AP Free Bus: దివ్యాంగులకు APSRTC గుడ్న్యూస్.. ఏ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు
Indradhanusu Scheme | దివ్యాంగుల కోసం ఉచిత బస్సు నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) అర్హతలు, ఎందులో ఉచితంగా ప్రయాణించవచ్చో ప్రకటించింది.

Free Bus Travel for Differently Abled | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దివ్యాంగుల కోసం ఉచిత బస్సు నిర్ణయంపై కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇంద్రధనుస్సు' పథకంలో భాగంగా, ఇకపై దివ్యాంగులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (MD) వెల్లడించారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది మంది దివ్యాంగులకు ఆర్థికంగా ఎంతో ఊరటనివ్వనుంది.
అర్హతలు, వర్తించే బస్సులు
ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం పొందడానికి కొన్ని నిబంధనలను సంస్థ ఖరారు చేసింది. 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పించనున్నారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులు ఎటువంటి టికెట్ ఛార్జీ చెల్లించకుండా ప్రయాణించవచ్చు. కేవలం దివ్యాంగులకే కాకుండా, వారికి తోడుగా వచ్చే సహాయకులకు (Escorts) కూడా టికెట్ ధరలో 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఎండీ స్పష్టం చేశారు.
ఈ నెల 18న ప్రారంభం
ఈ ఉచిత ప్రయాణ పథకాన్ని ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో దివ్యాంగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కండక్టర్లు, డ్రైవర్లకు అవసరమైన అవగాహన కల్పిస్తామని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.
నెలకు రూ. 6,000 పింఛన్.. నెలరోజుల్లోపు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ
దివ్యాంగుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం సరికొత్త నిర్ణయాలతో ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఇటీవల ఈ విషయాలు వెల్లడించారు.
బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ: దివ్యాంగుల కోసం కేటాయించిన బ్యాక్లాగ్ ఉద్యోగ ఖాళీలను వచ్చే మార్చి నెల లోపు (నెలరోజుల్లోపు) పూర్తిస్థాయిలో భర్తీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దివ్యాంగుల సాధికారతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, వారి ప్రయోజనాల కోసం నిరంతరం కృషి చేస్తామని మంత్రి బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు.
దేశంలోనే అత్యధిక పింఛన్: దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా, ఆంధ్రప్రదేశ్లోనే దివ్యాంగులకు నెలకు రూ. 6,000 పింఛన్ అందిస్తూ వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆయన గుర్తు చేశారు. కేవలం పింఛన్లు మాత్రమే కాకుండా.. విద్య, ఉపాధి మరియు రవాణా రంగాల్లో దివ్యాంగులకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తామని స్పష్టం చేశారు.






















