Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
TDP Kolikapudi: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడిని ఇక దూరం పెడుతున్నట్లుగా ఆ పార్టీ సంకేతాలు ఇస్తోంది. చివరి హెచ్చరిక అయిపోయిందని పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు.

Palla Srinivas on Kolikapudi: కొలికపూడికి చివరి హెచ్చరిక అయిపోయిందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పష్టం చేశారు. కొలికపూడి శ్రీనివాస్కు పార్టీ పరంగా ఇప్పటికే చివరి హెచ్చరిక జారీ అయిపోయిందని .. ఇకపై ఆయన్ని పిలిచి మాట్లాడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆయన ప్రవర్తనలో మార్పు రాకపోతే తదుపరి చర్యలు ఉంటాయనే సంకేతాలు ఇచ్చారు. పార్టీ క్రమశిక్షణను అతిక్రమించే వారు ఎవరైనా పరిణామాలు ఎదుర్కోవాల్సిందేనని పల్లా చేసిన ఈ వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తన గురించి తాను చాలా గొప్పగా ఊహించుకుంటున్నారని పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు, అక్కడ లభించే ఆదరణ చూసి తనకు ఏదో పెద్ద క్రేజ్ వచ్చేసిందని ఆయన భ్రమపడుతున్నారని పల్లా ఎద్దేవా చేశారు. పార్టీ అండ లేకపోతే ఎవరైనా సున్నా అని, అది తనకైనా.. కొలికపూడికైనా వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ మద్దతు లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తే ఆర్థికంగా పూర్తిగా దెబ్బతింటారని హెచ్చరించారు.
కొలికపూడి తీరుపై పల్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో అసెంబ్లీ లాబీల్లోనే తనతో మాట్లాడినప్పుడు.. తప్పు జరిగింది, ఇకపై మీరు చెప్పినట్లు నడుచుకుంటాను, మీ సలహాలు పాటిస్తాను అని కొలికపూడి స్వయంగా చెప్పారని పల్లా గుర్తు చేశారు. అయితే, అలా చెప్పిన వ్యక్తి సాయంత్రం కల్లా మళ్ళీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వివాదాలకు తెరలేపారని, ఇది ఆయన ద్వంద్వ వైఖరిని చూపిస్తోందన్నారు. నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ విషయంలో జరుగుతున్న వివాదాలపైనా పల్లా క్లారిటీ ఇచ్చారు. దేవాలయాల్లో ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ఉండటం సహజమని, అయితే ఎంపీలు వచ్చినప్పుడు వారి పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించడం కనీస ధర్మమని ఆయన హితవు పలికారు. కేవలం వ్యక్తిగత ఇమేజ్ వల్ల ఎవరూ ఎన్నికల్లో గెలవలేరని, ఆ విషయం కొలికపూడికి అర్థం కావడం లేదని పల్లా అసహనం వ్యక్తం చేశారు.
ఇటీవల గంపలగూడెం మండలం నెమలి శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే విషయంలో వీరిద్దరి మధ్య బహిరంగంగా వాగ్వాదం జరిగింది. ఎంపీ చేతిలో ఉన్న పట్టువస్త్రాలను ఎమ్మెల్యే లాక్కోవడం తీవ్ర చర్చకు దారితీసింది. దీనికి తోడు, గతంలో ఎన్నికల టికెట్ కోసం ఎంపీ చిన్నికి తాను రూ. 5 కోట్లు ఇచ్చానంటూ కొలికపూడి చేసిన ఆర్థిక ఆరోపణలు, సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలు ఈ వివాదాన్ని మరింత పెంచుతున్నాయి. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారనే కారణంతో ఇప్పటికే అధిష్టానం కొలికపూడికి పలుమార్లు నోటీసులు జారీ చేసి, హెచ్చరికలు కూడా చేసింది. అయినా ఆయన తగ్గడం లేదు.























