Nara Lokesh: కాలానికి అనుగుణంగా టీడీపీలో మార్పులు రావాలి - పార్టీ వర్క్ షాప్లో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
Nara Lokesh: మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాల్సి ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్లో ప్రసంగించారు.

Changes should be made in TDP: మారుతున్న కాలానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీలో సంస్థాగత మార్పులు అవసరమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు, నూతన కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేస్తూ లోకేష్ కీలక ప్రసంగం చేశారు.
కార్యకర్తలే పార్టీ బలం, బలగం
దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నా, కార్యకర్తలే ప్రాణంగా కలిగిన ఏకైక పార్టీ టీడీపీ అని లోకేష్ కొనియాడారు. గత ఐదేళ్లలో వైసీపీ అరాచకాలను ఎదిరించి నిలబడిన అంజిరెడ్డి తాత, మాచర్ల మంజుల, చెన్నుపాటి గాంధీ, తోట చంద్రయ్య వంటి వారి త్యాగాలే తనకు స్ఫూర్తి అని ఆయన గుర్తు చేసుకున్నారు. పనిచేసే వారికి పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని, అందుకే ప్రస్తుత పార్లమెంట్ కమిటీల్లో 83 శాతం మంది కొత్త వారికి అవకాశం కల్పించామని వివరించారు.
అభివృద్ధి, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు
సంక్షేమాన్ని ప్రజలకు పరిచయం చేసింది ఎన్టీఆర్ అయితే, దానికి అభివృద్ధిని జోడించి ముందుకు తీసుకెళ్తున్నది చంద్రబాబు అని లోకేష్ పేర్కొన్నారు. ఆర్సెలార్ మిట్టల్, గూగుల్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీకి వస్తున్నాయంటే అది చంద్రబాబు విజన్ వల్లేనని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క పెన్షన్ల కోసమే ఏడాదికి రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, లబ్ధిదారులకు రూ.4 వేల నుండి రూ.15 వేల వరకు అందుతోందని తెలిపారు. కేవలం 150 రోజుల్లోనే 16 వేల మందికి డీఎస్సీ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు.
పార్టీలో విప్లవాత్మక మార్పులు
సామాన్య కార్యకర్త కూడా పొలిట్ బ్యూరో వరకు ఎదిగేలా పార్టీలో సంస్కరణలు తెస్తున్నట్లు లోకేష్ ప్రకటించారు. ఒక వ్యక్తి ఒకే పదవిలో రెండు సార్ల కంటే ఎక్కువ ఉండకూడదనే ప్రతిపాదనను తెచ్చారు. పార్టీ కమిటీల్లో యువతకు, చదువుకున్న వారికి పెద్దపీట వేయాలని నిర్ణయించారు. కార్యకర్తలే అధినేత, యువగళం, సామాజిక న్యాయం, స్త్రీ శక్తి, అన్నదాతకు అండ, తెలుగుజాతి విశ్వఖ్యాతి అనే ఆరు సూత్రాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.v
పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. pic.twitter.com/d555CCe4iJ
— Telugu Desam Party (@JaiTDP) January 27, 2026
కూటమి ప్రభుత్వం - బుల్లెట్ ట్రైన్
రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ లా దూసుకుపోతోందని ఆయన అభివర్ణించారు. పవన్ కల్యాణ్ చెప్పినట్లుగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ కూటమి మరో 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందని, చిన్న చిన్న విభేదాలు ఉంటే సర్దుకుపోవాలని నేతలకు సూచించారు. పార్టీ అనేది సొంతిల్లు లాంటిది, ప్రభుత్వం కిరాయి ఇల్లు వంటిది అని పేర్కొంటూ పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ సమయం కేటాయించాలని పిలుపునిచ్చారు.
మై టీడీపీ యాప్ ద్వారా ప్రతి కార్యకర్త పనితీరును గుర్తిస్తామని, సాంకేతికతను అందిపుచ్చుకుని పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా యువగళం పాదయాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి వేడుక జరుపుకున్నారు.



















