Telangana CM రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కొట్టివేత
Relief for Revanth Reddy in SC/ST Atrocity Case | గతంలో దాఖలైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు తీర్పును సీజేఐ ధర్మాసనం సమర్థించింది.

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నుంచి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయగా, ఆ నిర్ణయాన్ని తాజాగా సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. సోమవారం ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్యా బాగ్చి, జస్టిస్ వీఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసు నేపథ్యం ప్రకారం.. 2016 జనవరి 12న అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్రెడ్డి ప్రోద్బలంతో ఎ.కొండల్రెడ్డి, ఇ.లక్ష్మయ్య అనే వ్యక్తులు హైదరాబాద్ గోపనపల్లి సర్వే నం.127లోని సొసైటీ భూముల్లో ఒక గదిని జేసీబీతో ధ్వంసం చేశారని ఆరోపణలు వచ్చాయి. అందుకు అడ్డుచెప్పిన తనను కులం పేరుతో దూషించారని ఎన్.పెద్దిరాజు అనే వ్యక్తి గతంలోనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేశారు. ఈ కేసు ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టివేయడంతో, పెద్దిరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సోమవారం (ఫిబ్రవరి 16న) జరిగిన విచారణలో ధర్మాసనం ఈ కేసును రాజకీయ ప్రేరేపితం అంశంగా పేర్కొంది. రాజకీయ కక్షల కోసం న్యాయస్థానాలకు రావొద్దని హితవు పలికింది. రేవంత్రెడ్డి రెచ్చగొట్టినట్లు ఇద్దరు సాక్షులు చెప్పారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించగా, సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్యా బాగ్చి ఆ వాదనతో ఏకీభవించలేదు. ఆ సాక్షులు కేవలం విన్న మాటల ఆధారంగా చెప్పారని.. ప్రత్యక్షంగా చూశారని ఆధారాలు లేవని ధర్మాసనం పేర్కొంది. ఈ విచారణలో ప్రభుత్వం తరఫున న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు.
ఘటన జరిగిన రోజున రేవంత్రెడ్డి అక్కడ ఉన్నట్లు ఎవరూ చూడలేదని.. గదిని జేసీబీతో కూల్చిన వాళ్లు సైతం ఆయన చెప్పడం వల్లే వచ్చాం అని చెప్పి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని.. అలాంటి ఆధారాలు ఏమీ లేవని ధర్మాసనం పేర్కొంది. కేవలం ఛార్జిషీట్ దాఖలు చేసినంత మాత్రాన చర్యలు తీసుకోవాలని లేదు. సాక్ష్యాలు, ఆధారాలు సరిగ్గా ఉంటేనే విలువ ఉంటుందని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది.
రాజకీయ, వ్యక్తిగత కారణాలతో కేసులు ఫిర్యాదు చేసి కోర్టులను దుర్వినియోగ చేయాలనుకోవడం సరికాదని, పిటిషన్ అసలు ఉద్దేశం ఏంటో కోర్టులు అర్థం చేసుకుంటాయన్నారు. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ.. పిటిషన్ను కొట్టవేస్తూ సీజేఐ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి ఊరట లభించింది.
























