Pawan meets Chandrababu : గ్రామ వికాసమే లక్ష్యం - చంద్రబాబు-పవన్ భేటీలో కీలక నిర్ణయాలు
Deputy CM Pawan: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ రెండు గంటల పాటు చర్చించారు. గ్రామీణాభివృద్ధి పథకాలపై చర్చించారు.

Chandrababu meeting with Pawan on administrative matter : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన తాజా భేటీ రాష్ట్ర రాజకీయాల్లోనూ, అధికార వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తించింది. అయితే వీరి భేటీ పూర్తిగా పాలనా పరమైన అంశాల ఆధారంగానే సాగిందని తెలుసతోంది. గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సాగిన ఈ భేటీపై పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
గ్రామాల అభివృద్ధికి నిధుల కొరత లేకుండా జాగ్రత్తలు
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. మంగళవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుమారు రెండు గంటల పాటు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా , అటవీ శాఖలకు సంబంధించిన కీలక ప్రాజెక్టులపై సమగ్ర చర్చ జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాలుగా ఉన్నప్పటికీ, గ్రామాల అభివృద్ధికి నిధుల కొరత లేకుండా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు.
జల్ జీవన్ మిషన్ పనులపై ప్రత్యేక దృష్టి
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ సురక్షితమైన మంచినీరు అందించే జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్ పురోగతిని ఈ సందర్భంగా సమీక్షించారు. గత ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని అభిప్రాయపడిన నేతలు, ఇప్పుడు దీనిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తలసరి రోజుకు 55 లీటర్ల నీటిని అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని గ్రామీణ రహదారుల నిర్మాణం, నియోజకవర్గాల వారీగా నిధుల కేటాయింపుపై పవన్ కళ్యాణ్ సీఎంతో చర్చించారు.
మ్యాజిక్ డ్రెయిన్లు - హనుమాన్ ప్రాజెక్ట్
పారిశుధ్య నిర్వహణలో భాగంగా వివిధ పంచాయతీల్లో చేపట్టిన మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణాన్ని రాష్ట్రవ్యాప్తం చేయాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా సీఎం సానుకూలంగా స్పందించారు. వేసవి కాలం ముగిసేలోపే డ్రెయినేజీల్లో పూడికతీత పనులు పూర్తి చేయాలని, తద్వారా సాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలని నిర్ణయించారు. ఇదే సమయంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన హనుమాన్ ప్రాజెక్ట్ వివరాలను పవన్ కళ్యాణ్ వివరించారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల అనుసంధానం కోసం చేపట్టిన అడవి తల్లి బాట పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని ఇరువురు నేతలు ఒక అవగాహనకు వచ్చారు.
అభివృద్ధికి బాటలు.. వికసిత్ భారత్ దిశగా
గ్రామాల బలోపేతం కోసం ముఖ్యమంత్రి అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. రాజకీయ విమర్శలు పక్కన పెట్టి, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలుపుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ భేటీలో కేవలం అభివృద్ధి అంశాలే కాకుండా, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి రాజకీయ అంశాలపై కూడా ఇరువురు నేతలు ప్రాథమికంగా చర్చించినట్లు సమాచారం.























