Iran Israel War 2026: ఓమన్ తీరంలో ముగ్గురు భారతీయ నావికుల మృతి; 20 మందికిపైగా గాయాలు !
Iran Israel War 2026:ఒమన్ సమీపంలోని వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు జరపడంతో ముగ్గురు భారతీయ నావికులు మరణించగా, దాదాపు 20 మంది గాయపడ్డారు. దీనితో హార్ముజ్ జలసంధి రాకపోకలకు అంతరాయం కలిగింది.

Iran Israel War 2026:మధ్య ప్రాచ్యంలో యుద్ధం పెను ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య రాజుకున్న నిప్పు ఇప్పుడు యావత్ గల్ఫ్ ప్రాంతాన్ని దహించివేస్తోంది. ఈ అంతర్జాతీయ పోరులో అమాయక భారతీయలు బలయ్యారు. ఇది దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఓమన్ తీరంలో జరిగిన ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోగా, సుమారు 20 మందికిపైగా గాయపడ్డారు. మరోవైపు యుద్ధం మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో అమెరికా తన పౌరులకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. సౌదీ అరేబియా, యూఏఈ సహా 12 గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్లు తక్షణమే ఆ దశాలను విడిచి వెళ్లాలని వైట్ హౌస్ హెచ్చరించింది.
ఓమన్ తీరంలో మరణ మృదంగం
మధ్య ప్రాచ్య సముద్ర జలాల్లో వాణిజ్య నౌకలే లక్ష్యంగా జరుగుతున్న దాడులు ఇప్పుడు భారత్ను నేరుగా తాకాయి. మస్కట్ తీరానికి సుమారు 52 నాటికల్మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న MKD Vyom అనే నౌకపై ఇరాన్ డ్రోన్ బోట్ దాడి చేసింది. ఈ దాడిలో ఇంజిన్ రూమ్లో భారీ పేలుడు జరిగింది. మంటలు అలుముకున్నాయి. ఈ ఘటనలో ఒక భారతీయ నావికుడు మరణించినట్టు ఓమన్ అధికారులు ప్రకటించారు. భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ, మృతదేహాన్ని స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు ముసండమ్ ద్వీపకల్పం సమీపంలో Skyligh అనే ఆయిల్ ట్యాంకర్పై జరిగిన దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు. ఈ నౌకలో ఉన్న 21మంది సిబ్బందిలో 16 మంది భారతీయులే. మొత్తం మీద పశ్చిమాసియా జలాల్లో జరిగిన వివిధ దాడుల్లో 20 మంది వరకు భారతీయలు గాయపడగా అందులో 13 మంది యూఏఈలోనే ఉన్నట్టు నివేదికలు తెలుపుతున్నాయి.
అమెరికా అత్యవసర ఆదేశాలు
మధ్య ప్రాచ్యంలో యుద్ధం ఏ క్షణమైనా పెను విలయానికి దారి తీస్తుందని అమెరికా గట్టిగా నమ్ముతోంది. అందుకే తమ పౌరుల రక్షణ కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా 12 గల్ఫ్ దేశాలను తక్షణమే విడిచిపెట్టాలని ఆదేశించింది. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్ వంటి కీలక దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. సౌదీఅరేబియా రాజధాని రియాద్లోని అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో డ్రోన్ దాడి జరగడం, అక్కడ భారీగా మంటలు చెలరేగడం అమెరికాను మరింత అప్రమత్తం చేసింది. భారత్ కూడా తమ పౌరుల భద్రతపై ఆందోళన చెందుతోంది. ఖతార్లోని భారత రాయబార కార్యాలయం ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసింది. ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు దుబాయ్ జెడ్డా వంటి నగరాల నుంచి భారతీయలను తీసుకురావడానికి ప్రత్యేక విమానాలను నడుపుతున్నాయి.
ఖమేనీ మరణం, ఇరాన్ అంతర్గత కల్లోలం
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, ఇజ్రాయెల్ - అమెరికా ఉమ్మడి దాడుల్లో మరణించారనే వార్త ఇరాన్ను కుదిపేస్తోంది. తాజాగా ఆయన భార్య బఘెర్జదే కూడా ఇజ్రాయెల్ దాడుల్లో తగిలిన గాయాల వల్ల మరణించినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ ప్రభుత్వం 40 రోజుల పాటు జాతీయ సంతాప దినాలను ప్రకటించగా, టెహ్రాన్ వీధుల్లో ప్రజల కన్నీరుమున్నీరవుతున్నారు.
అయితే అమరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్లో పాలన మార్పు జరగాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇరాన్ ఒక అణుశక్తిగా మార్చడానికి తాము సహించబోమని, ఇప్పటికే వారి అణు కేంద్రాలై దాడులు చేశామని ఆయన ప్రకటించారు. ఇరాన్లో జరిగిన నిరసనల్లో 165మంది పాఠశాల విద్యార్థినులు మరణించడంపై అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
భారత్ మార్కెట్లపై డొమినో ఎఫెక్ట్
ఈ యుద్ధం కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. భారత్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. హార్ముజ్ జలసంది ద్వారా రవాణా నిలిచిపోవడంతో ఎల్ఎన్జీ ధరు విపరీతంగా పెరిగాయి. ఆయిల్ ట్యాంకర్ల అద్దెలు రెట్టింపు అయ్యాయి. భారత్ వద్ద ఉన్న 100 మిలియన్ బారెళ్లు చమురు నిల్వలు ప్రస్తుతానికి స్వల్పకాలిక రక్షణను ఇస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. యుద్ధ భయం వల్ల సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం ఆకాశాన్ని తాకుతున్నాయి. వెండి ధరల్లో కూడా తీవ్ర ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. మధ్య ప్రాచ్య ఉద్రిక్తతల వల్ల డాలర్తో పోలిస్తే రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుోతంది. ఇది దిగుమతుల ఖర్చును పెంచే అవకాశం ఉంది.























