Zimbabwe vs West Indies T20 World Cup | వాంఖడేలో వెస్టిండీస్ విధ్వంసం | ABP Desam
ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియం వెస్టిండీస్ పవర్ హిట్టింగ్కు వేదికైంది. టీ20 ప్రపంచకప్ 2026 ( T20 World Cup 2026 ) సూపర్-8లో భాగంగా జరిగిన మ్యాచ్ లో జింబాబ్వేపై వెస్టిండీస్ ( Zimbabwe vs West Indies ) బ్యాటర్లు విరుచుకుపడ్డారు. కేవలం 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల స్కోరు సాధించి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా షిమ్రాన్ హెట్మెయర్ ( Shimron Hetmyer ) 34 బంతుల్లోనే 85 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు.
ఈ మ్యాచ్లో ఎన్నో కొత్త రికార్డులు నమోదు అయ్యాయి. గతంలో 2023లో జింబాబ్వేపై భారత్ చేసిన 234 పరుగులే అత్యధికం. కానీ నేడు విండీస్ ఆ రికార్డును బద్దలు కొట్టి, ఏకంగా 254 పరుగులు సాధించింది. ఈ ఇన్నింగ్స్లో వెస్టిండీస్ బ్యాటర్లు మొత్తం 19 సిక్సర్లు బాదారు. దాంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు బాదిన నెదర్లాండ్స్ రికార్డును వెస్టిండీస్ సమం చేసింది.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో 260 పరుగులతో శ్రీలంక మొదటి స్థానంలో ఉండగా.. ఇప్పుడు వెస్టిండీస్ 254 పరుగులతో రెండో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. 30 కంటే ఎక్కువ బంతులు ఆడి, 250 స్ట్రైక్ రేట్తో మెరిసిన ఏకైక బ్యాటర్గా హెట్మెయర్ నిలిచాడు. ఆరోన్ జోన్స్ పేరిట ఉన్న రికార్డును హెట్మెయర్ అధిగమించాడు.
వెస్టిండీస్ తరపున టీ20 ప్రపంచకప్లో అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ రికార్డు ఇప్పటివరకు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. కానీ హెట్మెయర్ కేవలం 19 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసి ఆ రికార్డును చెరిపివేశాడు. ఈ భారీ స్కోరుతో వెస్టిండీస్ సెమీస్ రేసులో ఇతర జట్లకు గట్టి హెచ్చరికలు పంపింది అనే చెప్పాలి.























