Telangana Food Safety And ACB : ఓ వైపు ఏసీబీ - మరో వైపు ఫుడ్ సేఫ్టీ - తెలంగాణలో జోరుగా వ్యవస్థల్ని క్లీన్ చేసే ఆపరేషన్ !
Food Safety Raids Hyderabad: తెలంగాణలో ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ విభాగాలు సంచలన పనితీరు కనబరుస్తున్నాయి. ఏసీబీ అవినీతి తిమింగలాలను వెంటాడుతూంటే ...ఫుడ్ సేఫ్టీ బడా బ్రాండ్ల నిర్వాలను బయట పెడుతున్నాయి.

Telangana ACB DA Cases 2026: తెలంగాణ ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక నిశ్శబ్ద విప్లవం సాగుతోంది. ఎప్పుడో ఓ సారి మాత్రమే సోదాలు చేసే ఏసీబీ, కేవలం నామమాత్రపు తనిఖీలు చేసే ఫుడ్ సేఫ్టీ విభాగాలు.. ఇప్పుడు అవినీతి తిమింగలాలకు, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే బడా బ్రాండ్లకు సింహస్వప్నంగా మారాయి. రోజువారీ వార్తల్లో ఈ రెండు విభాగాల దాడుల పరంపర చూస్తుంటే సామాన్య ప్రజల నుంచి థ్యాంక్యూ ఫర్ క్లీనింగ్ ద సిస్టమ్ అనే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో వ్యవస్థల ప్రక్షాళన దిశగా సాగుతున్న ఈ డబుల్ ఇంజన్ అటాక్పై సామాన్యుల్లో పాజిటివ్ స్పందన వస్తోంది.
అవినీతి తిమింగలాల గుండెల్లో ఏసీబీ దడ
ఇటీవలి కాలంలో తెలంగాణ ఏసీబీ దూకుడు చూస్తుంటే అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గతంలో కేవలం చిన్న చిన్న విఆర్ఓలు, అటెండర్ల ట్రాప్లకే పరిమితమైన ఏసీబీ.. ఇప్పుడు రూట్ మార్చింది. కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టిన బడా అధికారులు, కార్పొరేషన్ల డైరెక్టర్లు, ఉన్నత స్థాయి అధికారుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తూ షాకిస్తోంది. లంచం అడిగితే నెంబర్ 1064కి కాల్ చేయండి అనే స్లోగన్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వ్యవస్థలో పేరుకుపోయిన లంచగొండితనాన్ని వేర్లతో సహా పెకలించేందుకు ఏసీబీ తీసుకుంటున్న ఈ సుమోటో యాక్షన్లు ప్రభుత్వ ఉద్యోగుల్లో జవాబుదారీతనాన్ని పెంచుతున్నాయి. ప్రతీ వారం ఓ వంద కోట్లు పోగేసిన అదికారిని ఏసీబీ జైలుకు పంపుతోంది.
ప్లేట్లలో పురుగులు.. బడా బ్రాండ్లపై ఫుడ్ సేఫ్టీ రైడ్స్
ఇక టాస్క్ఫోర్స్ తరహాలో విరుచుకుపడుతున్న తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. ఐదు నక్షత్రాల హోటళ్లు, ప్రసిద్ధ బిర్యానీ పాయింట్లు, అంతర్జాతీయ ఫాస్ట్ ఫుడ్ బ్రాండ్ల కిచెన్లలోకి నేరుగా కెమెరాలతో దూసుకెళ్లి అసలు రంగు బయటపెడుతున్నారు. గడువు ముగిసిన మాంసం, కల్తీ రంగులు, అపరిశుభ్ర వాతావరణాన్ని లైవ్లో చూపిస్తూ ప్రజల్లో అపారమైన అవేర్నెస్ తీసుకొచ్చారు. ఎంతటి రాజకీయ రికమండేషన్లు ఉన్నా, ఎంతటి బడా బ్రాండ్లయినా సరే.. సీల్ వేయడం, నోటీసులు జారీ చేయడం, భారీ జరిమానాలు విధించడంలో అధికారులు వెనకడుగు వేయకపోవడం గమనార్హం.
ఈ మార్పు వెనుక ఉన్న వ్యూహం ఏమిటి?
ఈ రెండు విభాగాల అసాధారణ దూకుడు వెనుక స్పష్టమైన ప్రభుత్వ సంకల్పం దాగి ఉంది. ప్రభుత్వానికి ప్రత్యక్షంగా చెడ్డపేరు తెచ్చే రంగాలైన అవినీతి, ప్రజారోగ్యంపై ఉక్కుపాదం మోపడం ద్వారా.. పాలనపై ప్రజల్లో బలమైన సానుకూల ముద్ర ( వేయాలని లీడర్షిప్ భావిస్తోంది. గతంలో దాడులు జరిగినప్పుడు కేసుల సెటిల్మెంట్లు జరిగేవనే విమర్శలు ఉండేవి. కానీ, ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా లైవ్ అప్డేట్స్ కారణంగా అధికారులు సైతం పారదర్శకంగా వ్యవహరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు తెరవెనుక ఉండి పనిచేసే ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు నీరాజనాలు పలుకుతున్నారు. హోటళ్ల దరిద్రపు కిచెన్లను చూసి జనం షాక్ అవుతుంటే, తనిఖీలకు వెళ్లే అధికారులను రియల్ లైఫ్ సింగం లంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.
ఇదే జోరు కొనసాగాలి !
కేవలం దాడులు చేయడం.. మీడియాలో ప్రచారం పొందడం మాత్రమే కాకుండా, ఈ కేసులను చట్టపరంగా తార్కిక ముగింపునకు తీసుకెళ్లడం అత్యంత ముఖ్యమని సామాన్య ప్రజలు భావిస్తున్నారు. ఏసీబీ నమోదు చేసిన కేసుల్లో నిందితులకు కోర్టుల ద్వారా కఠిన శిక్షలు పడేలా పక్కా సాక్ష్యాలను కోర్టుల ముందుంచాలని.. అలాగే ఫుడ్ సేఫ్టీ దాడులు కేవలం కొన్ని రోజుల హడావిడిగా మిగిలిపోకుండా, నిరంతర ప్రక్రియగా సాగాలని, అప్పుడే వ్యాపారుల్లో శాశ్వత భయం ఉండి ప్రజలకు స్వచ్ఛమైన ఆహారం అందుతుందని అంటున్నారు. మరి దీన్ని అధికారులు కొనసాగిస్తారా?
ట్రెండింగ్ వార్తలు






















