CM Revanth Reddy: కేసీఆర్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే నీటి వివాదాలే ఉండేవి కావు- సీఎం రేవంత్ రెడ్డి
BRS vs Congress | బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఈరోజు వివాదాలే ఉండేవి కావని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

కన్నాయిగూడెం: గోదావరి జలాల అంశం రాజకీయ రంగు పులుముకుందని, గత పదేళ్ల పాలనలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే నేడు ఇలాంటి వివాదాలే ఉండేవి కావని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల పర్యటనలో భాగంగా గోదావరి జలాల వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తుపాకులగూడెం వద్ద దేవాదుల ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కలతో కలిసి ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, పనుల పురోగతిని తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టులు నిర్మించుకుని గోదావరి పరివాహక ప్రాంతాన్ని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకోవాల్సిన సమయంలో అబద్ధపు ప్రచారాలతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. సమైఖ్య పాలనలో తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. రాష్ట్రం ఏర్పడిన సమయంలో తెలంగాణ వద్ద నీళ్లు, నిధులు పుష్కలంగా ఉన్నాయి.
చిత్తశుద్ధితో ప్రాణహిత చేవెళ్ల, శ్రీపాద ఎల్లంపల్లి, దేవాదుల ప్రాజెక్టు, ఎస్సారెస్సీ స్టేజ్ 3 పూర్తి చేసింటే రాష్ట్రంలో 960 టీఎంసీల వినియోగం అందుబాటులోకి వచ్చేది. కృష్ణా పరివాహక ప్రాంతానికి సైతం గోదావరి జలాలను తరలించే అవకాశం ఉండేది. ఇకనైనా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు నిధుల కొరత వచ్చింది. 8 లక్షల 11 వేల కోట్ల అప్పుల బారం తెలంగాణపై ఉంది. 70 శాతం ప్రాజెక్టులు పూర్తయినా, 30 శాతం పూర్తి చేయడానికి నిధులు లేవని’ అన్నారు.

గోదావరి జలాల ప్రాజెక్టులపై సమీక్షలు నిర్వహిస్తాం..
‘దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 2001లో 6 వేల కోట్ల అంచనాతో మొదలై 13 వేల కోట్ల సవరించిన అంచనాల నుంచి 14,500 కోట్లు ఖర్చు చేసినప్పటికీ 18,500 కోట్లు ఖర్చు చేస్తే తప్పా పనులు పూర్తయ్యే అవకాశం లేదు. పనులు వేగవంతం చేసి ప్రాజెక్టు పూర్తి చేయాలి. మహారాష్ట్ర సరిహద్దు నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతాల్లోని అన్ని ప్రాజెక్టులపై సమీక్ష చేసి, వాటిని త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం. గత పదేళ్లలో మీరు ఏం ప్రాజెక్టులు పూర్తి చేశారో అప్పటిమంత్రి హరీష్ రావు చెప్పాలి. ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టులపై రెండేళ్లలో ఏం పనులు చేశారో చర్చించడానికి అసెంబ్లీకి రావాలి. మీరు చేసే సూచనలు పనికొస్తే తప్పక వాటిని పాటించి తీరుతామని’ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
రెండేళ్లుగా కాళేశ్వరం నుంచి చుక్కనీరు ఎత్తిపోయలేదు..
గత ప్రభుత్వం కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుపైనే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టి మిగిలిన ప్రాజెక్టులను గాలికి వదిలేసిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. దీనివల్ల ప్రస్తుతం ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి, భూసేకరణకు తీవ్ర నిధుల కొరత ఏర్పడిందని అన్నారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు నుంచి చుక్క నీరు కూడా పంటలకు అందలేదన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన తర్వాత అక్కడి నుండి నీటిని ఎత్తిపోయలేదని, కాళేశ్వరం నిరుపయోగంగా మారినా రాష్ట్రంలో అధిక వరి దిగుబడి రావడం రైతుల గొప్పతనమని పేర్కొన్నారు. కేసీఆర్, హరీశ్ రావు చేసిన తప్పులను గ్రహించే ప్రజలు వారికి తగిన తీర్పు ఇచ్చారని, గత పదేళ్లలో ఏం జరిగిందో, ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఏం చేస్తోందో అసెంబ్లీలో చర్చిద్దాం అన్నారు. ప్రతిపక్షం తమ అనుభవంతో ఇచ్చే మంచి సూచనలను స్వీకరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
ప్రజలదే తప్పు అనేలా బీఆర్ఎస్ వ్యవహారం..
గోదావరి, కృష్ణా జలాల విషయంలో తాము ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తున్నామనే ఆరోపణలు అసంబద్ధమని సీఎం రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే పరిమితం కావాలని, రాజకీయ రంగు పులమడం సరికాదని హితవు పలికారు. ప్రజల తీర్పు తర్వాత కూడా బీఆర్ఎస్ నేతలు మారలేదని, తిరిగి గెలవకపోవడానికి ప్రజలదే తప్పు అన్నట్లుగా వారు వ్యవహరిస్తున్నారని అన్నారు. సీఎం కుర్చీ ఎవరికీ వారసత్వంగా దక్కదని, ప్రజలు ప్రతి పార్టీకి వరుసగా రెండుసార్లు అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మరో అవకాశం ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ముతో కట్టిన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులను వృథాగా వదిలేయకుండా నిపుణుల సూచనల మేరకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తెస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
























