AP Highcourt Group One: 2018 గ్రూప్ 1 అధికారులంతా అప్రాధాన్య పోస్టుల్లోకి - హైకోర్టు ఆగ్రహంతో వెంటనే చర్యలు ప్రారంభించిన ఏపీ చీఫ్ సెక్రటరీ
AP Highcourt : 2018 బ్యాచ్ గ్రూప్ 1 అధికారులందరినీ తక్షణమే రిలీవ్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

AP Highcourt Group One Officers : ఏపీలో 2018 గ్రూప్-1 నియామకాల వ్యవహారం మరోసారి తీవ్ర సంచలనంగా మారింది. హైకోర్టు ఆదేశాల మేరకు కీలక పోస్టుల్లో ఉన్న 2018 బ్యాచ్ అధికారులందరినీ తక్షణమే రిలీవ్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ హెచ్ఓడీలను ఆదేశించారు. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో జాప్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అసలు వివాదం ఏమిటి?
2018లో నోటిఫికేషన్ విడుదలైన ఈ గ్రూప్-1 పరీక్షల ప్రక్రియ ఆది నుంచీ వివాదాల్లోనే ఉంది. ముఖ్యంగా మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. తొలుత డిజిటల్ మూల్యాంకనం చేశారని, ఆ తర్వాత మాన్యువల్ మూల్యాంకనం నిర్వహించారని, ఈ ప్రక్రియలో పారదర్శకత లేదని అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఒకే పేపర్ను మూడుసార్లు దిద్దడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, పాత ఎంపిక జాబితాను రద్దు చేసి, మళ్లీ కొత్తగా మూల్యాంకనం చేసి ఆరు నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని గతంలోనే తీర్పునిచ్చింది.
ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి?
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 167 మంది అభ్యర్థులు గ్రూప్-1 అధికారులుగా ఎంపికయ్యారు. వీరు గత రెండేళ్లుగా రాష్ట్రంలోని వివిధ కీలక శాఖల్లో విధుల్లో ఉన్నారు. వీరిలో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీలు, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు , ఆర్టీఓలు, మున్సిపల్ కమిషనర్లు వంటి అత్యంత కీలకమైన పోస్టుల్లో ఉన్నవారు ఉన్నారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాల ప్రకారం వీరందరినీ ప్రాధాన్యత లేని (Non-Focal) పోస్టులకు బదిలీ చేయడమో, ప్రస్తుతం ఉన్న బాధ్యతల నుంచి విముక్తి చేయడమో తప్పనిసరి అయ్యింది.
కోర్టు ఆగ్రహం - ప్రభుత్వ చర్యలు
మళ్లీ మూల్యాంకనం నిర్వహించి కొత్త జాబితా ఇచ్చే వరకు పాత పద్ధతిలో ఎంపికైన వారిని కీలక సీట్లలో ఎలా కొనసాగిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. గత విచారణలో ఆదేశాలు ఇచ్చినా అమలు చేయలేదు. దాంతో సీఎంను హైకోర్టు కోర్టుకు పిలిపించింది. సిఎస్ హాజరైనప్పుడు కోర్టు నిలదీసింది. ఎప్పటిలోపు బదిలీ చేస్తారో చెప్పాలని ఆదేశించింది. రెండు వారాల సమయం కోరారు సీఎస్.. అయితే హైకోర్టు అంగీకరించలేదు. రెండు రోజుల సమయం కూడా ఇవ్వలేమని తేల్చి చెప్పింది హైకోర్టు. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఫోకల్ పోస్టుల్లో ఉన్న 2018 బ్యాచ్ అధికారులను వెంటనే రిలీవ్ చేసి రిపోర్ట్ చేయాలని అన్ని శాఖల అధిపతులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. ఇది అటు అధికారుల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ పెద్ద చర్చకు దారితీసింది.























