Chandrababu: ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవన హబ్గా రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం - సమీక్షలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
Chandrababu Naidu: పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంపై సీఎం సమీక్ష నిర్వహించారు. రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం ప్రాంతాలను ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవన హబ్గా మార్చాలని లక్ష్యాన్ని నిర్దేశించారు.

Andhra pending projects: రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం ప్రాంతాలను ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవన హబ్గా మార్చడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గ్లోబల్ మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా 500 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తుల సాధనే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, ఉద్యాన రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.
10 జిల్లాలను కేంద్ర బిందువుగా చేసుకుని ఉద్యాన సాగు
రాష్ట్రంలోని 10 జిల్లాలను కేంద్ర బిందువుగా చేసుకుని ఉద్యాన సాగు విస్తీర్ణాన్ని వచ్చే మూడేళ్లలో 8.41 లక్షల హెక్టార్ల నుంచి 14.41 లక్షల హెక్టార్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దుబాయ్కు చెందిన దిగ్గజ సంస్థ 'డీపీ వరల్డ్' ఏపీలో ఉద్యాన క్లస్టర్ ఏర్పాటుకు ఆసక్తి చూపడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేయాలని, ఇందులో భాగంగా గ్రామీణ రహదారుల నెట్వర్క్, లాజిస్టిక్స్, మార్కెట్ కనెక్టివిటీ మరియు కోల్డ్ చైన్ నిల్వ కేంద్రాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రులు, అధికారులకు సూచించారు.
20కి పైగా కీలక ప్రాజెక్టులు ప్రాధాన్యత క్రమంలో పూర్తి
నీటిపారుదల రంగాన్ని బలోపేతం చేసే దిశగా 10 జిల్లాల్లో పెండింగ్లో ఉన్న 20కి పైగా కీలక ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టును ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని, గత ప్రభుత్వ వైఫల్యం వల్ల కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టును పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టుల ద్వారా కృష్ణా జలాలను రాయలసీమ చిట్టచివరి భూములకు అందించాలని, ఈ ప్రాజెక్టుల వల్ల కొత్తగా 8.87 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు.
గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించి పోలవరం-వంశధార నదుల అనుసంధానం
ఉత్తరాంధ్ర అభివృద్ధిని కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్తామని, పోలవరం కుడి కాలువ పనులు పూర్తయిన వెంటనే గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించి పోలవరం-వంశధార నదుల అనుసంధానం చేపడతామని సీఎం వెల్లడించారు. పూర్వోదయ మరియు రాష్ట్ర ప్రభుత్వ నిధులను సమన్వయం చేసుకుంటూ, ప్రైవేట్ పెట్టుబడులను కూడా ప్రోత్సహించి రాష్ట్రాన్ని వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అగ్రపథాన నిలపాలని ఆయన పిలుపునిచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















