AP government teachers: గ్లోబల్ టీచర్స్.. గ్లోబల్ చదువు - సింగపూర్, ఫిన్లాండ్ విద్యా విధానాల పరిశీలనకు ఏపీ ఉపాధ్యాయులు !
Singapore teachers: ఆంధ్రప్రదేశ్ విద్యా రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యం కార్యరూపం దాలుస్తోంది. సింగపూర్, ఫిన్లాండ్ విద్యా విధానాలను పరిశీలించేందుకు అధ్యాపకుల్ని పంపుతున్నారు.

Study tour of AP government teachers in Singapore: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో మంత్రి నారా లోకేష్ సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. కేవలం భవనాల ఆధునీకరణే కాకుండా, బోధనా పద్ధతుల్లో అంతర్జాతీయ ప్రమాణాలు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఉపాధ్యాయులకు గ్లోబల్ ఎక్స్పోజ కల్పించేలా వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ విద్యా రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే మంత్రి నారా లోకేష్ సంకల్పం ఇప్పుడు కార్యరూపం దాలుస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను విదేశీ అధ్యయన యాత్రలకు పంపడం ద్వారా, అక్కడి అత్యుత్తమ విద్యా విధానాలను మన రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 4 నుంచి 9 వరకు 37 మంది ఉపాధ్యాయుల బృందం సింగపూర్లో పర్యటించనుంది. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ఇలాంటి అంతర్జాతీయ వేదికను కల్పించడం దేశంలోనే ఇదే ప్రథమం.
సింగపూర్ నమూనాపై ప్రత్యేక దృష్టి
ప్రపంచంలోనే అత్యంత క్రమశిక్షణతో కూడిన విద్యా వ్యవస్థ కలిగిన సింగపూర్లో ఉపాధ్యాయుల బృందం ఐదు రోజుల పాటు పర్యటించనుంది. ముఖ్యంగా సెకండరీ విద్యా విధానం, విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసే బోధనా పద్ధతులు, పాఠశాలల నిర్వహణ మరియు, సాంకేతికత వినియోగంపై వీరు క్షేత్రస్థాయిలో అవగాహన పెంచుకోనున్నారు. ఈ పర్యటన అనంతరం, అక్కడి ఉత్తమ పద్ధతులను ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల అవసరాలకు అనుగుణంగా ఎలా మార్చుకోవచ్చనే అంశంపై ఈ బృందం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.
తదుపరి లక్ష్యం.. ఫిన్లాండ్!
సింగపూర్ పర్యటన కేవలం ఆరంభం మాత్రమేనని, జూన్ , జూలై నెలల్లో మిగిలిన ఉత్తమ ఉపాధ్యాయులను ఫిన్లాండ్ పంపనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రాథమిక విద్యలో ప్రపంచానికే దిక్సూచిగా నిలిచే ఫిన్లాండ్ విద్యా విధానంపై మన ఉపాధ్యాయులు అధ్యయనం చేయనున్నారు. మంచి గురువు దగ్గరే మంచి శిష్యుడు తయారవుతాడు అనే నమ్మకంతో, టీచర్ల నైపుణ్యాభివృద్ధికి లోకేష్ ఇస్తున్న ప్రాధాన్యత విద్యా వర్గాల్లో ప్రశంసలందుకుంటోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, ఉపాధ్యాయులకు అంతర్జాతీయ శిక్షణ కల్పిస్తామన్న మాటను లోకేష్ నిలబెట్టుకున్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే క్రమంలో ఇది ఒక విప్లవాత్మక అడుగు. ఉపాధ్యాయుల్లో వృత్తిపరమైన గౌరవాన్ని పెంచడంతో పాటు, వారి ఆలోచనా ధోరణిని ప్రపంచ స్థాయికి మార్చడం ద్వారా ఏపీ విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్ గా మార్చవచ్చన్నది ఆయన వ్యూహం.
విద్యా వ్యవస్థలో సరికొత్త అధ్యాయం
ఏపీ విద్యాశాఖలో లోకేష్ మార్క్ సంస్కరణలు ఒక స్పష్టమైన మార్పును సూచిస్తున్నాయి. ఐఐటీ మద్రాస్ వంటి సంస్థల సహకారంతో పాఠ్యాంశాల మార్పు, ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్స్ నిర్మాణం, ఇప్పుడు ఉపాధ్యాయుల విదేశీ అధ్యయన యాత్రలు.. ఇవన్నీ రాష్ట్ర విద్యా రంగ భవిష్యత్తును మారుస్తున్నాయి. ఈ కొత్త ఇనీషియేటివ్ రేపటి తరం విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి జ్ఞానాన్ని తమ ఊరి బడిలోనే పొందేలా దోహదపడనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ఇతర రాష్ట్రాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఉపాధ్యాయులకు అంతర్జాతీయ ఎక్స్పోజర్ కల్పించడం అనేది విద్యా రంగంలో మన్నికైన, శాశ్వతమైన ఫలితాలను ఇచ్చే ఒక అత్యుత్తమ పెట్టుబడిగా అంచనా వేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















