Police shock Ambati Rambabu: అంబటి రాంబాబుకు షాకిచ్చిన పోలీసులు - మరో కేసులో పీటీ వారెంట్ దాఖలు -రిలీజ్ లేనట్లే!
Ambati Rambabu PT warrant : అంబటి రాంబాబుకు షాక్ తగిలింది. బెయిల్ వచ్చినా రిలీజ్ కావడం కష్టంగా మారింది. మరో పాత కేసులో పీటీ వారెంట్ ను పోలీసులు దాఖలు చేశారు.

Police shock Ambati Rambabu PT warrant filed in another case: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబుకు కోర్టులో ఊరట లభించిన కొద్ది గంటల్లోనే మళ్ళీ చిక్కులు మొదలయ్యాయి. ముఖ్యమంత్రిని దూషించిన కేసులో సోమవారం , పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసుల్లో ఆయనకు బుధవారం సాయంత్రం బెయిల్ మంజూరైంది. అయితే, ఆయన జైలు నుంచి విడుదల కాకుండానే సత్తెనపల్లి పోలీసులు గుంటూరు సబ్ కోర్టులో మరో పీటీ వారెంట్ దాఖలు చేశారు. 2023 నాటి సంక్రాంతి లక్కీ డ్రా అవినీతి కేసులో ఆయనను విచారించాల్సి ఉందని పోలీసులు పేర్కొనడంతో ఆయన విడుదలపై సందిగ్ధత నెలకొంది.
సంక్రాంతి పండుగ పేరుతో వసూళ్లకు పాల్పడినట్లుగా కేసు
2023 సంక్రాంతి పండుగ సందర్భంగా సత్తెనపల్లిలో వైఎస్సార్ సంక్రాంతి సంబరాల పేరుతో అంబటి రాంబాబు భారీ ఎత్తున లక్కీ డ్రా నిర్వహించారు. వంద రూపాయల టికెట్ పెట్టి కార్లు, బైకులు బహుమతులుగా ప్రకటిస్తూ కోట్లాది రూపాయల వసూళ్లకు పాల్పడ్డారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ లాటరీ నిర్వహణకు ఎటువంటి అనుమతులు లేవని, సచివాలయ వలంటీర్ల ద్వారా బలవంతంగా టికెట్లు అమ్ముతూ అవినీతికి పాల్పడ్డారని జనసేన నేత గాదె వెంకటేశ్వర రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేయకపోవడంతో ఆయన కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు అంబటిపై కేసు నమోదైంది.
కోర్టు ఆదేశంతో వైసీపీ హయాంలోనే కేసు నమోదు
గత మూడు రోజులుగా అంబటి రాంబాబు చుట్టూ పోలీసులు పాత కేసులతో ఉచ్చు బిగిస్తున్నారు. గతేడాది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేసిన ఆందోళనలో పోలీసులపై దురుసుగా ప్రవర్తించారనే కేసులో ఇప్పటికే ఆయనపై పీటీ వారెంట్ అమలైంది. ఆ కేసులో బెయిల్ రాగా, ఇప్పుడు రెండేళ్ల క్రితం నాటి లక్కీ డ్రా కేసును పోలీసులు తెరపైకి తెచ్చారు. అంబటి రాంబాబును గురువారం కోర్టులో హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించడంతో, పోలీసులు ఆయనను మళ్ళీ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.
ఈ కేసులోనూ బెయిల్ వస్తేనే అంబటి రాంబాబు విడుదల
వరుసగా రెండు కేసుల్లో బెయిల్ రావడంతో అంబటి రాంబాబు గురువారం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలవుతారని ఆయన కుటుంబసభ్యులు, వైసీపీ శ్రేణులు భావించాయి. కానీ, సత్తెనపల్లి పోలీసులు వేసిన ఈ తాజా పీటీ వారెంట్ పిటిషన్తో ఆయన జైలు జీవితం మరికొంత కాలం ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా పలు స్టేషన్లలో కేసులు నమోదైనట్లు వార్తలు వస్తుండటంతో, ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో అరెస్టు చూపించే వ్యూహంతో పోలీసులు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.























