Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
TTD Free Darshan Re Entry Pass Gate : తిరుమల సర్వదర్శనం క్యూలైన్లలో టీటీడీ రీ-ఎంట్రీ సదుపాయం కల్పిస్తున్నారు. టోకెన్ పొంది బయటకు వెళ్లి తిరిగి క్యూలైన్లలోకి రావొచ్చు.

TTD Sarva Darshan Token System: ఏడుకొండలవాడి దర్శనం కోసం తిరుమలకు వచ్చే లక్షలాది మంది సామాన్య భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత భారీ ఊరటను అందించే విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా సర్వదర్శనం రీ-ఎంట్రీ ఫెసిలిటీ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై భక్తులు క్యూలైన్లలోకి ప్రవేశించిన తర్వాత తమకు కేటాయించిన దర్శనం సమయం వచ్చే వరకు బయటకు వెళ్లి, తిరుమలలోని ఇతర క్షేత్రాలను సందర్శించడం లేదా వ్యక్తిగత పనులు పూర్తి చేసుకుని తిరిగి క్యూలైన్లలోకి యథాతథంగా చేరుకోవచ్చు.
టోకెన్ సేకరణ, రీ-ఎంట్రీ పాస్ పొందడం ఎలా?
ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునే భక్తులు ముందుగా సాధారణ సర్వదర్శనం క్యూలైన్ ద్వారా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 లోకి ప్రవేశించాలి. అక్కడ ప్రాథమిక తనిఖీలు పూర్తయ్యాక మీ ప్రభుత్వ గుర్తింపు కార్డు ఆధారంగా డిజిటల్ టోకెన్ జారీ చేస్తారు. టోకెన్ తీసుకున్న తర్వాత, మీరు తాత్కాలికంగా బయటకు వెళ్లాలనుకుంటే.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్ 17 సమీపంలో ఉండే ప్రత్యేక రీ-ఎంట్రీ డెస్క్ను సంప్రదించాలి. అక్కడ మీ టోకెన్ను ఎగ్జిట్ పాయింట్ వద్ద స్కాన్ చేయించుకుని అధికారిక రీ-ఎంట్రీ పాస్ను పొందాల్సి ఉంటుంది.
సమయం ఆదా.. తిరుమల సందర్శన!
ఎగ్జిట్ వద్ద స్కాన్ పూర్తయిన తర్వాత భక్తులు నిర్భయంగా వైకుంఠం కాంప్లెక్స్ నుంచి బయటకు రావచ్చు. టీటీడీ అధికారులు మీకు సూచించిన సమయానికి అనుగుణంగా, అంతవరకు దొరికిన సమయాన్ని తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం, వరాహస్వామి ఆలయం, మ్యూజియం లేదా ఇతర పుణ్యతీర్థాల సందర్శనకు వినియోగించుకోవచ్చు. దీనివల్ల కంపార్ట్మెంట్లలో గంటల తరబడి వేచి ఉండే అలసట తప్పడమే కాకుండా, చిన్న పిల్లలు, వృద్ధులతో వచ్చే కుటుంబాలకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.
తిరిగి క్యూలైన్లోకి ప్రవేశించే విధానం
అధికారులు నిర్దేశించిన సమయానికి సరిగ్గా 15 నుండి 20 నిమిషాల ముందుగా భక్తులు తిరిగి చేరుకోవాల్సి ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర మ్యూజియం పక్కన ఉన్న గేట్ డబ్ల్యూ-4 ద్వారా రీ-ఎంట్రీకి అనుమతిస్తారు. గేట్ సమీపంలో ఉండే రీ-ఎంట్రీ ఆఫీస్ ' వద్ద మీ దగ్గరున్న డిజిటల్ టోకెన్ , రీ-ఎంట్రీ పాస్లను చూపిస్తే, అధికారులు వాటిని వెరిఫై చేసి లోపలికి అనుమతిస్తారు. ఈ నియమాలను పాటిస్తే భక్తులు నేరుగా తమకు కేటాయించిన కంపార్ట్మెంట్కు చేరుకోవచ్చు.
రెండు నుంచి నాలుగు గంటల్లోనే స్వామివారి దర్శనం!
ఒక్కసారి కంపార్ట్మెంట్లు తెరిచిన తర్వాత ఈ నూతన డిజిటల్ ట్రాకింగ్ విధానం వల్ల భక్తులు అత్యంత వేగంగా, సాధారణంగా 2 నుండి 4 గంటల్లోనే శ్రీవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకోవచ్చు. సామాన్య భక్తుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ ప్రవేశపెట్టిన ఈ టెక్నాలజీ ఆధారిత సంస్కరణపై దేశవ్యాప్తంగా భక్తజనం హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పర్యటనను ప్లాన్ చేసుకునే భక్తులు ఈ కొత్త రీ-ఎంట్రీ మార్గదర్శకాలను అవగాహన చేసుకుని తమ సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు.
ట్రెండింగ్ వార్తలు






















