Vizianagaram Home Guard: విజయనగరం హోంగార్డు అక్రమ సంపాదన 20 కోట్లపైనే ! అధికారులకే దిమ్మతిరిగేలా ఆస్తులు ! ఏసీబీ వలలో శ్రీనివాసరావు
Vizianagaram Home Guard: ఏపీలో హోంగార్డు అక్రమాస్తులు రూ.20 కోట్లుపైనే ఉందని ఏసీబీ తనిఖీల్లో తేలింది. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో పని చేసే శ్రీనివాసరావు బాగోతం చూసి అధికారులే షాక్ అయ్యారు.

Vizianagaram Home Guard: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి తిమింగలాల వేటలో ఏసీబీ అధికారులు మరో భారీ చేపను పట్టుకున్నారు. సాధారణంగా అవినీతి దాడులు అంటే ఉన్నతాధికారులపై జరుగుతుంటాయి. కానీ విజయనగరం జిల్లాలో జరిగిన సోదాలు అందర్నీ విస్తుపోయేలా చేశాయి. ఒక సామాన్య హోంగార్డు స్థాయి వ్యక్తి ఏకంగా 20 కోట్లకుపైగానే ఆస్తులు కూడబెట్టాడన్న పక్క సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. ఎస్ కోట వేదికగా మొదలైన ఈ ఏసీబీ ప్రకంపనలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి.
విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు నెట్టి శ్రీనివాసరావు నివాసమే లక్ష్యంగా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కేవలం ఆయన నివాసంలోనే కాకుండా, ఆయనకు సంబంధించిన అనుచరులు, బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు కొనసాగాయి. అధికారుల సమాచారం ప్రకారం ఈ సోదాలు ప్రధానంగా నాలుగు ప్రాంతాల్లో కేంద్రీకృతమయ్యాయి.
విజయనగరం జిల్లాలోని ఎస్ కోటలో ఉన్న శ్రీనివాసరావు సొంత నివాసం. ఎస్కోటతోపాటు విజయనగరం, గుర్ల్ మండలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. పక్కనే ఉన్న విశాఖ పట్నం జిల్లాలో రెండు కీలకమైన ప్రదేశాల్లో అధికారులు తనిఖీలు చేశారు. ఒకేసారి ఇన్ని చోట్ల దాడులు జరగడం చూస్తుంటే శ్రీనివాసరావు నెట్వర్క్ ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. దర్యాప్తులో భాగంగా తెల్లవారుజాము నుంచే ఏసీబీ బృందాలు ఆయా ప్రాంతాలకు చేరుకుని రికార్డులను జల్లెడ పట్టాయి.
నెట్టి శ్రీనివాసరావు సుమారు 15 ఏళ్లుగా హోంగార్డుగా తన సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాధారణంగా హోంగార్డులకు వచ్చే గౌరవ వేతనం చాలా పరిమితంగా ఉంటుంది. కానీ 15 ఏళ్లలో ఆయన కూడబెట్టిన ఆస్తులు చూసి ఏసీబీ అధికారులే అవాక్కయ్యారు. అక్రమ సంపాదనతో ఆయన భారీగా నగదు, బంగారు ఆభరణాలు, స్థిరాస్తులు కూడబెట్టారు.























