Central Funds To AP: ఏపీ సర్కార్ రూ.3824 కోట్లు దారి మళ్లింపు, రాష్ట్రాన్ని అలర్ట్ చేసిన కేంద్రం !
Central Funds To Andhra Pradesh: సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్న ఏపీ ప్రభుత్వం కేంద్రం అందించిన నిధులను దారిమళ్లించిందని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి సోమనాథన్ వెల్లడించారు.

ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసింది. తన తండ్రి, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్సార్ బాటలో నడుస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పథకాలు ఏపీలో సరిగానే అమలవుతున్నాయి, కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర సర్కారు మంగళం పాడుతోందా అంటే అవుననే వినిపిస్తోంది. రాష్ట్రానికి కేంద్రం అందించిన నిధులు దారిమళ్లాయని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి సోమనాథన్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సాయం, కేంద్రం అందించే రుణాతో చేపట్టే ప్రాజెక్టులు ఏపీలో అమలు కావడం లేదట.
రూ.3,824 కోట్లు దారి మళ్లాయా ?
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో కేంద్ర పథకాలను అనుసంధానం చేయగలిగే వాటిపైనే సీఎం జగన్ ఆసక్తి చూపుతున్నారని కేంద్రం తాజా లేఖతో స్పష్టమైంది. 2021 - 22 ఆర్థిక సంవత్సరంతో పాటు.. ప్రస్తుతం 2022 - 23 ఆర్థిక సంవత్సరం తొలి అయిదు నెలలకుగానూ కేంద్ర ప్రభుత్వం రూ. 3,824 కోట్లు రాష్ట్రానికి నిధులు అందించింది. అయితే వేటి అమలు కోసం కేంద్రం ఇచ్చిందో, ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత సంస్థలకు ఇవ్వలేదని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి సోమనాథన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో కేంద్ర పథకాలేవీ ఏపీలో అమలు కావడం లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు లేఖ ద్వారా తెలిపారు. కొన్ని పథకాలకు కేంద్రం నిధులు మాత్రమే అందుతున్నాయని, రాష్ట్రం వాటా నిధులు ఇవ్వడం లేదని ఏపీ సర్కార్ కు అలర్ట్ చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఏం వివరణ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
నిధుల వినియోగంపై సీఎం నిర్ణయం తప్పనిసరి
ఏపీ ప్రభుత్వ పథకాలతో అనుసంధానం కాకుండా ఉన్న కేంద్ర పథకాలను అమలు చేయాలంటే, సీఎం స్థాయిలో అనుమతి తీసుకోవాలని నిర్ణయించారు. కేంద్రం నిధులపై 2022-23 బడ్జెట్ సమయంలో రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్ అన్ని శాఖల అధికారులకు తెలిపారు. దాంతో కేంద్రం అందించే నిధులు ఏపీలో వినియోగం తగ్గింది. రాష్ట్రం ఇవ్వాల్సిన వాటాలు విడుదల కావడం లేదని ఆరోపణలున్నాయి. ముఖ్యంగా రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, జైకా సాయంతో చేపట్టే సాగునీటి ప్రాజెక్టులు, ప్రపంచ బ్యాంకు సాయంతో అమలుచేసే కార్యక్రమాలకు ఏపీ సర్కారు వాటా నిధులు విడుదల చేయకపోవడంతో ఆ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు వాడుకుంటోందని, కేంద్రం అన్ని గమనిస్తోందని సీఎస్ సమీర్ శర్మకు రాసిన లేఖలో కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి పేర్కొన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రం వాటా నిధులు ఇవ్వడం లేదా !
ప్రతి రాష్ట్రంలో లాగే ఏపీలోనూ, పలు పథకాలలో కేంద్రం, రాష్ట్రం నిధులకు వాటా ఉంటుంది. కొన్ని పథకాలకు కేంద్రం 90 శాతం వరకు నిధులిస్తే, మరికొన్నింటికి 75శాతం, ఇంకొన్నింటికి 60శాతం, 50 శాతం లేదా శాతం నిధులు సమకూర్చుతుంది. మిగతా వాటాను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో చేర్చడంతో పాటు విడుదల చేస్తేనే ఆయా పథకాలు అమలవుతాయని తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది దాదాపు 20 వేల కోట్ల వరకు ఏపీకి అందిస్తుందని ఓ అంచనా. పథకాల అమలుకు ఏపీ ప్రభుత్వం సైతం దాదాపు 12వేల కోట్ల వరకు నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ కేంద్రం నిధులు వచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం వాటిని దారి మళ్లిస్తుందని, అసలైన పథకాలకు వినియోగించడం లేదని రాష్ట్రానికి కేంద్రం రాసిన లేఖతో వెల్లడైంది.
Before You Go
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















