Vaddera Quarry Reservation: ఆంధ్రప్రదేశ్లో వడ్డెర వర్గానికి గుడ్ న్యూస్ - క్వారీ లీజుల్లో 33 శాతం కేటాయిస్తూ ఏపీ సర్కార్ జీవో 126 జారీ!
Minerals Policy : వడ్డెర సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం భారీ వరం ప్రకటించింది. లోకేష్ యువగళం పాదయాత్ర హామీ మేరకు క్వారీ లీజుల్లో 33% కేటాయిస్తూ సీనియరేజ్ ఫీజులో 50% రాయితీతో జీవో 126 జారీ చేసింది.

AP Govt GO Ms No 126 Vaddera quarry lease reservation: ఆంధ్రప్రదేశ్లో వడ్డెర సామాజికవర్గానికి ప్రభుత్వం భారీ ఆఫర్ ప్రకటించింది. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో వడ్డెర కష్టాలను ప్రత్యక్షంగా చూసి, వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. తమ కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వడ్డెర ల ఆర్థికాభివృద్ధికి తోడ్పడేలా, రాష్ట్రంలోని మైనర్ మినరల్ క్వారీ లీజుల్లో వడ్డెర సహకార సంఘాలకు 33 శాతం ప్రాధాన్యత కేటాయింపులను ఖరారు చేస్తూ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా జీవో జారీ చేశారు.
పాదయాత్ర హామీ నెరవేర్చిన లోకేశ్
గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన వేలం విధానం వల్ల వడ్డెర సహకార సంఘాలు క్వారీ లీజులను పొందలేక, తమ సాంప్రదాయ వృత్తికి దూరమై తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. యువగళం పాదయాత్ర సాగుతున్న సమయంలో వడ్డెర పెద్దలు నారా లోకేశ్ను కలిసి, తమ జీవనోపాధిని కాపాడటానికి క్వారీలను కేటాయించాలని విన్నవించారు. ఆనాడు క్షేత్రస్థాయిలో వారి బాధలను చూసి ఇచ్చిన హామీని గుర్తుపెట్టుకుని, నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సామాజిక న్యాయం, సాంప్రదాయ వృత్తి హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఈ సరికొత్త గనుల విధాన సవరణలను తీసుకొచ్చింది.
జీవో 126 లోని కీలక ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్, 1966కు సవరణలు చేస్తూ విడుదల చేసిన ఈ జీవో ద్వారా వడ్డెర సంఘాలకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది.
33% రిజర్వేషన్: బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్, గ్రావెల్/మొరమ్, స్లేట్, రఫ్ స్టోన్ వంటి మైనర్ మినరల్స్ క్వారీ కేటాయింపుల్లో రిజిస్టర్డ్ వడ్డెర సహకార సంఘాలకు గరిష్టంగా 33 శాతం ప్రాధాన్యత లీజులను కేటాయిస్తారు.
50% రాయితీ: ఈ నిబంధనల ప్రకారం లీజులు పొందే వడ్డెర సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన సీనియరేజ్ ఫీజు లో 50 శాతం భారీ రాయితీని కల్పించారు.
ప్రీమియం తగ్గింపు: లీజుకు సంబంధించిన ప్రీమియం మొత్తంలోనూ వడ్డెర సంఘాలకు 50 శాతం మినహాయింపు లభిస్తుంది.
పరిమితి: ప్రతి సొసైటీకి గరిష్టంగా 12 హెక్టార్ల వరకు ఈ ప్రాధాన్యత విధానం కింద లీజు పొందే అవకాశం ఉంటుంది.
ప్రత్యేక వడ్డెర క్వారీ పూల్ ఏర్పాటు
ఈ నూతన విధానాన్ని పటిష్టంగా అమలు చేయడానికి వీలుగా ప్రభుత్వం మొదటి విడతగా 100 హెక్టార్ల ఖనిజ లభ్యత గల ప్రభుత్వ భూమిని సేకరించి వడ్డెర క్వారీ పూల్ గా నోటిఫై చేయనుంది. ఈ పూల్ విజయవంతంగా పూర్తయిన తర్వాత 33 శాతం ప్రాధాన్యత కేటాయింపుల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది. అంతేకాకుండా, దరఖాస్తుల పరిశీలన కోసం క్యాలెండర్ ఏడాదిని 45 రోజుల చొప్పున 8 ఇవాల్యుయేషన్ స్లాట్లు గా విభజించి, ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా బ్యాచ్-వైజ్ పద్ధతిలో లీజులను ఖరారు చేయనున్నారు.
బినామీలకు అడ్డుకట్ట.. కులవృత్తిదారులకే హక్కులు
ఈ జీవోలో ప్రభుత్వం మరో కీలకమైన రక్షణ నిబంధనను పొందుపరిచింది. ప్రాధాన్యత ప్రాతిపదికన వడ్డెర సహకార సంఘాలకు కేటాయించిన క్వారీ లీజులను వేరే ఏ ఇతర వ్యక్తులకు లేదా సంస్థలకు బదిలీ చేయడం , సబ్-లెట్ ఇవ్వడం లేదా అసైన్ చేయడం పూర్తిగా నిషిద్ధం. కేవలం మరో రిజిస్టర్డ్ వడ్డెర సంఘానికి మాత్రమే దీనిని బదిలీ చేసే వీలుంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే లీజులను తక్షణమే రద్దు చేసే అధికారాన్ని గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్కు కల్పించారు. తద్వారా కార్పొరేట్ శక్తులు, బినామీలు వడ్డెరల హక్కులను లాక్కోకుండా ప్రభుత్వం గట్టి ప్లాన్ చేసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















