Ind vs Nz 5th T20 First Innings | ఇషాన్ సెంచరీ...సూర్య, పాండ్యా మెరుపులతో భారీ స్కోరు | ABP Desam
ఇదేం బ్యాటింగ్ రా బాబు...నాలుగో టీ20 లో ఓడిపోయారు..ఆ ఊపు తగ్గిందేమో..పోన్లే టీ20 వరల్డ్ కప్ కి ముందు ఈ షాక్ మంచిదేలే అనుకుంటే...లేదు కాటేరమ్మ కొడుకులు మళ్లీ పూనేశారు. ఈ సారి కేరళలో కివీస్ కు కథాకళి చూపించేశారు. తిరువనంతపురంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..కివీస్ బౌలర్లను చితక్కొటి ఉతికి ఆరేశారు. అభిషేక్ తన దైన స్టైల్ లో ఇన్నింగ్స్ ఆరంభించినా...సంజూ మళ్లీ ఫెయిల్ అవటం..తర్వాత అభిషేక్ కూడా వెనుదిరగటంతో భారత్ ఈ మ్యాచ్ లో తక్కువ స్కోరేమన్నా చేస్తుందేమో అనే డౌట్స్ ను పటా పంచలు చేస్తూ బీభత్సమైన ఫామ్ లో ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యతో కలిసి విశ్వరూపం చూపించేశాడు. ప్రత్యేకించి ఇద్దరూ పోటాపోటీగా సిక్సర్లు బాదుతూ న్యూజిలాండ్ బౌలర్లకు రక్త కన్నీరు చూపించారు. సూర్య 30 బాల్స్ లో 4 ఫోర్లు 6 సిక్సర్లతో 63పరుగులు చేసి ఔట్ అయితే...ఇషాన్ కిషన్ ఏకంగా 10 సిక్సర్లు 6 ఫోర్లతో 43 బాల్స్ లోనే 103 పరుగులు చేసి తన టీ20 కెరీర్ లో తొలి సెంచరీ బాదేశాడు. విజయ్ హజారే టైమ్ నుంచి చూపిస్తున్న తన ఫామ్ ను మరింత పీక్స్ కి వెళ్తూ సెంచరీ కొట్టేసిన జార్ఖండ్ పాకెట్ డైనమైట్...ఈ రోజు ఆడిన అసాధారణమైన ఆటతో టీ20 వరల్డ్ కప్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసేసుకున్నాడు. చివర్లో కుంగ్ ఫూ పాండ్యా కూడా మెరుపులు మెరిపించటంతో భారత్ 5వికెట్ల నష్టానికి ఏకంగా 271 పరుగులు చేసింది. భారత్ ఏకంగా ఇన్నింగ్స్ లో 23 సిక్సర్లు బాదింది. న్యూజిలాండ్ కు 272 పరుగుల టార్గెట్ ఇచ్చింది.























