Karumuri Nageswara Rao: కారుమూరి నాగేశ్వరరావుపై మరో కేసు నమోదు, సిట్ అధికారికే లంచం ఇచ్చే ప్రయత్నం!
YSRCP leader Karumuri Nageswara Rao | మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుకు ఉచ్చు బిగుసుకుంటోంది. కేసు నుంచి ఊరట పొందేందుకు సిట్ అధికారికి లంచం ఇవ్వజూపారని కేసు నమోదైంది.

విజయవాడ: ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నేత కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ రవాణా కాంట్రాక్టులో జరిగిన అక్రమాలపై సిట్ విచారణను ఎదుర్కొంటున్న వీరిద్దరిపై తాజాగా విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. గతంలో నమోదైన కేసు నుండి తమను తప్పించాలని కోరుతూ, సిట్ విచారణ అధికారికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలతో ఈ కేసు నమోదు చేశారు.
సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శ్రీహరిని కలిసి విచారణ నుండి తమకు ఉపశమనం పొందేందుకు, మునికుమార్ అనే మధ్యవర్తి ద్వారా కారుమూరి, ఆయన కుమారుడు సునీల్ రూ. 25 లక్షలు లంచంగా ఇచ్చేందుకు ప్రయత్నించారు. దీనిపై సిట్ ఆఫీసర్ శ్రీహరి స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్తో పాటు మధ్యవర్తిత్వం చేసేందుకు చూసిన మునికుమార్పై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.























