగగా, అందులో రూ. 13,317 కోట్లు బిల్లు చేసిన తర్వాత తొలగించినట్లు తేలింది.
రెస్టారెంట్లు అనుసరిస్తున్న అక్రమ పద్ధతులను కూడా అధికారులు గుర్తించారు. సాధారణంగా కార్డులు, యూపీఐ ద్వారా జరిగే డిజిటల్ లావాదేవీలను సాఫ్ట్వేర్లో నమోదు చేస్తూనే, నగదు రూపంలో వచ్చే ఆదాయాన్ని మాత్రం ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. కొన్ని సంస్థలు ఏకంగా నెల రోజుల బిల్లింగ్ డేటాను సాఫ్ట్వేర్ నుండి తుడిచివేసి, అతి తక్కువ విక్రయాలను మాత్రమే ఆదాయపు పన్ను రిటర్నులలో చూపిస్తున్నాయి. మరికొన్ని చోట్ల సాఫ్ట్వేర్ రికార్డుల్లో అధిక మొత్తం ఉన్నప్పటికీ, ట్యాక్స్ రిటర్నులలో మాత్రం తక్కువ మొత్తాన్ని నమోదు చేసి పన్ను ఎగవేతకు పాల్పడుతున్నాయి.
రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే కర్ణాటకలో అత్యధికంగా రూ.2,000 కోట్ల మేర బిల్లుల తొలగింపు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణలో రూ.1,500 కోట్లు, తమిళనాడులో రూ.1,200 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. దేశవ్యాప్తంగా అక్రమాలు జరిగిన మొదటి ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ ఉన్నాయి. విచారణ పరిధిలోకి తీసుకున్న కేసుల్లో సగటున 27 శాతం మేర అమ్మకాలను దాచిపెట్టినట్లు ఐ-టీ విభాగం నిర్ధారించింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని పరిస్థితిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన 3,734 పాన్ నంబర్లను విశ్లేషించగా ఐదేళ్ల కాలంలో రూ. 5,141 కోట్ల టర్నోవర్ వ్యత్యాసం కనిపించింది. కేవలం 40 రెస్టారెంట్లను నమూనాగా తీసుకుని జరిపిన లోతైన విచారణలోనే రూ. 400 కోట్ల అక్రమాలు వెలుగుచూశాయి. హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లోని ప్రముఖ ఆహార సంస్థల్లో సోదాలు నిర్వహించిన అధికారులు, ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ప్రస్తుతం ఒకే ఒక బిల్లింగ్ సాఫ్ట్వేర్ డేటా ఆధారంగా ఈ కుంభకోణం బయటపడగా, మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర సాఫ్ట్వేర్ల ద్వారా కూడా ఇలాంటి అక్రమాలు జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఈ విచారణను దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విస్తరించింది. రానున్న రోజుల్లో మరిన్ని రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, హోటళ్లపై ఐ-టీ నిఘా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.























