Pawan Kalyan Letter to Revanth Reddy: పోక్సో చట్టం అమలుపై కీలక సూచనలు - సీఎం రేవంత్కు పవన్ కల్యాణ్ ఐదు పేజీల లేఖ
Pawan Kalyan Deputy CM Letter Telangana CM: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలకమైన లేఖ రాశారు. పోక్సో చట్టం కఠినతరం, నేరస్థులపై రౌడీ షీట్లు, నిర్ణీత గడువులో దర్యాప్తుపై కీలక సూచనలు చేశారు.

Janasena Telangana POCSO Act Suggesstions: పోక్సో చట్టం అమలును మరింత పటిష్టం చేయాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ ఒక కీలక లేఖ రాశారు. బాలల భద్రత, గౌరవం, భయం లేని జీవన హక్కు రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని ఆయన తన లేఖలో గుర్తు చేశారు. పోక్సో కేసులను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
నేరస్తులు బాధితులను, వారి కుటుంబాలను బెదిరించే ధోరణి పెరుగుతోందని పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో ఒక పోక్సో నిందితుడు బెయిల్పై బయటకు వచ్చి, బాధితురాలితో పాటు ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసిన ఉదంతాన్ని ఆయన ఉదాహరణగా చూపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, బాధితులకు రక్షణ కల్పించే పటిష్టమైన యంత్రాంగం రాష్ట్రంలో అవసరమని ఆయన స్పష్టం చేశారు.
పోక్సో కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయడానికి పలు కీలక సూచనలను ఆయన ఈ లేఖలో పొందుపరిచారు. దర్యాప్తు అధికారులకు బాలల పట్ల సున్నితమైన వైఖరి, ఫోరెన్సిక్ , డిజిటల్ సాక్ష్యాల సేకరణలో ప్రత్యేక శిక్షణ ఉండాలన్నారు. బాధితుల వైద్య పరీక్షలు 24 గంటల్లోపు జరగాలి . సాక్ష్యాల సేకరణలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. పోక్సో కేసుల దర్యాప్తు , ఛార్జిషీట్ దాఖలు నిర్ణీత కాలవ్యవధిలో 60-90 రోజుల్లో పూర్తి కావాలన్నారు. నిందితులకు బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి సమగ్రమైన నివేదికలు సమర్పించాలి, అలాగే బాధితులకు రక్షణ కల్పించే 'విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్' ఉండాలని సూచించారు. నేర చరిత్ర ఉన్న నిందితులపై రౌడీ షీట్లు తెరిచి, వారిపై నిరంతరం నిఘా ఉంచాలనిసూచించారు.
Every child has the right to safety, dignity and justice.
— JanaSena Party (@JanaSenaParty) July 15, 2026
Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh, Sri @PawanKalyan Garu has written a letter to the Hon'ble Chief Minister of Telangana,Sri @revanth_anumula garu, urging stronger and more effective implementation of the… pic.twitter.com/E0cmgELJQ8
ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి సమగ్రమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ జారీ చేయాలని, జిల్లా , రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ సెల్స్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. పాఠశాలలు, వసతి గృహాలు, మరియు పూజా స్థలాల్లో పనిచేసే వారిపై ఆరోపణలు వస్తే, నిబంధనల ప్రకారం వెంటనే పోలీసులకు నివేదించేలా ప్రోటోకాల్ ఉండాలని ఆయన సూచించారు. పోక్సో కేసులను సాధారణ పరిపాలనా వ్యవహారాలుగా చూడకూడదని, ప్రతి ఫిర్యాదుపై అత్యంత సున్నితంగా, త్వరితగతిన చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. తన సూచనల అమలుపై తీసుకున్న చర్యలను 30 రోజుల్లోపు నివేదిక రూపంలో తెలియజేయాలని కోరుతూ, తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ఆదర్శంగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ట్రెండింగ్ వార్తలు






















