Ambati Rambabu granted bail: అంబటి రాంబాబుకు బెయిల్ - జైలు నుంచి బయటకు రావడం ఖాయమే !
Ambati Rambabu : అంబటి రాంబాబుకు మరో కేసులోనూ బెయిల్ వచ్చింది . మరే పీటీ వారెంట్ పెండింగ్ లో లేకపోవడంతో ఆయన విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Ambati Rambabu gets bail: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబుకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో నమోదైన కేసులో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇదే సమయంలో ఆయనను విచారించేందుకు పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ను న్యాయమూర్తి తిరస్కరించారు. దీంతో వరుస కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయనకు చట్టపరంగా మార్గం సుగమమైంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అసభ్య పదజాలంతో దూషించారనే ఆరోపణలపై నమోదైన ప్రధాన కేసులో అంబటి రాంబాబుకు ఇప్పటికే బెయిల్ లభించింది. అయితే, ఇదే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి నోటీసులు జారీ చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఫలితంగా ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసుల్లో తక్షణ అరెస్టు ముప్పు తప్పినట్లయింది.
ప్రస్తుతానికి అంబటి రాంబాబుపై ఇతర ఏ కేసుల్లోనూ పీటీ వారెంట్లు పెండింగ్లో లేవు. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ, జైలు నుంచి ఆయన విడుదల కావడానికి ఉన్న అన్ని సాంకేతిక అడ్డంకులు తొలగిపోయాయి. కోర్టు ఉత్తర్వులు జైలు అధికారులకు అందిన వెంటనే అధికారిక ప్రక్రియ పూర్తి చేసి, ఆయనను విడుదల చేసే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో మాజీ మంత్రి అంబటి రాంబాబును జనవరి 31న పోలీసులు అరెస్టు చేశారు. అంతకుముందు గుంటూరులోని ఆయన నివాసం వద్ద వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు ఆయనపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, భారీ బందోబస్తు మధ్య నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం ఫిబ్రవరి 2న గుంటూరు మొబైల్ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.
తర్వాత ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. విచారణ జరిపిన గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు కోర్టు ఫిబ్రవరి 9న సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేస్తూ ఆయనకు ఊరటనిచ్చింది. అయితే, అదే రోజున వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గతంలో జరిగిన నిరసనలకు సంబంధించిన మరో పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసులో కోర్టు ఆయనకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించడంతో, తొలి కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఆయన జైలులోనే కొనసాగాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ కేసులోనూ బెయిల్ రావడంతో బయటకు రానున్నారు.
అయితే చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యల విషయంలో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహంగా ఉండటంతో ఆయన భద్రత సవాల్ గా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆయనను పోలీసులు కోర్టులో హాజరు పరిచేటప్పుడు.. గార్డుల్ని అడ్డం పెట్టుకుని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు బెయిల్ రావడంతో ఆయనకు అలాంటి సెక్యూరిటీ లభించదు.























