EV వినియోగదారులకు గుడ్న్యూస్.. 12 నిమిషాల్లో Electric cars 100 శాతం ఛార్జింగ్ !
Electric Car Battery: చైనా కంపెనీ CATL కేవలం 12 నిమిషాల్లో పూర్తిగా ఛార్జింగ్ చేయగల కొత్త EV బ్యాటరీని రూపొందిస్తోంది. ఈ బ్యాటరీ 1.5 మిలియన్ మైళ్ల కెపాసిటీ కలిగి ఉంటుందని పలు నివేదికలు చెబుతున్నాయి.

భారత్తో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో వాహనాల కాలుష్యాన్ని తగ్గించడంపై ఫోకస్ చేస్తున్నాయి. అందుకోసం ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. కాలుష్యం కారణంగానే పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ కార్లను (Electric Car) కొనాలని వాటిపై రాయితీలు ఇస్తున్నారు. అయితే వీటిని ఛార్జింగ్ చేయడానికి ఎక్కువ సమయం పట్టడం కస్టమర్లకు ఒక పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు ఈ సమస్యకు చైనాకు చెందిన ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థ CATL పరిష్కారం గుర్తించినట్లు పేర్కొంది.
మీడియా నివేదికల ప్రకారం, CATL కొత్త టెక్నాలజీతో కూడిన EV బ్యాటరీని ఇంట్రడ్యూస్ చేసింది. ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలతో పోలిస్తే ఈ బ్యాటరీ చాలా రెట్లు వేగంగా ఛార్జింగ్ అవుతుందని కంపెనీ తెలిపింది. దీనివల్ల ప్రజలు ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. మీ జర్నీ మరింత ఈజీ అవుతుంది.
కేవలం 12 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్
ఈ కొత్త బ్యాటరీ అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే.. దీనిని కేవలం 12 నిమిషాల్లో పూర్తిగా ఛార్జింగ్ చేయవచ్చు. ఇది కనుక సాధ్యమని నిరూపిస్తే, ఎలక్ట్రిక్ కార్లు నడిపేవారికి ఇది పెద్ద ఊరటనిచ్చే వార్త అవుతుంది. ప్రస్తుతం చాలా వరకు EVలు ఛార్జ్ కావడానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల ఈవీ వాహనదారులు సుదూర ప్రయాణాలు చేయడానికి కాస్త ఆలోచించినా వెనుకాడతారు. ఒకవేళ 12 నిమిషాల్లోనే వేగవంతమైన ఛార్జింగ్తో ఈవీ వాహనదారులకు సమస్య తొలగిపోతే, ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో కొత్త శకం మొదలైనట్లే.
ఎక్కువ కాలం మన్నిక.. తక్కువ నష్టం
నివేదికల ప్రకారం, ఈ కొత్త బ్యాటరీ 1.5 మిలియన్ మైళ్ల వరకు ట్రబుల్ ఇవ్వకుండా పనిచేస్తుంది. అంతటి లాంగ్ జర్నీ చేసిన తర్వాత కూడా దీని సామర్థ్యం సుమారు 80 శాతం వరకు అలాగే ఉంటుంది. కంపెనీ ఇందులో స్మార్ట్ కూలింగ్, సెల్ఫ్ రిపేర్ వంటి టెక్నాలజీని ఉపయోగించింది. దీనివల్ల బ్యాటరీ త్వరగా చెడిపోయే అవకాశాలు తక్కువ. కనుక ఎక్కువ కాలం మెరుగైన పనితీరును అందిస్తుంది.
కార్లలోకి రావడానికి మరికొంత సమయం
ప్రస్తుతానికి, ఈ కొత్త చైనా బ్యాటరీ మార్కెట్లోకి వచ్చే కార్లలో ఎప్పటి నుండి అందుబాటులోకి వస్తుందనే అంశంపై క్లారిటీ లేదు. రాబోయే కొన్ని సంవత్సరాలలో ఈ టెక్నాలజీ వాడకం ప్రారంభం కావచ్చని భావిస్తున్నారు. అదే జరిగితే, ఎలక్ట్రిక్ కార్లను పదేపదే, ఎక్కువ గంటలపాటు ఛార్జింగ్ చేయాల్సిన సమస్యకు చెక్ పెడుతుంది. చైనాకు చెందిన CATL కంపెనీ ఈ కొత్త బ్యాటరీ టెక్నాలజీ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో కొత్త శకానికి నాంది పలుకుతుందని చెప్పవచ్చు.
























