Telangana News: విద్యుత్ శాఖపై తెలంగాణ మంత్రులకే అవగాహన లేదు..! లెక్కలు బయటపెట్టిన హరీష్ రావు
Telangana Power Sector | విద్యుత్ శాఖపై తెలంగాణ మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబుకు అవగాహన లేదని.. పలు సందర్భాలలో వాళ్లు బహిర్గతం చేసిన లెక్కలకు పొంతన లేదన్నారు హరీష్ రావు.

Harish Rao about Power sector in Telangana | హైదరాబాద్: తెలంగాణ మంత్రులకు విద్యుత్ రంగంపై అవగాహనా లేదని, వాళ్లు పలు సందర్భాలలో విడుదల చేస్తున్న లెక్కలకు అసలు పొంతన ఉండటం లేదని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. లెక్కలతో సహా మంత్రుల వ్యవహారాన్ని బహిర్గతం చేస్తూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హరీష్ రావు చేసిన పోస్టులో పేర్కొన్న అంశాలివే..
విద్యుత్ పై అసెంబ్లీ సాక్షిగా మీరు (భట్టి విక్రమార్క) విడుదల చేసిన స్టేట్ పవర్ సెక్టార్ శ్వేతపత్రం, ఇటీవల విడుదల చేసిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025, ఈరోజు మీరు పీపీటీలో ప్రదర్శించిన చెప్పిన విద్యుత్ గణాంకాలు ఒక దానికి మరొకటి పొంతన లేకుండా ఉన్నాయనే కనీస అవగాహన మీకుందా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను హరీష్ రావు ప్రశ్నించారు. డిప్యూటీ సీఎంగా, విద్యుత్ మంత్రిగా రెండేళ్లు పూర్తయినప్పటికీ.. మీ శాఖలోని విషయాలపై మీకు ఏమాత్రం అవగాహన లేకున్నప్పటికీ ఇతరులను అన్ ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని కామెంట్ చేయడం మీకు తగునా? అని నిలదీశారు.

మీ అధికారులు ఒక్కో సారి, ఒక్కో లెక్కలతో.. మీ చేతుల మీదుగానే ఆవిష్కపరింప చేస్తున్నారంటే మీ శాఖపై మీకు కనీస అవగాహన కూడా లేదన్నది స్పష్టం. ప్రభుత్వానికి కమీషన్లపై ఉన్న శ్రద్ద, పాలసీలపై ఉండి ఉంటే.. ఈ పొరపాట్లు జరగవు కదా. మీరు ఒక్కో సందర్భంలో ఒక్కో రకంగా లెక్కలు చెబుతున్నారన్న విషయం కూడా మీకు తెలియదు. మీరు రెండు సంవత్సరాలుగా విడుదల చేసినవి ఏమిటో, ఇప్పుడు చెబుతున్నవి ఏమిటో అందులో కొన్ని మచ్చుకు వివరిస్తున్నాను.
1, మీ శ్వేతపత్రం పేజీ నెం.7లో 01-12-2023 నాటికి సోలార్ కెపాసిటీ 6123 మెగావాట్లు అని చెప్పారు. మొత్తం కాంట్రాక్టెడ్ కెపాసిటీ 19,475 అని చెప్పారు. 11-01-2025 నాడు మీరు విడుదల చేసిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ పేజీ నెం.8లో కరెంట్ ఇన్టాల్డ్ కెపాసిటీ 5,415 మెగావాట్లు అన్నరు. అప్ కమిగ్ 2,474 అన్నరు. మొత్తం 7,889 మెగావాట్లు అన్నరు. 2023లో 6123 మెగావాట్లు ఉంటే, 2025 నాటికి 5,415 మెగావాట్లు ఎట్ల అయ్యింది? పెరుగుతుందా? తగ్గుతుందా?. ఈరోజు మీరు ప్రదర్శించిన పీపీటీలో ఏం లెక్క చెప్పారో మీకు తెలుసా? గతంలో ప్రకటించిన పాలసీ, శ్వేతపత్రంతో పోల్చి చూసుకున్నారా?
2, మీ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ పేజీ నెం.8లో తెలంగాణ కరెంట్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ 26,212 మెగావాట్లు అన్నరు
అదే పాలసీ పేజీ నెంబర్ 10లో 2029-30 నాటికి 49,104 మెగావాట్లు అన్నరు. 2034-35కు 66,694 మెగావాట్లు అన్నరు. అంటే మీరు పెట్టుకున్న లక్ష్యంలో 2029-30 నాటికి 1729 (15,893-14,164) మెగావాట్ల థర్మల్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నరు.
మొన్న మీరిచ్చిన క్యాబినెట్ నోట్ ప్రకారం, 2,400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నరు.
మీరే ఇచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ఎందుకు తుంగలో తొక్కారు?

ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం, 1600 మెగావాట్ల ఎన్టీపీసీ పవర్ అందుబాటులో ఉండగా, ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకోకుండా ఎందుకు హడావుడిగా 2400 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్స్ నిర్మాణానికి వెళ్తున్నారు?. ఎందుకంటే ఇది 50వేల కోట్ల బడా స్కాం కాబట్టి. 2025 ఎనర్జీ పాలసీ కాపీ 10వ పేజీలో 2034-35 వరకు థర్మల్ విద్యుత్ ఉత్పత్తి 16,966 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నరు.
మరి ఈరోజు మాత్రం 5000-6000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ లోటు ఉండబోతున్నదని ఎట్లా అన్నారు?. నేటికి 14,164 మెగావాట్ల థర్మల్ విద్యుత్ అందుబాటులో ఉందని మీ పాలసీలోనే చెప్పారు, 2034-35కు 16,966 మెగావాట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే మీ లెక్క ప్రకారం లోటు 2802 మెగావాట్ల లోటు ఉండాలె. కానీ ఈరోజు మాత్రం 5000-6000 మెగావాట్ల లోటు ఉన్నది అంటున్నరు. ఇదంతా ఎట్లా సాధ్యం భట్టి గారూ..? మీ పాలసీ తప్పా? ఈరోజు ప్రదర్శించిన పీపీటీ తప్పా?
3, మీరే సంతకం పెట్టిన గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 పేజీ నెంబర్ 3 ప్రకారం, 2030 నాటికి 20వేల మెగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ తీసుకొస్తున్నాం అన్నారు. రాబోయే ఐదేళ్లలో మీరు సాధించవలసింది సుమారు 13,000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ ఉండగా, ఎందుకు థర్మల్ ప్లాంట్లంటూ ముందుకు వెళ్తున్నారు? ఆగమేఘాల మీద క్యాబినెట్ ఎందుకు నిర్ణయం తీసుకున్నది?
మొత్తం 2400 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణం కోసం చేసే 50వేల కోట్ల ఖర్చులో 30-40శాతం కమీషన్ పొందడానికే కాదా?

అధికారులు ఏదో రాసి దాన్ని గుడ్డిగా చదివినట్లున్నారు. మీరు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన శ్వేతపత్రం పేజీ నెం.11లో ఏముందో మంత్రి శ్రీధర్ బాబు ఒక్క సారి చూసుకోండి. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు కోల్ ట్రాన్స్ పోర్టుకు ఏడాదికి రూ. 803 కోట్లు కావాలని శ్వేతపత్రంలో పెట్టింది మీరే కదా? క్యాబినెట్ మంత్రిగా ఉండి నేడు 1600 కోట్లు ఖర్చు అవుతుందని ఎట్ల మాట్లాడుతారు? అని హరీష్ రావు ప్రశ్నించారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటును తప్పు పట్టిన నాటి కాంగ్రెస్ నాయకులకు, క్యాబినెట్ లో చర్చించి మక్తల్ వద్ద థర్మల్ ప్లాంటు ఏర్పాటు చేస్తామన్న ప్రకటన చేసింది మీరు కాదా?. నాడు యాదాద్రి తప్పు అయితే, నేడు మక్తల్ ఒప్పు అవుతుందా?
మక్తల్ లో పెట్టబోయేది థర్మలా, సోలారా, విండా అనేది చర్చిస్తున్నామని నేడు భట్టి గారు చెప్పడం హాస్యాస్పదం.
మక్తల్ వద్ద 800 మెగావాట్ల థర్మల్ ప్లాంటు ఏర్పాటు చేస్తామని స్వయంగా మంత్రులే చెప్పింది అబద్దమా? నేడు భట్టి విక్రమార్క చెబుతున్నది అబద్దమా? ఏది అబద్దం ఏది నిజం.
కాంగ్రెస్ మంత్రులు ఎంత వింతగా మాట్లాడుతారు అనడానికి మరో ఉదాహరణ..
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు ఒక్క మెగావాట్ కు 8.64 కోట్లు ఖర్చు అయ్యిందని, ఎన్టీపీసీ రామగుండంలో 7.63 కోట్లు ఖర్చు అయ్యిందని శ్వేతపత్రం పేజీ నెంబర్ 11లో చెప్పారు. ఎన్టీపీసీ ఫేజ్ 2, 2023 డిసెంబర్ 1 నాటికి 3×800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఇంకా మొదలు పెట్టలేదని శ్వేతపత్రంలో నాడు మీరే ప్రకటించారన్న విషయం మీకు తెలుసా? అది క్లియర్ గా ప్రకటించి బిఆర్ఎస్ మీద ఎందుకు నెపం నెడుతున్నారు?

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసాక 800 మెగావాట్లకు మీరు అగ్రిమెంట్ చేసుకొని, మిగతా 1600 మెగావాట్లు అక్కర్లేదని చెప్పింది నిజమా? అబద్దమా?. మీరు ఏర్పాటు చేసే రామగుండం పవర్ ప్లాంటు పర్ మెగావాట్ 14కోట్లు ఖర్చు అవుతుందని క్యాబినెట్ ప్రెస్ బ్రీఫింగ్ లోనే చెప్పారు. కానీ ఎన్టీపీసీ 12.3 కోట్లు. పర్ మెగావాట్ కు దాదాపు 2 కోట్లు ఎందుకు వచ్చింది అనే విషయం చెప్పకుండా ఇంకా డీపీఆర్ కాలేదని బుకాయిస్తున్నరు.
మహిళా సంఘాలకు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు అప్పగిస్తాన్న ప్రకటనలు ఎక్కడి దాకా వచ్చిందని మొన్న నేను ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దాటవేసి, ప్రతిపక్షాల మీద బురద చల్లడానికి ఉపయోగించుకున్నారు.
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటూ ప్రజలను తప్పుదోవ పట్టించడాన్ని, ప్రతిపక్ష నాయకులపై దురుసుగా మాట్లాడే పద్దతిని మార్చుకోవాలని’ హరీష్ రావు హితవు పలికారు.






















