Silver Filigree Art In G20 Summit: జీ20 సదస్సులో సిల్వర్ ఫిలిగ్రీ స్టాల్ ఏర్పాటు
దిల్లీ వేదికగా 9,10 తేదీల్లో జరుగుతున్న జీ20 సదస్సులో తమ కళను ప్రదర్శించుకునే అరుదైన అవకాశం కరీంనగర్ కళాకారులకు దక్కింది. ఈ సదస్సుకు హాజరవుతున్న ప్రపంచ దేశాల అధినేతలు, అతిథులు సిల్వర్ ఫిలిగ్రీ అశోక చక్ర బ్యాడ్జ్ ధరించబోతున్నారు. దాన్ని కరీంనగర్ కు చెందిన ఫిలిగ్రీ కళాకారుడు ఎర్రోజు అశోక్ రూపొందించారు. అంతే కాక సదస్సు జరిగే దిల్లీలో సిల్వర్ ఫిలిగ్రీ స్టాల్ ఏర్పాటుకు కూడా కేంద్రం అనుమతినిచ్చింది. గతంలో హైదరాబాద్ కు ఇవాంకా ట్రంప్ వచ్చినప్పుడు కూడా సిల్వర్ ఫిలిగ్రీ స్టాల్ ఏర్పాటు చేసుకునే అవకాశం దక్కింది. ఇప్పుడు జీ20 సదస్సులో ఏర్పాటు చేయబోయే స్టాల్ లో అద్భుతమైన కళారూపాలను ప్రపంచానికి చూపించే అవకాశం కరీంనగర్ కళాకారులకు దక్కింది.





















