Ryali Jaganmohini Kesava Swamy Temple | ముందు భాగం కేశవుడు, వెనుక భాగం జగన్మోహిని..అరుదైన ఆలయం ఇది | ABP Desam
ముందు భాగంలో కేశవ స్వామి, వెనుక వైపు జగన్మోహిని రూపంలో దర్శనమిచ్చే అరుదైన దైవ స్వరూపం చూడాలంటే అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని రావులపాలెం మండలం ర్యాలీ వెళ్లాల్సిందే. అత్యంత ప్రసిద్ధమైన హిందూ దేవాలయాలలో ఒకటిగా చెప్పబడే ఈ ఆలయం రావులపాలెం నుండి 6 కిలోమీటర్ల దూరంలో ర్యాలీ అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తుంటారు. ప్రధానంగా ఈ ఆలయానికి ఉద్యోగులు తరలివస్తుంటారు.. తమకు నచ్చిన ప్రాంతంలో ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా ట్రాన్స్ఫర్ చేయాలని ఇక్కడికి వచ్చి మొక్కుకుంటుంటారు.. దీంతో ఈ ఆలయానికి బదలీల కోర్కెలు తీర్చే ఆలయంగా పేరువచ్చింది..
ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం యొక్క చరిత్ర 11వ శతాబ్దంలో చోళ రాజుల కాలంతో ముడిపడి ఉందని, అప్పట్లో ఈ ప్రాంతం దట్టమైన అడవులతో నిండి ఉండేదని చెబుతారు. స్థల పురాణం ప్రకారం, చోళ రాజైన విక్రమదేవుడు ఈ ప్రాంతంలో ఒక దైవ సంకేతం ద్వారా జగన్మోహిని కేశవ స్వామి విగ్రహాన్ని కనుగొన్నాడని. ఒక చెక్క రథం ఈ ప్రాంతంలో లాగుకుని వెళ్తుండగా, అది ఒక చోట ఆగిపోయిందని, అక్కడ తవ్వకాలు జరిపినప్పుడు సాలిగ్రామ శిలతో చేసిన విష్ణుమూర్తి విగ్రహం లభించిందని ప్రతీతి. ఈ విగ్రహాన్ని ఆధారంగా చేసుకొని విక్రమదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. ఇక జగన్మోహిని అవతారానికి హిందూ పురాణాలలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.. సముద్ర మథనం సమయంలో, అమృతం కోసం దేవాసురుల మధ్య జరిగిన యుద్ధంలో, విష్ణుమూర్తి మోహిని రూపం ధరించి అసురులను మోహింపజేశాడని, ఈ సందర్భంలో, మోహిని రూపంలో ఒక పుష్పం శిరస్సు నుండి రాలగా, దాని సుగంధం వాసన చూసిన శివుడు మోహమునకు లోనై విష్ణుమూర్తి యొక్క నిజ స్వరూపాన్ని గుర్తించాడని, ఈ జగన్మోహిని రూపంలో విష్ణుమూర్తి ఈ ఆలయంలో ఆరాధింపబడుతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.





















