Andhra Labor Adda: ఆంధ్రా కార్మికుల కోసం లేబర్ అడ్డాలు - చంద్రబాబు వినూత్న ఆలోచన
Labor Adda: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే డే సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అత్యాధునిక లేబర్ అడ్డా లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.

Andhra Labor Adda CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణంలో కార్మికుల పాత్రను గుర్తిస్తూ, వారి సంక్షేమం కోసం దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక లేబర్ అడ్డాలను ఏర్పాటు చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. మే డేను పురస్కరించుకుని శ్రమశక్తి పురస్కారాలు అందించారు.
ఈ లేబర్ అడ్డాలు కేవలం కార్మికులు వేచి చూసే కేంద్రాలు మాత్రమే కాకుండా, పని లేని రోజుల్లో వారి నైపుణ్యాన్ని పెంచే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు గా మారుతాయని ఆయన స్పష్టం చేశారు. తొలి దశలో అమరావతితో సహా 15 ప్రధాన నగరాల్లో వీటిని నిర్మిస్తామని, కార్మికులకు అత్యాధునిక పనిముట్లతో పాటు ఈఎస్ఐ ఆస్పత్రుల ద్వారా మెరుగైన వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి పునర్ వైభవం తెచ్చే క్రమంలో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కాలపరిమితిని విధించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల దెబ్బతిన్న పోలవరం ప్రాజెక్టును 2027 పుష్కరాల నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, కృష్ణా జిల్లా ముఖచిత్రాన్ని మార్చే బందరు పోర్టు పనులను ఈ ఏడాది డిసెంబర్ నాటికే పూర్తి చేయాలన్న లక్ష్యంతో శరవేగంగా పనులు సాగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్-మచిలీపట్నం ఎక్స్ప్రెస్వే, బీచ్ రోడ్డు విస్తరణ వంటి పనుల ద్వారా ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
విపక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ సీఎం, వైసీపీని గొడ్డలి పార్టీ గా అభివర్ణించారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజా వేదికను కూల్చివేసిన సంస్కృతి వారిదని, కానీ తమ కూటమి ప్రభుత్వం విధ్వంసమైన వ్యవస్థలను పునర్నిర్మిస్తోందని అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని మరోమారు స్పష్టం చేస్తూ, సంక్షేమం కోసం ప్రతీ నెలా రూ.2,721 కోట్ల పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని, ఇది దేశంలోనే రికార్డు అని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం చాలా పారదర్శకంగా పనిచేస్తోందని, ప్రజల సహకారమే తమకు శ్రీరామరక్ష అని ఆయన వ్యాఖ్యానించారు.
కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కలలో ‘‘పేదల సేవలో’’, ‘‘మేడే’’ కార్యక్రమాల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు పాల్గొన్నారు. మేడే సందర్భంగా ఉత్తమ కార్మికులు, పరిశ్రమల యాజమాన్యాలకు పురస్కారాలు అందించి సత్కరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి… pic.twitter.com/HB06i5uCAL
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) May 1, 2026
విద్యా మరియు పంచాయతీరాజ్ వ్యవస్థల్లో వచ్చిన మార్పులను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. మంత్రి లోకేష్ తీసుకొచ్చిన సంస్కరణల వల్లే పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని ప్రశంసించారు. కార్మికుల పిల్లలు కూడా రేపు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నదే తమ ప్రభుత్వ ఆశయమని చెబుతూ, శ్రమశక్తి పురస్కారాలను అందజేసి కార్మికుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఎమ్మెల్యేల పనితీరుపై నేరుగా ప్రజల నుంచే ఫీడ్బ్యాక్ తీసుకుంటానని చెప్పడం ద్వారా ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనాన్ని పెంచేలా సీఎం గట్టి సంకేతాలిచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















