![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Chandrababu Arrest: 'చంద్రబాబు అరెస్టు అన్యాయం, అక్రమం' కిషన్ రెడ్డి, పువ్వాడ అజయ్ రియాక్షన్
Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టు అన్యాయమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బాబు అరెస్టు బాధాకరమని తెలంగాణ మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.
![Chandrababu Arrest: 'చంద్రబాబు అరెస్టు అన్యాయం, అక్రమం' కిషన్ రెడ్డి, పువ్వాడ అజయ్ రియాక్షన్ Telangana BJP Chief Kishan Reddy And Minister Puvvada Ajay Responds On Chandrababu Arrest Chandrababu Arrest: 'చంద్రబాబు అరెస్టు అన్యాయం, అక్రమం' కిషన్ రెడ్డి, పువ్వాడ అజయ్ రియాక్షన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/14/0730abb7302d5f86c65db64a744377ec1694690082037754_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Chandrababu Arrest: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టుపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం అన్యాయమని గురువారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. మాజీ ముఖ్యమంత్రిని దర్యాప్తు చేసే ముందు ప్రశ్నించకుండా అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదని కిషన్ రెడ్డి అన్నారు. గతంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని అరెస్టు చేసే సమయంలో కేంద్ర సర్కారు నోటీసులు ఇచ్చిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.
చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా స్పందించారు. బాబు అరెస్టు బాధాకరమని అన్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు గురువారం మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. గవర్నర్ అనుమతి లేకుండా మాజీ ముఖ్యమంత్రిని, ప్రతిపక్ష నాయకుడిని అరెస్టు చేయడం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రులు పదవిలో ఉన్న సమయంలో అనేక నిర్ణయాలు తీసుకుంటారని, ప్రజల అవసరాల కోసం సౌకర్యాల కోసం, అభివృద్ధి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని మంత్రి పువ్వాడ తెలిపారు. అలాంటి వాటిని సాకుగా చూపి అరెస్టులు చేయడం సరికాదన్నారు. రాజకీయాల్లో కక్షసాధింపు చర్యలు మంచివి కావని పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే బాబును అరెస్ట్ చేయడం దారుణం అన్నారు. కావాలని కక్ష పూరితంగానే అరెస్టు చేసినట్లు తెలిపారు. నేరం చేస్తే అరెస్టు చేయడాన్ని ఎవరూ కాదనరని.. అయితే ఎఫ్ఐఆర్ లో పేరు కూడా లేకుండా వ్యక్తిని అరెస్టు చేయడమే అర్థం కావట్లేదని చెప్పారు. అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనని.. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. అలాగే చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందన్నారు. ఈ అరెస్టుతో ఏపీ ప్రజల్లో చంద్రబాబుకి మైలేజీ వచ్చిందని బండి సంజయ్ పేర్కొన్నారు.
"తప్పు చేసిన వారిని అరెస్టు చేస్తే ఎవరు కూడా తప్పు పట్టరు. కానీ ఎఫ్ఐఆర్ ల పేరు లేదని చెప్పి పోలీసులే స్పష్టం చేస్తున్నరు. ఎఫ్ఐఆర్ లో పేరు లేని వ్యక్తిని, గతంలో ముఖ్యమంత్రిని ఆదర బాదరగా అట్ల అరెస్టు చేయాల్సిన అవసరం లేదు. రాజకీయ పగలు, రాజకీయ ప్రత్యర్థులు ఉంటే ఏ పార్టీ, ఎవరైనా కూడా నేరుగా తలపడతరు. కానీ ఎఫ్ఐఆర్ లో పేరు లేని వ్యక్తిని ఈ విధంగా అరెస్టు చేసి రిమాండ్ చేయడం అది వాళ్లు తవ్వుకున్న గోతిల వాళ్లే పడుతున్నరు. ఏడ పోయినా ఇది తప్పని అంటున్నరు. చంద్రబాబును అరెస్ట్ చేయడం తప్పని ప్రతీ ఒక్కళ్లు అంటున్నరు. ఎవరైనా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. అరెస్ట్ చేయాల్సిందే. కానీ ఇది కక్ష పూరితంగా అరెస్ట్ చేసిన విషయం స్పష్టంగా కనపడుతుంది. అటువంటప్పుడు ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తున్నది. రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ఇందులో ఇన్వాల్స్ అవుతున్నరు. జీ20 సదస్సు అంత గొప్పగా జరిగితే.. నువ్వు ఆరోజే అరెస్ట్ చేస్తివి. తెలుగు మీడియా మొత్తం డైవర్ట్ అయ్యే. తెలుగు రాష్ట్రాల ప్రజలు కనీసం జీ20ని వీక్షించే పరిస్థితి లేదు ఆరోజు. ఎంత దుర్మార్గం అది. ఆరోజే దొరికిందా నీకు. చంద్రబాబు అరెస్టు టీడీపీకి మంచి మైలేజీ ఇస్తది. అని బండి సంజయ్ అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)