Telangana ACB: అవినీతి తిమింగలాలపై ఏసీబీ యుద్ధం - ఈ దాడులు ట్రైలర్లే - అసలు బడా బాబుల సంగతి త్వరలో తేల్చబోతున్నారా?
ACB Raids 2026: తెలంగాణలో అవినీతి తిమింగలాలపై ఏసీబీ భారీ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. ప్రత్యేకంగా మ్యాపింగ్ చేసినట్లుగా వారానికొకరిని టార్గెట్ చేస్తోంది. ముందు ముందు ఇంకా పెద్ద ఆపరేషన్లు చేయనున్నారా?

Telangana ACB Mapping Corrupt Government Officials: తెలంగాణలో గత కొద్ది రోజులుగా జరుగుతున్న యాంటీ కరప్షన్ బ్యూరో మెరుపు దాడులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉన్నతాధికార వర్గాల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఒకవైపు ల్యాండ్స్ అండ్ సర్వే డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి ఇళ్లలో దొరికిన రూ. 150 కోట్ల మార్కెట్ విలువ గల అక్రమాస్తులు, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు భుజంగరావు, రోడ్లు-భవనాల శాఖ ఈఎన్సీ మోహన్ నాయక్, తాజాగా నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లా రెడ్డి ఇళ్లపై దాడులు... ఇవన్నీ ఏదో యాదృచ్ఛికంగా జరుగుతున్న సోదాలు కావు. దీని వెనుక అత్యంత పక్కాగా, వ్యూహాత్మకంగా సాగుతున్న ఒక ‘మెగా ఆపరేషన్’ ఉందనేది స్పష్టమవుతోంది. సర్వీసులో ఉండి ప్రజలను పీడించి, ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తూ, బినామీల పేర్లతో వందల కోట్లు వెనకేస్తున్న అవినీతి తిమింగలాల పై ఏసీబీ ఇప్పుడు ఒక అప్రకటిత యుద్ధాన్ని ప్రకటించింది.
అందుతున్న అంతర్గత సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో అత్యంత కీలకమైన, ప్రజా సంబంధాలు ఎక్కువగా ఉండే రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పోలీస్, మైనింగ్, ఎక్సైజ్, మున్సిపల్, నీటిపారుదల వంటి కీలక శాఖల్లోని అవినీతి అధికారుల బయోడేటా పై ఏసీబీ నిశ్శబ్దంగా ఒక సమగ్రమైన మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో చక్రం తిప్పి, అడ్డగోలుగా లంచాలు మరిగి, భూ దందాలు మరియు అవినీతి పనులకు సహకరించిన కింది స్థాయి సిబ్బంది నుంచి అత్యున్నత స్థాయి ఐఏఎస్ అధికారుల వరకు ఒక ప్రత్యేక బ్లాక్ లిస్ట్ సిద్ధమైంది. ఎవరెవరు ఎక్కడెక్కడ బినామీల పేర్లతో భూములు కొన్నారు, వేల చదరపు అడుగుల్లో విలాసవంతమైన భవనాలు నిర్మించారు, వేరే రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారనే అంశాలపై ఏసీబీ ఇంటెలిజెన్స్ విభాగం పక్కాగా ఆధారాలు సేకరించింది.
ఒక్కొక్కరిగా బయటకు.. లెక్కలు తేల్చడమే లక్ష్యం
ఈ మ్యాపింగ్ ఆధారంగానే ఇప్పుడు ఏసీబీ వన్ బై వన్ ఆపరేషన్స్ చేపడుతోంది. సర్వే డిపార్ట్మెంట్ అధికారి నరహరి ఇంట్లో అట్టకపై దాచిన రూ. 1.54 కోట్ల నగదు, కేజీల కొద్దీ బంగారం, వందల కోట్ల విలువైన ఓపెన్ ప్లాట్లు, ఐదు ఫ్లాట్లు బయటపడటం.. సామాన్యులను పీడించి సంపాదించిన సొమ్మేనని అధికారులు నిర్ధారించారు. కేవలం కింద స్థాయి అధికారులనే కాకుండా, అవినీతికి సహకరించిన పెద్ద తలకాయలను కూడా చట్టం ముందు నిలబెట్టేలా ఈసారి వ్యూహం పన్నారు. చట్టంలో ఉన్న లొసుగులను వాడుకుని తప్పించుకోకుండా, ‘ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్’ కింద పక్కా సాక్ష్యాలతో కోర్టుకు సమర్పించేలా రికార్డులను ఎకనామిక్ అఫెన్సెస్ విశ్లేషకులతో తనిఖీ చేయిస్తున్నారు.
ముందు ముందు చాలా పెద్ద స్థాయి అధికారులే టార్గెట్?
ఇప్పటివరకు జరిగిన దాడులు కేవలం ‘ట్రైలర్’ మాత్రమేనని, అసలు సినిమా ముందు ముందు ఉందనే సంకేతాలు ఏసీబీ వర్గాల నుంచి వస్తున్నాయి. రాబోయే రోజుల్లో సచివాలయం లోని కీలక స్థానాల్లో కూర్చున్న హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ తో పాటు కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఇళ్లను కూడా టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రజా ఆస్తులను బినామీలకు లేదా కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడంలో కీలకపాత్ర పోషించి, ఆ ముసుగులో తాము కూడా వందల కోట్లు మేసిన పెద్దల చిట్టా ఇప్పుడు ఏసీబీ టేబుల్ పై ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో జరిగిన భూ దందాల్లో వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ భారీ ఆపరేషన్ల వెనుక రాజకీయ సంకల్పంతో పాటు వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే బలమైన కోరిక కనిపిస్తోంది. సాధారణంగా ఏసీబీ అంటే కేవలం రూ. 10 వేలు, రూ. 50 వేలు లంచం తీసుకునే చిన్న ఉద్యోగులను పట్టుకునే సంస్థ అనే ముద్ర ఉండేది. కానీ, గత కొద్ది నెలలుగా ‘డిస్ప్రపోర్షనేట్ అసెట్స్’ కేసులపై ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించడం, ఒకేసారి 11 నుండి 15 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించేలా బలగాలను మోహరించడం గమనిస్తే.. ఉన్నతాధికారుల అవినీతి నెట్వర్క్ను వేళ్లతో సహా పెకిలించాలనేది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ దాడుల వల్ల ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం పెరగడమే కాకుండా, ప్రజల్లో చట్టంపై నమ్మకం రెట్టింపవుతుంది.
బయటపడలేని విధంగా చర్యలు ఉండాలి !
కేవలం దాడులు చేసి ఆస్తులు సీజ్ చేయడమే కాకుండా, సదరు అవినీతి అధికారుల ఆస్తులను ప్రభుత్వం తక్షణమే జప్తు చేసి, వారిని సర్వీసు నుంచి శాశ్వతంగా తొలగించేలా కఠిన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో మిగిలిన అధికారులు లంచాలు ముట్టడానికి భయపడతారు. ప్రజాధనాన్ని లూటీ చేసిన ప్రతి రూపాయిని తిరిగి ప్రభుత్వ ఖజానాకు రాబట్టేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ జరిపించాలన్నది సాధారణ ప్రజల డిమాండ్.
Before You Go
Adulterated Paneer in Hyderabad | పనీర్ పేరుతో మోసం..హైదరాబాద్లో భారీ దాడులు
ట్రెండింగ్ వార్తలు






















