Ayatollah Khomeini trap Story: సీసీ కెమెరాలతోనే ఖొమైనీని టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ - ఈ రియల్ స్టోరీతో వెబ్ సిరీస్ తీయెచ్చు !
Khomeini trap Story: ఇరాన్ సుప్రీంలీడర్ ను అంత ఆషామాషీగా టార్గెట్ చేయలేదు. పదేళ్ల నుంచి నిఘా పెట్టి ఖచ్చితమైన సమాచారంతోనే మిస్సైల్ దాడులు చేశారు. ఈ మిషన్ ఊహించలేనిది.

How was Ayatollah Khomeini so easily trapped: ఇరాన్ సుప్రీం లీడర్ తొలి రోజు బాంబులకే హతమయ్యారు. ఇలా ఎలా చేయగలిగారన్నది ఇప్పటికీ చాలా మందికి అంతుబట్టని విషయం. అయితే ఒక్క రోజులే జరిగింది కాదు. దశాబ్దాల కాలం పాటు సాగిన ఒక నిశ్శబ్ద యుద్ధం, అధునాతన సాంకేతికతతో కూడిన ఒక నెత్తుటి వ్యూహం. ఇరాన్ అత్యున్నత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం వెనుక ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ పెద్ద కథనే నడిపింది.
తెర వెనుక నిశ్శబ్ద చొరబాటు
కొన్నేళ్ల క్రితమే ఇజ్రాయెల్ గూఢచారులు ఇరాన్ రాజధాని టెహ్రాన్ను తమ అరచేతిలోకి తెచ్చుకున్నారు. మాకు టెహ్రాన్ నగరం మా జెరూసలేం అంత బాగా తెలుసు అని ఒక ఇజ్రాయెల్ గూఢచారి అధికారి వ్యాఖ్యానించడం వెనుక ఉన్న అసలు రహస్యం.. టెహ్రాన్ వీధుల్లోని ట్రాఫిక్ కెమెరాలు . అవును, టెహ్రాన్ నగరంలోని దాదాపు ప్రతి ట్రాఫిక్ కెమెరాను ఇజ్రాయెల్ ఏళ్ల క్రితమే హ్యాక్ చేసింది. ఆ కెమెరాల ద్వారా వచ్చే ప్రతి దృశ్యం ఎన్క్రిప్ట్ చేసి మరీ నేరుగా టెల్ అవీవ్లోని సర్వర్లకు చేరేది. ముఖ్యంగా ఖమేనీ కార్యాలయం ఉన్న పాశ్చర్ స్ట్రీట్ వద్ద ఉన్న ఒక కెమెరా ఇజ్రాయెల్కు వరంగా మారింది. ఆ ఒక్క కెమెరా యాంగిల్ ద్వారా ఖమేనీ బాడీగార్డులు తమ వ్యక్తిగత కార్లను ఎక్కడ పార్క్ చేస్తారు, వారు ఏ సమయంలో విధులకు వస్తారు, వారి దినచర్య ఏమిటి అనేవన్నీ ఇజ్రాయెల్ విశ్లేషకులు కూర్చొని గమనించేవారు.
మనుషులను డేటాగా మార్చిన వైనం
ఇజ్రాయెల్ తన ఇంటెలిజెన్స్ విభాగం యూనిట్ 8200 సాయంతో ఒక సంక్లిష్టమైన అల్గారిథమ్ను రూపొందించింది. దీనినే గూఢచారి పరిభాషలో పాటర్న్ ఆఫ్ లైఫ్ అంటారు. ఖమేనీ భద్రతా సిబ్బంది ఇళ్ల అడ్రస్లు, వారి ఫోన్ నంబర్లు, వారు ప్రయాణించే మార్గాలు, వారు ఎవరికి రక్షణ కల్పిస్తున్నారు అనే వివరాలతో కూడిన ఒక భారీ డేటాబేస్ను ఇజ్రాయెల్ సిద్ధం చేసింది. సోషల్ నెట్వర్క్ అనాలిసిస్ అనే గణిత పద్ధతిని ఉపయోగించి, వేల కోట్ల డేటా పాయింట్లను విశ్లేషించి ఖమేనీ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో సమావేశం కాబోతున్నారో గంటల ముందే పసిగట్టే స్థాయికి మొసాద్ చేరుకుంది. అటు మొసాద్ మనుషుల ద్వారా సమాచారం సేకరిస్తుంటే, ఇటు అమెరికా సిఐఎ కూడా కీలక సమాచారాన్ని ఇజ్రాయెల్తో పంచుకుంది.
ఆ శనివారం ఉదయం.. ఫోన్లు మూగబోయాయి.. మృత్యువు దూసుకొచ్చింది
ఆపరేషన్ రోజున ఇజ్రాయెల్ మరో సంచలన వ్యూహాన్ని అమలు చేసింది. ఖమేనీ ఉన్న పాశ్చర్ స్ట్రీట్ సమీపంలోని సుమారు 12 మొబైల్ టవర్లను ఇజ్రాయెల్ హ్యాక్ చేసి జామ్ చేసింది. ఎవరైనా ఖమేనీ భద్రతా సిబ్బందికి ఫోన్ చేస్తే అది నిరంతరం బిజీ అని వచ్చేలా చేశారు. దీనివల్ల దాడి జరగబోతోందని ఎవరైనా హెచ్చరించాలనుకున్నా ఆ సమాచారం లోపలికి వెళ్లకుండా కట్టడి చేశారు. శనివారం ఉదయం ఖమేనీ తన కార్యాలయంలో సమావేశానికి వస్తున్నట్లు ట్రాఫిక్ కెమెరాలు, సిగ్నల్ ఇంటెలిజెన్స్ ద్వారా నిర్ధారించుకున్న ఇజ్రాయెల్.. సరిగ్గా అదే సమయంలో వైమానిక దాడులకు దిగింది. నిమిషాల వ్యవధిలోనే 30కి పైగా ప్రెసిషన్ గైడెడ్ క్షిపణులు ఖమేనీ కాంపౌండ్ను తుత్తునియలు చేశాయి.
చీకట్లో కాకుండా పట్టపగలు ఈ దాడి చేయడం ద్వారా శత్రువు ఊహించని విధంగా టాక్టికల్ సర్ప్రైజ్ ఇచ్చింది ఇజ్రాయెల్. ఇరాన్ తన పౌరులను నిఘా ఉంచడానికి ఏర్పాటు చేసుకున్న కెమెరాలనే.. ఇజ్రాయెల్ వారి పాలకుల అంతానికి ఆయుధాలుగా మార్చుకోవడం ఈ చరిత్రలోనే అతిపెద్ద ఇంటెలిజెన్స్ కుట్రగా మిగిలిపోతుంది.























