BJP MP Purandeswari on Union Budget 2026 | వార్షిక బడ్జెట్ ఎలా ఉండనుందో చెప్పిన పురంధేశ్వరి | ABP Desam
ఈ ఏడాది పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే కేంద్ర వార్షిక బడ్జెట్ 2026-2027 ఎలా ఉండనుందో వివరించారు భారతీయ జనతా పార్టీ నేత, పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. వరుసగా తొమ్మిది సార్లు కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఘనత కచ్చితంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దే అన్న ఎంపీ పురంధేశ్వరి...గతంలో చిదంబరం పేరుతో ఆ రికార్డు ఉన్నప్పటికీ ఆయన వరుసగా తొమ్మిది సార్లు ప్రవేశపెట్ట లేదని చెప్పారు. గత బడ్జెట్ లో మధ్య తరగతి వేతన జీవులకు ఊరట కలిగించేలా పన్ను శ్లాబుల తగ్గింపు లాంటివి మోదీ ప్రభుత్వం చేసిందని ఎంపీ పురంధేశ్వరి గుర్తు చేశారు. అచ్చం అలానే ఈసారి కూడా పేద వర్గాలు, మధ్య తరగతి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర వార్షిక బడ్జెట్ లో నిర్ణయాలు అన్నీ ఉంటాయన్నారు పురంధేశ్వరి. వికసిత భారత్ లక్ష్యం దిశగా దూసుకుపోతున్న దేశానికి ప్రగతి రథచక్రాలకు మరింత ఊతం ఇచ్చేలా బడ్జెట్ రూప కల్పన ఉంటుందన్నారు పురంధేశ్వరి.























