రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వైసీపీ కుట్ర అని, దాడులకు పురికొల్పడానికి ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. అందువల్ల, వైసీపీ ట్రాప్లో పడకుండా సంయమనం పాటించాలని సూచించారు.
TDP vs YSRCP: "చట్టాన్ని గౌరవిద్దాం, సంయమనం పాటిద్దాం" టీడీపీ శ్రేణులకు పల్లా శ్రీనివాసరావు, అచ్చెన్న ఆదేశం
TDP vs YSRCP: టీడీపీ శ్రేణులంతా సంయమనం పాటించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదేశించారు. క్రమశిక్షణ కలిగిన వారంతా పార్టీ ఆదేశాలను పాటిస్తారని ఆకాంక్షించారు.

- టీడీపీ శ్రేణులకు వైసీపీ ఉచ్చులో పడొద్దని పల్లా శ్రీనివాసరావు సూచించారు.
- పార్టీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయకుండా సంయమనం పాటించాలని సూచనలు.
- రాష్ట్ర అభివృద్ధి, శాంతిభద్రతలపై చంద్రబాబు, అచ్చెన్నాయుడు దృష్టి సారించారు.
- వైసీపీ దుర్భాష, కుట్రలను అడ్డుకుంటూ చట్టప్రకారం చర్యలు.
TDP vs YSRCP: రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అలజడి అందర్నీ కంగారు పెట్టిస్తోంది. గతానికి భిన్నంగా జరుగుతున్న దాడులు ఇప్పుడు విమర్శలకు కారణమవుతోంది. అందుకే ఇలాంటివి జరగకుండా ఉండేందుకు తెలుగు దేశం పార్టీ తమ శ్రేణులకు కీలక సూచనలు చేసింది. వైసీపీ ట్రాప్లో పడొద్దని హితవు పలికింది. నోటికి వచ్చినట్టు మాట్లాడి, దాడులకు పురికొల్పి రాష్ట్రంలో శాంతిభద్రతలు విఘాతం కలిగే చేయడం వైసీపీ కుట్ర చేస్తోందని ఆరోపిస్తోంది. దీనిలో ఎవరూ భాగం కావద్దని సంయమనం పాటించాలని ఆ టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సూచించారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫిరెన్స్లో ఈ మేరకు పలు సూచనలు చేశారు.
"పార్టీకి ఉన్న బలమైన బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయొద్దు"
రెండు రోజులుగా జరుగుతున్న ఘర్షణలపై జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని పల్లా శ్రీనివాసరావు పార్టీ నేతలకు తెలిపారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో చట్టాలను కాలరాస్తూ, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అరాచక పాలన సాగించారని ఆయన గుర్తు చేశారు. అయితే అలాంటి పాలనను వ్యతిరేకించాం. కానీ ఇప్పుడు పార్టీ శ్రేణులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైన మార్గం కాదని ఆయన స్పష్టంగా చెప్పారన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న పోలికలు, ప్రేరణలకు లోనై స్పందించాల్సిన అవసరం లేదని సూచించారు. తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన నిబద్ధత, ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయని తెలిపారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు చట్టాన్ని గౌరవించే వారిగా సమాజంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారని, అదే మన పార్టీకి ఉన్న బలమైన బ్రాండ్ ఇమేజ్ అని ఆయన స్పష్టం చేశారు.
"రాష్ట్రాన్ని కాపాడాలి, భవిష్యత్తును నిలబెట్టాలి అనే లక్ష్యం"
వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, మంత్రి నారా లోకేష్ మార్గనిర్దేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున పోరాడడం, సమస్యలపై ఉద్యమించడం అనే సంప్రదాయాన్ని టీడీపీ 44 సంవత్సరాలుగా కొనసాగిస్తోందని చెప్పారు. "2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎన్నడూ చూడని పాలన చూశామని, ఆ సమయంలో పార్టీగా, నాయకులుగా, కార్యకర్తలుగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. టీడీపీని రాజకీయంగా అంతమొందించాలనే ఉద్దేశంతో కేసులు పెట్టారని, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును జైలుకు పంపినా పార్టీ వెనక్కి తగ్గలేదు. రాష్ట్రాన్ని కాపాడాలి, భవిష్యత్తును నిలబెట్టాలి అనే లక్ష్యంతో చంద్రబాబు వీరోచితంగా పోరాడారు.
"కేవలం 20 నెలల్లోనే రాష్ట్రం ఊహించని విధంగా గాడిలో పెట్టాం"
గత ఐదేళ్ల దుర్మార్గపు రాజకీయాలు, అరాచకాలు చూసిన ప్రజలు 2024లో కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని అప్పగించారు. టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మిస్తుందని నమ్మి ప్రజలు పట్టం కట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పరిస్థితి చాలా దయనీయంగా ఉండటంతో, రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలమా అనే ఆందోళన కూడా వచ్చిందన్నారు. అయితే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు నాయకుడిగా ఉండటం మన అదృష్టమని, దీనికి తోడుగా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండటం, ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్కు హితంగా సహకరించడం వల్ల కేవలం 20 నెలల్లోనే రాష్ట్రం ఊహించని విధంగా గాడిలో పడిందన్నారు."
"కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు"
పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, కేంద్ర సహకారంతో అమరావతిని చట్టబద్ధ రాజధానిగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు అచ్చెన్న. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, రైల్వే జోన్ వంటి కీలక ప్రాజెక్టులు వస్తున్నాయని, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయం, పాడి పరిశ్రమ, మత్స్య రంగం, గ్రామీణాభివృద్ధి, మధ్యతరగతి, రైల్వే కారిడార్ అభివృద్ధికి గణనీయమైన సహాయం అందిందన్నారు. జరిగిన కొన్ని ఘటనలపై బాధ ఉన్నా, ప్రతిచర్య పేరుతో హింసకు దిగడం సరైనది కాదని సూచించారు. పల్నాడు, పలమనేరు, గుంటూరు వంటి ప్రాంతాల్లో అలజడులు సృష్టించే ప్రయత్నాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థంగా అరికట్టారన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలను అణిచివేస్తూ శాంతిభద్రతలను కాపాడుతున్నామన్నారు.
"వైసీపీ ఉచ్చులో పడొద్దు"
వైసీపీ నాయకుల దుర్భాష ప్రజలకు అసహ్యం కలిగిస్తోందని, రాజకీయ నాయకులు ఇలా మాట్లాడాలా అని ప్రజలే ప్రశ్నిస్తున్నారని అచ్చెన్న అన్నారు. సీనియర్ నాయకులపై బూతులు మాట్లాడడం జుగుప్సాకరమని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేసినా, చట్టప్రకారం చర్యలు తీసుకోవడమే సరైన మార్గమని చెప్పారు. దాడులు, హింస తెలుగుదేశం పార్టీ సంస్కృతి కాదని, ప్రజాస్వామ్య విలువలతోనే ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీ దొరికిపోవడంతో, దాన్ని దారి మళ్లించేందుకే ఇలాంటి నీచమైన కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఆ ఉచ్చులో పడకుండా ప్రతి ఒక్కరూ ఓపికతో వ్యవహరించాలని, రాష్ట్రానికి నష్టం కలగకుండా జాగ్రత్త పడాలని కోరారు. తప్పు చేసిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని మంత్రి అచ్చెంన్నాయుడు స్పష్టం చేశారు.
Frequently Asked Questions
టీడీపీ శ్రేణులకు వైసీపీ ట్రాప్లో పడొద్దని ఎందుకు సూచించారు?
పార్టీకి ఉన్న బలమైన బ్రాండ్ ఇమేజ్ ఏమిటని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు?
తెలుగుదేశం పార్టీకి ఉన్న స్పష్టమైన నిబద్ధత, ప్రజాస్వామ్య విలువలు, చట్టాన్ని గౌరవించే నాయకులు, కార్యకర్తల గుర్తింపే పార్టీకి ఉన్న బలమైన బ్రాండ్ ఇమేజ్ అని ఆయన తెలిపారు.
20 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ను ఎలా గాడిలో పెట్టారు?
అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు నాయకత్వం, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం, ప్రధాని మోదీ సహకారం వల్ల కేవలం 20 నెలల్లోనే రాష్ట్రం ఊహించని విధంగా గాడిలో పడిందని తెలిపారు.
ప్రస్తుతం కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా?
అవును, పల్నాడు, పలమనేరు, గుంటూరు వంటి ప్రాంతాల్లో అలజడులు సృష్టించే ప్రయత్నాలు జరిగాయి. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటిని సమర్థంగా అరికట్టి, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలను అణిచివేస్తూ శాంతిభద్రతలను కాపాడుతున్నారు.
తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంతో ప్రస్తుత ఘటనలకు సంబంధం ఏమిటి?
తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీ దొరికిపోవడంతో, ప్రజల దృష్టిని మరల్చడానికి ఇలాంటి నీచమైన కుట్రలు చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.
ట్రెండింగ్ వార్తలు






















