Telangana Municipal Elections Results 2026 : హరీష్, కేటీఆర్లకు రిలీఫ్ - బీఆర్ఎస్ ముఖ్యనేతలందరికీ షాక్ - గెలిపించలేకపోయారు!
Municipal Elections 2026: బీఆర్ఎస్ ముఖ్యనేతలు తమ మున్సిపాలిటీల్లో గెలిపించలేకపోయారు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లల్లో మాత్రం బీఆర్ఎస్ గెలిచింది.

Telangana Municipal Elections 2026 Results LIVE Updates: 2026 తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ కు ఇబ్బందికరంగా మారుతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , హరీష్ రావు తమ సొంత నియోజకవర్గాల్లో పట్టు నిలుపుకోగలిగినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇతర అగ్రనేతలు , మాజీ మంత్రులు పార్టీని గెలిపించలేకపోయారు.
నల్గొండలో జగదీష్ రెడ్డికి చుక్కెదురు
మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి కంచుకోటగా భావించే సూర్యాపేట మున్సిపాలిటీ లో బీఆర్ఎస్ ఘోరంగా విఫలమైంది. గత ఎన్నికల్లో గెలిచిన గులాబీ పార్టీ, ఈసారి కనీస పోటీ ఇవ్వలేకపోయింది. కేవలం సూర్యాపేటలోనే కాకుండా, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఏ ఒక్క మున్సిపాలిటీ , కార్పొరేషన్లోనూ బీఆర్ఎస్ అధికారాన్ని దక్కించుకోలేకపోయింది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయగా, జగదీష్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో పార్టీ క్యాడర్ డీలా పడిపోయింది.
హుజూరాబాద్లో కౌశిక్ రెడ్డికి షాక్
అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తన సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్లో భంగపాటు తప్పలేదు. హుజూరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతతో విజయం సాధించింది. ఇక్కడ కౌశిక్ రెడ్డి పంతానికి పోయి చేసిన ప్రచారం పనిచేయలేదు. అటు జమ్మికుంట మున్సిపాలిటీ లో కూడా బీఆర్ఎస్ వెనుకబడిపోయింది. నియోజకవర్గంలో పట్టు కోల్పోవడం కౌశిక్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఎర్రబెల్లి ఇలాకాలోనూ అదే పరిస్థితి
వరంగల్ జిల్లాలో సీనియర్ నాయకుడైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభావం కూడా ఈ ఎన్నికల్లో కనిపించలేదు. ఆయన నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. అధికార కాంగ్రెస్ గాలిని తట్టుకోవడంలో ఎర్రబెల్లి వ్యూహాలు ఫలించలేదు.
హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ జయకేతనం
— Telangana Congress (@INCTelangana) February 13, 2026
22 వార్డులకు గాను 13 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయ దుందుభి.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం
ప్రజా విశ్వాసానికి జయహో!#CongressVictory #Incwinning #Municipalwin #Prajaprabhutvam #TelanganaRising… pic.twitter.com/IOFc1hiAD5
సిట్టింగ్ ఎమ్మెల్యేల వైఫల్యం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో మెజారిటీ నేతలు తమ సొంత నియోజకవర్గాల్లో మున్సిపాలిటీలను గెలిపించుకోలేకపోయారు. కేవలం కేటీఆర్, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో మాత్రమే పార్టీ తన ఉనికిని చాటుకుంది. మున్సిపల్ ఫలితాల అనంతరం సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల్లో తిరగడం మానేసి, కేవలం విమర్శలకే పరిమితమైన నేతలకు ప్రజలు బుద్ధి చెప్పారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పార్టీలోని అంతర్గత విభేదాలు, ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని విశ్లేషణలు వస్తున్నాయి.























